చిన్నారిని కొట్టి చంపేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్) : ఇళ్ల ముందు మలవిసర్జన చేస్తున్నారని ఇద్దరు దళిత చిన్నారులను శివపురి జిల్లాకు చెందిన ఓ గ్రామ పెద్దలు కొట్టి చంపిన ఘటనను మరువక ముందే… ఇలాంటి మరో దారుణం తాజాగా వెలుగు చూసింది! మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, భాగపుర్ గ్రామంలో గిరిజన సామాజికవర్గానికి చెందిన రామ్ సింగ్ కుమారుడికి ఏడాదిరన్నరేళ్ల వయసు. ఆడుకుంటూ పక్కనున్న మోహర్ సింగ్ ఇంటి పరిసరాలకు వెళ్లి, అక్కడే మల విసర్జన చేశాడు. దీంతో మోహర్ సింగ్, అతని కుమారుడు ఉమేర్లు తీవ్ర ఆగ్రహంతో రామ్ సింగ్ తో గొడవకు దిగారు. ఆ కాసేపటికే దుడ్డు కర్రలు తీసుకుని అతనిపై దాడి చేశారు. ఈ జగడంలో చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు! రామ్ సింగ్ కూ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆయనను బినాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు.
Courtesy Eenadu..