– వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలని డీఎస్ఎంఎం నిర్ణయం
– ఢిల్లీలో రెండు రోజులపాటు డీఎస్ఎంఎం జాతీయ కమిటీ భేటీ
దేశంలో మోడీ పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని బిటి రణదివెభవన్లో రెండు రోజులపాటు దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగియి. ఈ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించింది. అనంతరం డీఎస్ఎంఎం నేతృత్వంలో దళిత సంఘాలు సమావేశం అయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 మధ్య దళితులపై 99 దాడులు చోటు చేసుకున్నాయని సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వ విధానాలు కారణంగా ఐఐటీల్లో దళిత, గిరిజన విద్యార్థుల డ్రాఫౌట్స్ పెరిగాయని, గత రెండేండ్లలో 1100 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఐటీల నుంచి వెనుదిరిగారని తెలిపాయి. రోహిత్ వేముల హత్య తరువాత వెనుకబడిన వర్గాల విద్యార్థుల రక్షణ కోసం చట్టం తేవాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపట్టాయి. 2014-15 నుంచి 2019-20 మధ్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం రూ.7.5 లక్షల కోట్లు కేటాయించిందని, కాకపోతే ఇటీవలి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించిందని మండి పడ్డాయి. ఈ సమావేశంలో డీఎస్ఎంఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణన్, రామచంద్రన్ డోమ్, జాతీయ నేతలు సుభాషిణీ అలీ, బివి రాఘువులు, వి. శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీి సోం ప్రసాద్, మాజీ లోక్సభ ఎంపీి అధిత్ రాజ్, కెవీపీిఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు కె.భాస్కర్, స్కైలాబ్ బాబు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో అధికమైన కుల హత్యలు: కేవీపీఎస్
తెలంగాణలో కుల దురహంకార హత్యలు పెరిగాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్, స్కైలాబ్బాబు చెప్పారు. రాష్ట్రంలో ఐదేండ్లలో దాదాపు 32 కుల దురహంకార హత్యలు జరిగాయని తెలిపారు. అసెంబ్ల్లీలో కులాంతర వివాహాల రక్షణ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో సబ్ప్లాన్ కింద కేటాయింపులు విడుదల కావటం లేదని అన్నారు. కనీసం, విడుదలైన నిధులు ఖర్చు కావటం లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, గిరిజన ఐఏఎస్ల పట్ల వివక్ష చూపుతున్నదని తెలిపారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా దళిత ఐఏఎస్ అధికారి ఆకుమూరి మురళి విఆర్ఎస్ తీసుకున్నారని గుర్తు చేశారు. ఆరు నెలల క్రితమే తమ పట్ల జరుగుతున్న వివక్షపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఐదుగురు ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేశారని, దానిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దళితులకు రూ.21 లక్షల విలువ చేసే మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ రెండు శాతం మందికి కూడా భూమి ఇవ్వలేదని తెలిపారు. విదేశీ, స్వదేశీ కంపెనీలకు, శారదా పీఠాధిపతికి ఇవ్వడానికి భూమి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పది ఎకరాలు కేటాయించి, స్టడీ సర్కిల్ పెట్టాలని కెవీపీఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఏపీిలో వైఎస్ జగన్ ప్రభుత్వం దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
(Courtacy Nava Telangana)