– పెరిగిన చమురు ధరలు..
– పెట్రోల్ 15 పైసలు, డీజిల్ 10 పైసలు
– హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 79. 02పైసలు, ముంబయిలో రూ.80
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.02పైసలకు చేరింది. గురువారంతో పోలిస్తే 15 పైసలు పెరిగాయి. డీజిల్ ధర లీటర్కు రూ.73.29 పైసలకు చేరింది. గురువారంతో పోలిస్తే 10 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.34 పైసలు, ముంబయిలో రూ.80, కోల్కతాలో రూ.77.34 పైసలు, చెన్నైలో రూ.77.28 పైసలకు చేరింది. వరుసగా పదిరోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు(క్రూడాయిల్) ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్పైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడుల వల్ల ఉత్పత్తి తగ్గిపోయినట్టు చెబుతున్నారు. సౌదీ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు ఐదోవంతు ఈ దేశం నుంచేనన్నది గమనార్హం. మొత్తమ్మీద ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాలో ఐదు శాతం తగ్గినట్టు అంచనా.
Courtesy Navatelangana..