– పోలీసుల ముందే సర్పంచ్, వార్డుమెంబర్లపై దౌర్జన్యం
– ప్రభుత్వ భూమి కబ్జా అడ్డుకున్నందుకు కక్షసాధింపు
– రక్షణ కల్పించాలని సీపీఐ(ఎం) మహిళా సర్పంచ్ నిరసన
వంగూరు: ప్రభుత్వ భూమి కబ్జా అడ్డుకున్నందుకు పలువురు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కక్షసాధింపుకు దిగారు. సీపీఐ(ఎం) దళిత మహిళా సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురి తలలకు గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా వంగూ రు మండలం రంగాపూర్లో గ్రామంలో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల ముందే కొందరు వ్యక్తులు దళితులపై దాడికి తెగబడటం గమనార్హం. స్థానికులు, బాధితుల వివరాల ప్రకారం… రంగాపూర్ సర్పంచ్గా సీపీఐ(ఎం) తరపున దళితురాలైన ఝాన్సీ గెలుపొందింది. దీన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా ఆమెను దెబ్బతీయాలని కొంతమంది కుట్రపన్నారు. ఇటీవల గ్రామ కంఠానికి చెందిన భూమిలో ప్రకృతి వనాలను నిర్మించేందుకు జీపీ పాలకవర్గం తీర్మానించింది.
అయితే ఆ స్థలంపై కన్నేసిన కొందరు ప్రకృతి వనాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ధ్రువపత్రాలు కూడా అందజేశారు. దీని ఆధారంగా ప్రకృతి వనం ఏర్పాటు కోసం స్థలాన్ని శుభ్రం చేయించారు. తట్టుకోలేకపోయిన ఆనంద ్రెడ్డి, నరసింహారెడ్డి, సాయిబాబు, రామస్వామి కలిసి అక్కడి కొందరు దళితులను రెచ్చగొట్టి వారితో గుడిసెలు వేయించారు.
ఇది సరికాదని చెప్పిన సర్పంచ్, వార్డు మెంబర్లపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో సర్పంచ్ చెల్లెలి తలకు గాయాలయ్యాయి. బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను విడిచిపెట్టి దళితులను అరెస్ట్ చేసేందుకు శుక్రవారం గ్రామానికి వచ్చారు.
పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామ పంచాయతీ ఎదుట సర్పంచ్ ఝాన్సీ నిరసనకు దిగారు. అభివృద్ధి పనులు చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. అప్పటికే అక్కడే ఉన్న అగ్రవర్ణాలవారు పోలీసుల ముందే దళితులపై మరొకసారి దాడికి దిగడంతో ఓ వ్యక్తి గాయాలై కిందప డిపోయాడు. ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇలా దాడి చేశారనీ, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనీ బాధితులు వాపోయారు. నింది తులను కఠినంగా శిక్షించాలని అక్కడే బైటాయించడంతో ఇరువురిపై కేసులు నమోదు చేశారు.
Courtesy Nava telangana