– మృతదేహంతో ఆందోళనలు
కర్నూలు కలెక్టరేట్ : ఈ నెల 16 ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బండి ఆత్మకూరు మండలం పరమటూరు సహకార సంఘంలో పని చేస్తున్న దళిత ఉద్యోగి జయ ప్రకాష్(40) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని శిక్షించాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో, బండి ఆత్మకూరు మండలం సంతజూటూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మృతదేహంతో ఆందోళనలు చేపట్టారు. అలాగే జూపాడుబంగ్లా, ఆదోని, శ్రీశైలంలో కెవిపిఎస్, ఎంఆర్పిఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ దళితుడైన జయ ప్రకాష్ను కులం కారణంగా అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి, చివరికి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన సహకార సంఘం సిఇఒ దశరథ రామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2015 నుంచి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తూ లేనిపోని అభాండాలు వేసి రూ.ఐదు లక్షలు వసూలు చేసి, మోసం చేసి అవమానానికి గురి చేశారన్నారు. జయప్రకాష్ తొమ్మిది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. సిఇఒ దశరథ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై 9 రోజులైనా ఇప్పటికి అరెస్టు చేయకపోవడం ఆధిపత్య వర్గాలపై ఉండే ప్రేమకు నిదర్శనమన్నారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు ఆర్ పెద్దబాబు, విజయమ్మ, చంద్రశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డివారి నరసింహులు, నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షులు మేకల రాజు, మతుని భార్య భాగ్యలక్ష్మి, బంధువులు దొరస్వామి, క్రాంతి, సంపత్, చెన్నయ్య, ప్రసాదు, రమణ, జ్యోతి, లత, విజరు పాల్గొన్నారు.
బండి ఆత్మకూరు : సంత జుటూరు బస్టాండ్ వద్ద సహకార సంఘం ఎదుట కెవిపిఎస్, సిఐటియు, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. నాయకులు రత్నమయ్య, వెంకట సుబ్బన్న, ఏసేపులు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
జయప్రకాష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే బుడ్డా
సిఈఓ రామిరెడ్డి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన జయప్రకాష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితునిపై విచారణ జరిపించాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
శ్రీశైలం : జయప్రకాష్ చావుకు కారకులైన రామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు, ఎంఆర్పిఎస్, మాల ఐక్యవేదిక దళిత సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
జూపాడు బంగ్లా : దళితుడైన జయ ప్రకాష్ ఆత్మహత్యకు కారకుడైన రామి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పి లాజరస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కెవిపిఎస్ ఆఫీస్ నుం చి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి దిష్టిబొమ్మ దహనం చేశారు. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మరి స్వామి పాల్గొన్నారు.
ఆదోని : బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలోని పరమటూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో డైలీ వర్కర్గా పని చేస్తున్న దళితుడు జయప్రకాష్ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి.తిక్కప్ప డిమాండ్ చేశారు. పట్టణ నాయకులు కెకె.అంజి, బి.సతీష్, ఎం.మోహన్ పాల్గొన్నారు.
Courtesy Prajashakti