(దేశీదిశ పరిశోధన, విశ్లేషణా విభాగం)
కేంద్రప్రభుత్వ తాజా బడ్జెట్ దేశంలో అతధిక శాతంలో ఉన్న దళిత బహుజన పిల్లల సంక్షేమాన్ని విస్మరించింది.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పిల్లల సంక్షేమానికి కేటాయింపు నామమాత్రంగా అంటే 0.05 శాతం మాత్రమే పెరిగింది. అంటే గత బడ్జెట్ లోనే 3.24 శాతం నుంచి 3.29% అన్నమాట. మొత్తం గ్రాంట్ 91644.29 కోట్ల రూపాయలు. జాతీయ పిల్లల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కింద మొత్తం బడ్జెట్లో 5 శాతం కేటాయించాల్సి ఉండగా ఇది చాలా తక్కువగా ఉన్నదని పిల్లల హక్కుల రంగంలో పనిచేస్తున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, పిల్లల సంరక్షణ ఈ నాలుగు అంశాల కేటాయింపుల పైన అధ్యయనం చేసింది. మొదటి రెండు విభాగాల కేటాయింపులు తగ్గాయని ఈ విశ్లేషణలో వెల్లడయింది. విద్యకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు 68.2 శాతం నుంచి 68.54% అంటే స్వల్ప పెరుగుదల ఉంది. అయితే 2015-2016 బడ్జెట్లో 79.02 శాతంతో పోలిస్తే 10 పాయింట్లు తగ్గుదల ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. సమగ్ర శిక్షణ, మధ్యాహ్న భోజన పథకం, నవోదయ విద్యాలయ సమితి పథకాలకు ఇందులో నుంచే నిధులు వెచ్చిస్తారు.
బడ్జెట్లో పిల్లల ఆరోగ్యానికి గత ఏడాది కేటాయించిన 3.51 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. అంగన్వాడి సేవలు, లోకేషన్ మిషన్ కార్యక్రమాలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, బరువు తక్కువ సమస్యల్ని అధిగమింపచేస్తాయి. ఈ రెండింటికి 19 శాతం, 14 శాతం పెంపుదల చేసినప్పటికీ భారతదేశంలోని పిల్లల్లో నెలకొన్న తీవ్ర పౌష్టికాహార సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఏ మూలకూ చాలవు. తాజాగా బీహార్లో వందలాది మంది పిల్లల మరణాలు ఇందుకు ఉదాహరణ. జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టుకు 16 శాతం నిధుల కోతను విధించటం అన్యాయం. అంటే బాల కార్మికుల్ని తగ్గించటం ప్రభుత్వానికి ఇష్టం లేదేమో.
దేశంలోని సుమారు 50 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతతో బాధపడుతున్నారు. తత్కారణంగా ఎదుగుదలలేమి, మాటిమాటికీ వ్యాధుల బారిన పడటం వంటి సమస్యలు వీరిని జీవితకాలం వెంటాడతాయి. దళిత బహుజనులు, ఆడపిల్లలు ఈ సమస్యల బాధితుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు. అలాంటప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, వారి సంపూర్ణ అభివృద్ధికి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మల సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. మొత్తంగా ఇది మోడీ ప్రభుత్వం బాల సంక్షేమంపై అశ్రద్ధకు నిదర్శనం.