* ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మండిపడ్డారు. పాలనలో వారు అనురిస్తున్న విధానాలను విమర్శించే వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిని బిజెపి లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన బ్లాగ్లో ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు కానీ, విశ్లేషకులు చేసే విమర్శలను, సూచనలను పాజిటివ్గా తీసుకోలేకుంటే దాని వలన పాలనా విధానాల్లో తప్పులు దొర్లుతాయని అన్నారు. ‘ ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ కార్యవర్గం నుంచి ఫోన్ వస్తుంది. చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అంటారు. లేకుంటే అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు విమర్శకులను లక్ష్యంగా చేసుకుంటారు. ఇటువంటి విపరీత దాడి వలనే ఎవరూ గొంతెత్తలేకున్నారు. ఈ విధంగా విశ్లేషకులు విమర్శల రూపంలో చెప్పే సూచనలను పట్టించుకోనంత వరకూ ప్రభుత్వం ఊహాల లోకంలోనే విహరిస్తూ ఉంటుంది. చారిత్రిక అభివద్ధి, ఇతరుల విదేవాలను వ్యతిరేకిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది.’ అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
Courtesy Prajasakthi..