– భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికి తూట్లు
– వెల్ఫేర్ బోర్డులో రూ.2వేలకోట్లకుపైనే…దక్కింది అంతంతే
– సెస్ వసూళ్లల్లోనూ లాలూచీ
– అడ్డాల్లేవ్…రోడ్లే దిక్కు
– అక్కడా కనీస సౌకర్యాలు నిల్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. వారి సంక్షేమ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. భవన నిర్మాణాల సందర్భంగా వసూలు చేసే సెస్ విషయంలోనూ లాలూచీ ధోరణి ప్రదర్శిస్తున్నది. సంక్షేమ బోర్డు దగ్గర రూ.2 వేల కోట్ల నిధులున్నా…’అన్నీ ఉన్నా…అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా కూలీ పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే…8 లక్షల మందికి అసలు బోర్డులో సభ్యత్వమే లేని దుస్థితి నెలకొంది. అడ్డాల్లో కనీస సౌకర్యాలు లేని ధైన్యస్థితిలో కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నా..సర్కారు పట్టించుకోక పోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులున్నారు. అందులో 12 లక్షల మంది కార్మికులకే సంక్షేమ బోర్డులో సభ్యత్వం ఉంది. నాలుగు లక్షల మందిని బోర్డు కార్మికులుగానే గుర్తించలేదు. ఇటీవల బోర్డులో సభ్యత్వం పొందాలంటే ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. ఫలితంగా నాలుగు లక్షల మందికి రెన్యూవల్ కాలేదు. సభ్యులను చేర్పించటంలోనూ, రెన్యువల్ చేయించటంలోనూ కార్మికశాఖ అధికారులు అలక్షాన్ని ప్రదర్శించటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు రూ.10 లక్షల పైబడిన నిర్మాణదారుల నుంచి ఒక శాతం లేబర్ సెస్ను వసూలు చేసి వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాలి. ఆ నిధులను కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. కానీ, ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టులు, మెట్రో నుంచి సెస్ను వసూలు చేయడం లేదు. ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మిక సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సంక్షేమ బోర్డు వద్ద రూ.2 వేల కోట్లున్నాయి. ప్రభుత్వం సరిగ్గా సెస్ వసూలు చేయకపోవడం వల్ల రూ.3 వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి . పెండింగ్ లో లేకుండా , నిబంధన ల ప్రకారం వసూలు చేస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఆ దిశగా రాష్ట్ర సర్కారు కృషి లేదు. కేరళ, పంజాబ్, హర్యానా, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అరవై ఏండ్లు నిండిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు పింఛన్ కింద రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నారు. పంజాబ్లో భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం రూ.70 వేల వరకు ఎడ్యుకేషన్ లోన్లు, పదో తరగతి పిల్లలకు రూ.10వేలు, అంతకు కింది తరగతుల విద్యార్థులకు రూ.6 వేల చొప్పున స్కాలర్షిప్పులను ఇస్తున్నది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు కార్మికులకు
ద్విచక్రవాహనాలను అందజేస్తున్నాయి. కర్నాటకలో కిడ్నీ, క్యాన్సర్, ఎలర్జీ, కుష్టు వ్యాధులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా వైద్యసేవలను అందిస్తున్నాయి. మహారాష్ట్రలో కార్మికుల సొంత ఇంటికి నామమాత్ర వడ్డీతో రూ.5 లక్షల వరకు రుణాన్ని ఇస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో ఇవేమీ అమలు జరగటంలేదు. మన రాష్ట్రంలో పింఛన్ల కోసం 60 ఏండ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులు నాలుగు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. పనిచేయలేక కొందరు బిచ్చమెత్తుకుని బతుకుతున్న దుస్థితి. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే అరకొర సహాయం మాత్రమే అందుతున్నది. గుర్తింపు కార్డు లేదనే సాకుతో చాలా మందికి ఇవ్వట్లేదు.
ఇకనైనా…కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలి
ఆర్. కోటం రాజు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్
వెల్ఫేర్ బోర్డులో కార్మికుల ప్రతినిధులు అసలే లేరు. ఐదేండ్ల కాలంలో శిక్షణ పేరుతో రూ.30 కోట్లు ఖర్చుపెట్టామని చూపడమంటే… దారిమళ్లించినట్టే. భవననిర్మాణ కార్మికులందరికీ సభ్యత్వం కల్పిస్తామని చెప్పిన మాటలు నీటిమీది రాతల్లాగే మిగిలాయి. మన బోర్డు దగ్గర రూ.2 వేల కోట్లున్నా కార్మికుల సంక్షేమం అంతంతే. అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించాలనే నిబంధన బుట్టదాఖలైంది. పింఛన్ల కోసం లక్షలాది మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. బోర్డు కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలి. లేకపోతే, పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
శిక్షణ పేరుతో నిధుల దుబారా
కార్మికుల శిక్షణ పేరుతో కోట్లాది రూపాయలను తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు దుబారా చేస్తున్నదన్న ఆరోపణలున్నాయి. 2014-19 మధ్య కాలంలో భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ పేరుతో రూ.30 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. నాలుగైదేండ్ల పని అనుభవం ద్వారా మాత్రమే నిర్మాణ రంగంపై పట్టు సాధించగలరు. అధికారులు చెబుతున్నట్టు నెలనో, రెండు నెలలో శిక్షణ ఇస్తే పూర్తిస్థాయి నైపుణ్యం సాధ్యంకాదు. శిక్షణ పేరుతో నిధులు పెద్ద ఎత్తున గోల్మాల్ అయ్యాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
నిరుద్యోగుల, వలసల తాకిడితో తగ్గుతున్న కూలి, పనిదినాలు…పెరుగుతున్న రోగాలు
రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న నిరుద్యోగులు, బీహార్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వలసొస్తున్న వారితో భవన నిర్మాణ కార్మికులపై ప్రభావం పడుతున్నది. గతంలో వారానికి ఐదు రోజుల పాటు పనిదొరికేది. ప్రస్తుతం వారంలో మూడు రోజులే దొరుకుతున్నది. ఎక్కువ సంఖ్యలో కూలీలు అడ్డాల మీదకు వస్తుండటంతో మేస్త్రీలు, నిర్మాణదారులు కూలి తగ్గించుకుంటేనే పనికి తీసుకెళ్తున్నారు. 50 ఏండ్లు నిండిన వారు వేగంగా పనిచేయరని పిలవట్లేదు. అడ్డాల్లో, పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
Courtesy Navatelangana..