- దళిత యువకుడి శిరోముండనం కేసులో కీలక సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజి
- దాడి చేసిన కర్రలు, రాడ్, కత్తిరించిన జుట్టు స్వాధీనం
విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ) : సినీనిర్మాత నూతన్నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం కేసులో విశాఖ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఏడుగురిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేశారు. వారిలో నూతన్నాయుడి భార్య సహా నలుగురు మహిళలు ఉన్నారు. దీనికి సంబంధించి విశాఖ పోలీసు కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నంలో నూతన్నాయుడి ఇంట్లో శ్రీకాంత్ గతంలో పనిచేసి మానేశాడు. నూతన్నాయుడు భార్య ప్రియమాధురి సెల్ఫోన్ పోయిన విషయమై శుక్రవారం అతణ్ని పిలిపించి ప్రశ్నించగా, తాను దొంగతనం చేయలేదని చెప్పాడు. ప్రియమాధురి, హౌస్కీపింగ్ పర్యవేక్షకురాలు ఇందిరారాణి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేశాడని దుర్భాషలాడుతూ అక్కడున్నవారు శ్రీకాంత్ను కింద కూర్చోబెట్టి అతని ఫోన్ తీసుకుని కర్రలు, రాడ్లతో కొట్టారు. ఇందిరారాణి కూడా కర్రతో ఇష్టారాజ్యంగా దాడి చేసింది. ప్రియమాధురి, సిబ్బంది వరహాలు, గంగాధర్, ఝాన్సీ, సౌజన్య ప్రోత్సహించారు. తర్వాత క్షురకుడు ఇప్పిలి రవికుమార్ని పిలిపించి అక్కడే శ్రీకాంత్కు గుండు కొట్టించారు.
గంటన్నర ఫుటేజి విడుదల
ఘటనపై బాధితుడు శ్రీకాంత్ పెందుర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగానే పోలీసులు వివరాలను సేకరించారు. నూతన్నాయుడు ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజిలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తులో ఫుటేజిలు కీలకంగా మారాయి. పోలీసులు సుమారు గంటన్నర నిడివిగల ఫుటేజిని విడుదల చేశారు. దాడులకు దిగిన కర్రలు, రాడ్తో పాటు కత్తిరించిన జుట్టునూ స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం నూతన్నాయుడు భార్య ప్రియమాధురితో పాటు దాడులకు పాల్పడిన ఇందిరారాణి, క్షురకుడు రవికుమార్, ఇతర ఉద్యోగులు వరహాలు, బాలగంగాధర్, ఎం.ఝాన్సీ, కె.సౌజన్యలను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. పర్యవేక్షకురాలు ఇందిరారాణి విపరీతమైన కోపంతో దాడులకు దిగడం వెనుక వేరే కారణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
Courtesy Eenadu