- కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలకు భారీగా జీఎస్డీపీ నష్టం
- భారం చెరో రూ.2.53 లక్షల కోట్లు
- ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం అంచనా
దిల్లీ : కొవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5.07 లక్షల కోట్ల మేరకు జీఎస్డీపీని (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) నష్టపోతున్నట్లు ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం అంచనా వేసింది. విభిన్నరంగాల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వచ్చే మొత్తం విలువనే స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు. ఇందుకోసం వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలను ప్రామాణికంగా తీసుకుంటారు. రాష్ట్ర పరిధిలో ఈ రంగాల ద్వారా జరిగే మొత్తం ఉత్పత్తిని లెక్కకట్టి ఆ ఏడాది రాష్ట్రం సాధించిన స్థూల ఉత్పత్తిగా పరిగణిస్తారు. ఇది ఎంత పెరిగితే అంత పురోగతి ఉన్నట్లు భావిస్తారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అదే ప్రమాణికం. మొత్తం 24 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన ఎస్బీఐ ఈ రాష్ట్రాలు ఉమ్మడిగా 37,52,717 కోట్ల మేర జీఎస్డీపీని కోల్పోనున్నట్లు పేరొంది. ఇందులో 43.75% మొత్తం పట్టణ ప్రాంతాల్లో, 56.25% గ్రామీణ ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.2,53,925 కోట్లు, తెలంగాణ రూ.2,53,512 కోట్లగా ఉంటుందని అంచనా వేసింది.
రుణ పరిమితులపై ప్రభావం..
ప్రస్తుత ధరల (కరెంట్ ప్రైసెస్) ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,72,782 కోట్లుగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 2018-19లో అది రూ.8,62,957 కోట్లుగా ఉంది. దీని ప్రకారం ఏడాదిలో రాష్ట్రం 12.72% వృద్ధి సాధించినట్లు లెక్క. ఇదే తరహాలో వృద్ధిరేటు నమోదైతే 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.12.37 లక్షల కోట్లకు చేరాల్సి ఉంటుంది. కానీ కొవిడ్ కారణంగా రాష్ట్రం రూ.2,53,925 కోట్లమేర జీఎస్డీపీ నష్టపోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ అంచనా వేసింది.
అదే నిజమైతే రాష్ట్ర వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావం పడుతుంది. జీఎస్డీపీ తగ్గితే ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవం ఏంటన్నది మున్ముందు పరిస్థితులే చెప్పాల్సి ఉంటుంది.
మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా..
* ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో 8,595 మెగావాట్ల మేర ఉన్న విద్యుత్తు పీక్ డిమాండ్ ఆగస్టు నాటికి 8,892 మెగావాట్లకు (+3.45) పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో డిమాండ్ 10,014 నుంచి 12,908 మెగావాట్లకు (28.89%) చేరింది.
* ఆంధ్రప్రదేశ్ గత ఏడాది సెప్టెంబరు 1 నాటికి బహిరంగ మార్కెట్ నుంచి రూ.17,078 కోట్ల రుణం తీసుకోగా ఈ ఏడాది అదే సమయానికి రూ.27,250 కోట్లు (60% అధికం) చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ రుణం రూ.14,300 కోట్ల నుంచి రూ.19,961 కోట్లకు (40% ఎకువ) చేరినట్లు పేర్కొంది.
* సెప్టెంబరు 1నాటికి ఏపీలో 37%, తెలంగాణలో 42% అధిక వర్షపాతం పడినట్లు తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం
తెలుగు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో జీఎస్డీపీ నష్టం 29%కి పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రభావం 71% మేర ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఎక్కువ జీఎస్డీపీని నష్టపోయే రాష్ట్రాల వరుసలో ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 8వ స్థానంలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ప్రజల కదలికలు పెరిగినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఏపీలో సాధారణ రోజులతో పోలిస్తే జులై 31 నాటికి 29.3% కదలికలు తగ్గగా, ఆగస్టు 28నాటికి అది 22కి పరిమితమైనట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తెలంగాణలో కదలికలు -31.2 నుంచి -26.7%కి చేరాయని తెలిపింది. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో 67.6%, తెలంగాణలో 50.9% కొవిడ్ కేసులు పెరిగినట్లు పేర్కొంది.
Courtesy Eenadu