– 2019లో దినసరి కూలీల ఆత్మహత్యలు 32,563
– 23శాతం వారే..
– ఆ తర్వాత అత్యధికంగా…గృహిణులు, నిరుద్యోగులే
న్యూఢిల్లీ : దేశంలో 1,39,123 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో అత్యధికం దినసరి కూలీలేఉన్నారని తేలింది. 2019లో 32,563మంది (23శాతం) దినసరి కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. రైతు ఆత్మహత్యల సమాచారాన్ని ఇందులో పొందుపర్చలేదు. కాగా ఆరేండ్లుగా దినసరి కూలీల్లో ఆత్మహత్యలు గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. తమిళనాడు(5,186), మహారాష్ట్ర (4,128), మధ్యప్రదేశ్ (3,964), తెలంగాణ (2,858) రాష్ట్రాల్లో దినసరి కూలీల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దినసరి కూలీల తర్వాత, అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో ‘వివాహిత మహిళలు’న్నారు. 2019లో 21,359మంది గృహిణులు ప్రాణాలు తీసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో ఇది 15.4శాతం.2014 నుంచి దినసరి కూలీల ఆత్మహత్యలు ప్రతిఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 12శాతం, 2015లో 17.8శాతం, 2016లో 19.2శాతం, 2017లో 22.1శాతం, 2018లో 22.4శాతం, 2019లో 23.4శాతం ఉందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొన్నది. 2014లో 15,735మంది దిన సరి కూలీలు ఆత్మహత్య చేసుకోగా, 2019నాటికి రెట్టింపైంది. ఆత్మహత్య ల్ని 9 కేటగిరీలుగా ఎన్సీఆర్బీ విడగొట్టి నివేదిక రూపొందించింది. దినసరి కూలీలు, గృహిణులు, రైతు ఆత్మహత్యలు, వృత్తినిపుణులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రిటైర్డ్ వ్యక్తులు, నిరుద్యోగులు, ఇతరులు…ఇలా 9 కేటగిరీలుగా విడగొట్టింది.
నిరుద్యోగుల ఆత్మహత్యలు రెట్టింపు
1995 తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయి. 2019లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 10.1శాతం (14,019మంది) ఉన్నాయి. 2018లో 8.37శాతంగా నమోదైంది. 1997లో ఆత్మహత్యలు (9.8శాతం) గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి.