– గతేడాది రబీలో 80శాతం మంది రైతులకు దక్కని పరిహారం
– బీమా కంపెనీలకు అందిన ప్రీమియం 7,764కోట్లు
– రైతులకు పరిహారంగా వచ్చింది… రూ.775కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుజేస్తున్న పంటల బీమా పథకాలు రైతుల కోసమా, ప్రయివేటు బీమా కంపెనీల లాభాల కోసమా ? అనే సందేహం కలుగుతున్నది. ఎందుకంటే ఆ బీమా కంపెనీలు రైతుల నుంచి వసూలు చేస్తున్నదానికి, క్లెయిమ్ సెటిల్మెంట్లకు(బీమా పరిహారం) పొంతన కుదరటం లేదు. ఉదాహరణకు, గత ఏడాది రబీ సీజన్లో(2019-20) ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్) కింద బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం రూ.7,764కోట్లు. ఈ సీజన్లో పంట నష్టపరిహారం కింద (ఆగస్టు 17నాటికి) రైతులకు దక్కిన బీమా పరిహారం రూ.775కోట్లు మాత్రమే ఉందని తేలింది. పంట నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల్లో 80శాతం మందికి పరిహారం రాలేదు. కేంద్ర వ్యవసాయ శాఖే పై గణాంకాల్ని విడుదలచేసింది. ప్రకృతి ప్రకోపం దాల్చినప్పుడు అక్కరకొస్తుందని ఆశలు పెట్టుకున్న రైతాంగాన్ని పంట బీమా పథకాలు తీవ్రంగా నిరాశకు గురిచేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రైతుకు దక్కింది ఎంత!
2019-20 రబీ సీజన్లో పంటల బీమా పథకంలో 1.8కోట్ల మంది రైతులు చేరారు. రూ.7,764కోట్లు ప్రీమియం వసూలు కాగా, అందులో రైతులు చెల్లించిన మొత్తం రూ.1317కోట్లు. మిగతా రూ.6447 కోట్లలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం కింద బీమా కంపెనీలకు చెల్లించాయి. దాదాపు రూ.70వేల కోట్ల రూపాయల విలువజేసే పంటలకు బీమా కల్పించినట్టు కేంద్రం పేర్కొన్నది. అయితే ఈ సీజన్లో ఆగస్టు 17నాటికి పంట నష్టపరిహారంగా రైతులకు రూ.775కోట్లు చెల్లించినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
పథకంలో కేంద్రం పేర్కొన్న నిబంధనల ప్రకారం, పంట నష్టం జరిగిందని బీమాను రైతు క్లెయిమ్ చేసుకుంటే…కంపెనీలు రెండు నెలల్లోగా సెటిల్మెంట్ చేయాలి. ఒకవేళ అలా జరగకపోతే…బీమా మొత్తంపై 12శాతం వార్షిక వడ్డీ (పెనాల్టీగా) కలుపుకొని సెటిల్మెంట్ చేయాలి. ఉదాహరణకు 2019-20 రబీ సీజన్ మే 2020తో ముగిసింది. 2020 జులై చివరికల్లా క్లెయిమ్ సెటిల్మెంట్ను కంపెనీలు పూర్తిచేయాలి. 75 శాతం క్లెయిమ్స్ ఆగస్టు 17వరకు సెటిల్మెంట్ కాలేదు. ఈ ఒక్క ఏడాదనే కాదు 2018 తర్వాత ఇప్పటివరకూ ఏ సీజన్లోనూ నిర్దేశిత గడువులోగా కంపెనీలు క్లెయిమ్ సెటిల్మెంట్ చేయటం లేదు. 12 శాతం వార్షిక వడ్డీని పెనాల్టీగా బీమా కంపెనీలు ఎప్పుడూ చెల్లించలేదు.
Courtesy: NT