– పేరుతో కాలరాస్తున్న కార్మిక హక్కులు
– పని ఉన్న రోజే ఉద్యోగం…డబ్బులు…
– దినసరి వేతన జీవులుగా మారుతున్న వైద్య సిబ్బంది
– తెల్లారితే ఉపాధి కోసం మళ్లీ వెతుకులాటే
– హైదరాబాద్
కార్పొరేట్ ఆస్పత్రులు నయా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకవైపు రోగులను నిలువు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు…మరోవైపు వైద్య సిబ్బంది శ్రమను దోచుకుంటున్నాయి. అందుకు కొత్త, కొత్త దారులను వెతుక్కుతున్నాయి. అందుకు ప్రభుత్వాలు చట్టాల్లో కల్పించిన లొసుగులను ఆసరా చేసుకుంటున్నాయి. ‘కాల్ ఆన్ డ్యూటీ’ పేరుతో కార్మిక చట్టాలను, కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. రోజువారీ, షిప్టుల వారీగా వేతన చెల్లింపుల ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. తాత్కాలిక ఉద్యోగులుగా కొంత మందిని నియమించుకుని, మిగతా వారిని కాల్ ఆన్ డ్యూటీ పేరుతో రోజువారీ వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సిబ్బందికి అంతంత మాత్రమే చెల్లిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు…కాల్ ఆన్ డ్యూటీ పద్దతిని అమల్లోకి తెచ్చాయి.
పదుల సంఖ్యలో కార్పొరేట్ ఆస్పత్రులు, వందల సంఖ్యలో ప్రయివేటు ఆస్పత్రులు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు డాక్టర్లు మినహా మిగిలిన వైద్య, నర్సింగ్, పారామెడికల్ తదితర సిబ్బందికి చెప్పుకోదగ్గ జీతాలు లేవు. చాలా ఆస్పత్రుల్లో పీఎఫ్, ఇఎస్ఐ ఇతర సౌకర్యాలు అమలు కావడం లేదు. దీంతో సిబ్బంది తరచూ ఉద్యోగాలు మానేస్తుండటంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. నర్సులకు సరైన జీతాలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పలు కీలక విభాగాల్లో కొరత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. నగరంలో ప్రముఖ ఆస్పత్రిగా పేరుగాంచిన ఒక ఆస్పత్రిలో నర్సుల ప్రారంభ జీతం రూ 12,000 మాత్రమే. మిగిలిన సిబ్బంది జీతాలు కూడా ఇంచుమించు ఇదే రకంగా ఉన్నాయి. అత్యవసర సేవల విభాగం ఐసీయూలో సిబ్బంది విషయమైతే చెప్పనక్కర్లేదు. అక్కడ పని చేసే సిబ్బందికి ఇతరుల కన్నా నైపుణ్యం ఉన్నా…వారిని కూడా కాల్ ఆన్డ్యూ టీలో నియమించడం గమనార్హం. ఆయాఅత్యవసర విభాగాలకు కేసులు వచ్చిన సమయంలో మాత్రం షిఫ్టుల వారీగా, రోజు వారీగా చెల్లింపు ప్రాతిపదికన అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నాయి. అలాంటి వారికి రోజు కూలి కొంత ఎక్కువగా ఇస్తున్నప్పటికి…ఉద్యోగ భద్రత మాత్రం గాలిలో దీపంలా ఉన్నది. అయితే ఎక్కువ పనిగంటలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ, సీజీహెచ్ఎస్ లాంటి ఆరోగ్య పథకాల పరిధిలోకి వచ్చే కేసులతో పాటు ప్రయివేటు ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్న కేసులతో ఆదాయం బాగున్నప్పటికీ అందులో సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు మాత్రం యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, యూకే, కెనడా తదితర దేశాల్లో ఉన్న కాల్ ఆన్ డ్యూటీ పద్ధతి ఇటీవల కాలంలో మన దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో విస్తరిస్తున్నది. నర్సుల కొరత అధికంగా ఉండడంతో వారిని కాల్ ఆన్ డ్యూటీపై నియమించుకుంటున్నారు. సరాసరిగా రోజుకు ఐసీయూలో విధులు నిర్వహించేందుకు రూ.1000, ఇన్ వార్డులో విధులకు రూ 750, నైట్షిప్ట్ అయితే రూ 1200 ఇస్తున్నట్టు సమాచారం.
దీర్ఘకాలంలో అన్యాయం
కాల్ ఆన్ డ్యూటీ విధానంతో దీర్ఘకాలంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ విధానం వల్ల ఉద్యోగులకు రావాల్సిన హక్కులను అడగకుండా ప్రయివేటు యాజమాన్యాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు నిఘా పెంచి, చట్టాలు అమలయ్యేలా చూడాలని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల సిబ్బంది కోరుతున్నారు.
సిబ్బంది లేకుండా విభాగాలు నడిపే వారిపై చర్యలేవి?
తగిన సిబ్బంది పూర్తి స్థాయిలో నియమించుకోకుండా స్పెషాలిటీ విభాగాలు నడుపుతున్న ప్రయివేటు ఆస్పత్రుల వ్యవహారాన్ని అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోవార్డులో డాక్టర్లు,నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది ఎంత ఉండాలనే విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా నిర్దేశించింది. ఆ మేరకు సిబ్బంది లేకుండా స్పెషాలిటీ విభాగాలు నడుపుతున్న కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రయివేటు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Courtesy Navatelangana…