కులం సంకుచితమైనది. జాతివిశాలమైనది. కనుక కుల సంకుచితత్వానికి అతీతమైన జాతీయ విశాలధృక్పథం ఆదర్శవంతమైనదని చెప్పటంలో అగ్రకుల ఆధిపత్యశక్తుల అవకాశవాద కుట్ర ఇమిడి ఉంది. బహుళజాతి విదేశీ కంపెనీల గ్లోబల్ఆధిపత్యానికి, జాతీయ వనరుల లూటీకి వ్యతిరేకంగా దేశీయ ప్రజాప్రయోజనాల పరిరక్షణకు పర్యాయపదం కావాల్సిన భారత జాతీయవాదం, దేశభక్తివాదం అందుకు భిన్నంగా దేశంలోని అగ్రకుల దోపిడీవర్గాల నిరంకుశాధిపత్యదోపిడీ పీడనలను కప్పిపుచ్చే ముసుగుగా పరిమార్చబడింది. ఉదా: ఇరాన్ నుంచి చౌకగా ఆయిల్ దిగుమాగతి చేసుకొనే ఒప్పందాన్నిఅమెరికా ఆదేశాలకు తలొగ్గి రద్దుచేసుకోవడం దేశ ప్రజల ప్రయోజాలను, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టుపెట్టె జాతియ వ్యతిరేక దేశద్రోహ చర్యే. ఒకవైపున ఇలాంటి జాతివ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోడీ-షా ప్రభుత్వం మరోవైపు కుల వివక్షకు, అగ్రకుల అధిపత్యానికి, అన్యాయానికి, అణిచివేతకు గురవుతున్న అణగారిన కులాల సామాజికన్యాయ హక్కులను నిరాకరించడానికి జాతీయవాదాన్ని పోటీపెడుతున్నది. కులానికి ఉండే సంకుచిత స్వభావాన్ని అందుకు సాకుగా చూపుతున్నది. జాతీయవాదం దేశభక్తివాదం, జాతీయ సంస్కృతి పరిరక్షణ పేరిట మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల్లో ఎస్సి, ఎస్టీ , బిసిల కులాధారిత రిజర్వేషన్లను రద్దుచేస్తూ ఇటీవల బిజెపి పాలిత యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ.
అణగారిన కులాల అభ్యున్నతికి తోడ్పడుతున్న, కులప్రాతిపదికపై అమలవుతున్న రిజర్వేషన్ కోటా రద్దుచేసి, ఆర్ధిక ప్రాతిపదికపై బలహీనవర్గాలకు రిజర్వ్ చేసిన (EWS) కోటాను అమలుచేయడమంటే దొడ్డిదారిన అగ్రకులాధిపత్యానికి చోటివ్వడమే. ప్రస్తుతం రిజర్వేషన్ సదుపాయాన్ని పొందుతున్న ఎస్సి, ఎస్టీ, బిసిలను EWS రిజర్వేషన్ కోటా నుండి మినహాయించటం అంటే ఆ కోటాని అగ్రకుల ఆర్ధిక బలహీనవర్గాలకు పరిమితం చేసే అగ్రకులాధిపత్యమే అవుతుంది తప్ప కులాతీత జాతీయ ఆదర్శవాదం కాదు.
ఇటీవల 17వ లోక్ సభ ఎన్నిల్లో కులాతీత, మతాతీత, ప్రాంతీయాతీత జాతీయ ఆదర్శవాదమే అఖండ విజయం సాధించిందని భాజపా గప్పాలు కొట్టటం కూడా ఇలాంటిదే. యూపీలో ఎస్పీ, బీఎస్పీల కులాధారిత రాజకీయపొత్తులను భాజపా అనుసరించిన కులాతీత జాతీయవాదం చిత్తుచేసిందని చెప్పటంలో కూడా ఇదే మర్మం దాగివుంది. ఇక్కడ భాజపా అనుసరించింది యాదవులనుండి యాదవేతర బిసిలను, జాతావ్ ల నుండి జాతావేతార ఎస్సిలను కులప్రాతిపదికపై వేరుచేసి విభజించి పాలించే ఎత్తుగడల వైఖరేతప్ప కులాతీత జాతీయ ఆదర్శవాద వైఖరికాదు. మొన్నటి సెమీఫైనల్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకు కూడా సీటు ఇవ్వకుండా అన్నిసీట్లు హిందువులకే పరిమితం చేసి, మతప్రాతిపధికపై సమాజాన్ని విడగొట్టే మతవిద్వేష ఎత్తుగడలకు పాల్పడిన భాజపా వైఖరి మతాతీత జాతీయ వైఖరికాదు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా, (Autonomy Status) ఆర్టికల్ 371 ప్రకారం నాగాలాండ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న స్వయంప్రతిపత్తి హోదాలను రద్దు చేస్తాననడం, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా (Special Status) నెరవేర్చకుండా దగాచేయటం రాష్టాల ఫెడరల్ హక్కులను హరించే కేంద్ర నిరంకుశత్వమే అవుతుంది. అఖండ భారత హిందూ రాష్ట్ర స్థాపనకి అంకురార్పణ అవుతుంది. 17వ లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే జాతీయ విద్యావిధాన ముసుగులో, సాంస్కృతిక జాతీయవాదం పేరిట దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతాన రుద్దెందుకు ప్రయత్నం చేయటం భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టటమే అవుతుంది. దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విడగొట్టటమే అవుతుంది. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని నెలకొల్పాలని చూడటమే అవుతుంది.
కులవర్గ పీడిత ప్రజల, మైనారిటీల, మహిళల, వివిధ రాష్ట్రాల సమ్మిళిత సమగ్ర అభివృద్ధికి తోడ్పడే మౌలిక సమస్యల నుండి, మోడీ-షాల బూటకపు ఎన్నికల హామీలనుండి ఓటర్ల దృష్టిని మళ్లించటానికి రెచ్చగొట్టే పుల్వామా-బాలాకోట్ వైమానిక సర్జికల్ దాడుల భావోద్రేకపూరితమైన దేశభక్తివాదం సైతం రాజకీయయుక్తివాదమే తప్ప మరొకటికాదు.
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కులాతీత, మతాతీత, ప్రాంతీయాతీత భారత జాతీయవాదంతో, దేశభక్తివాదంతో ఘనవిజయం సాధించామని మోడీ-షాలు గప్పాలు కొట్టటం వెనక నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని గ్రహించడం అవసరం. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన సామాజిక ప్రజాస్వామ్య రిజర్వేషన్ హక్కులను, మతస్వేచ్ఛ హక్కులను, భాషా ప్రయుక్త – ఇండియా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ హక్కులను అణచివేసే కాషాయ ఫాసిస్టు ప్రమాదం పొంచివుందని గ్రహించడం ఎంతైనా అవసరం.