- సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్య ఖర్చులు
- అడ్డగోలుగా వసూలు చేసే ఆస్పత్రులపై టాస్క్ఫోర్స్
- సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం.. వెంటనే ఏర్పాటు
- శవాలను ఇచ్చేందుకు లక్షల వసూళ్లు దుర్మార్గం
- ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మేలు
- కేంద్ర పథకాన్ని పొగుడుకుంటూ అభాసుపాలు కావొద్దు
- కరోనా కోసం కేంద్రం ఇచ్చింది ఏమీ లేదు
- కేంద్ర మంత్రులు కథలు చెప్పడం మానండి: కేసీఆర్
హైదరాబాద్ : కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు చికిత్స చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, ప్రజల ఆరోగ్యానికి మించి ఇంకేదీ తమకు ప్రాధాన్యంకాదని, ఎంత డబ్బయినా ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అహోరాత్రాలు కష్టపడుతున్నామని, వైద్యసేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో బుధవారం కరోనాపై లఘుచర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. కేంద్రం అమలుచేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కంటే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ఆరోగ్యరఽశీ’ పథకమే బాగుందని, అందుకే ఆరోగ్య శ్రీని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భారత్ గొప్పదని చెప్పుకొని అభాసుపాలు కావొద్దని బీజేపీకి కేసీఆర్ సూచించారు. కరోనా తెలంగాణలోనే రాలేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి అని, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కరోనా విపత్తుతో మొదట్లో ఆర్థికంగా ఇబ్బంది పడినమాట వాస్తవమేనని, ఇప్పుడు అలాంటి సమస్య ఏమీలేదని అన్నారు. అన్లాక్ తర్వాత ఆర్థికంగా కోలుకున్న రాష్ట్రాల్లో తెలంగాణనే ముందంజలో ఉందని తెలిపారు.
లక్షల్లో ఫీజుల వసూలు దుర్మార్గం
విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కరోనా రోగుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ హాస్పిటల్ అయినాసరే బిల్లులు అడ్డగోలుగావేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శవాలను పీడించి లక్షలు దండుకోవటం మంచిదికాదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వసూలు చేస్తున్న ఫీజులు, ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల కార్మికుల సమస్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలో ప్రస్తావించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన అమూల్యమైన సూచనలు చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల నియంత్రణకు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం సాయంత్రం నుంచే టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగుతుందని తెలిపారు. టాస్క్ఫోర్స్ అఽధికారుల బృందం తీసుకునే చర్యలపై వారానికోసారి నివేదికను తయారుచేసి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ నేతలకు పంపిస్తామని చెప్పారు. ఉపాధి కోల్పోయిన రంగాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఉన్నంతలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆయా వర్గాలకు ఇద్దామని సీఎం చెప్పారు. దీనిపై ఎలా ముందుకెళ్తే బావుంటుందనే అంశంపై సలహాలు, సూచనలు పంపాలని భట్టి విక్రమార్కకు కేసీఆర్ సూచించారు. అదేక్రమంలో భారత్ బయోటెక్ సంస్థను పిలిపించి కూడా కరోనా వ్యాక్సిన్ గూర్చి మాట్లాడతామని సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం 200 బస్తీ దవాఖానాలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 150 బస్తీ దవాఖానాలు మంజూరుచేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. మూడు నెలల్లో కొత్త బస్తీ దవాఖానాల ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు.
రెవెన్యూ బిల్లుపై రోజంతా చర్చిద్దాం
అసెంబ్లీలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిందని, క్షుణ్ణంగా అందరు సభ్యులు అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం రోజంతా కొత్త రెవెన్యూ చట్టంపై చర్చిద్దామని, రాత్రి వరకైనా పర్వాలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సమయం సరిపోదని పార్టీలు భావిస్తే అదనపు సమయం కోసం స్పీకర్ను సంప్రదించాలని సూచించారు. కొత్త రెవెన్యూ బిల్లుపై ప్రతిపక్షాలు మంచి మార్పులు సూచిస్తే చేయడానికి సిద్థంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాల్సిన అవసరం తమకులేదని, ప్రజలే వారి గొంతునొక్కి చిన్నగా చేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మంచి మార్పులు సూచిస్తే చేస్తామని, తమకు సహకరిస్తే, తామూ సహకరిస్తామని అన్నారు.
కేంద్రం ఇచ్చింది శూన్యం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కరోనా విపత్తుకింద శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు తప్ప ఇచ్చింది ఏమీలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయంటూ అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ స్పందించారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ.265 కోట్లు మాత్రమే వచ్చాయని, రెండో విడతలో రూ.90 కోట్లు వచ్చినట్లు తెలిపారు. 647 వెంటిలేటర్లు పంపించారని, అయితే ఇవన్నీ రాష్ట్రానికి వచ్చే కోటాలో భాగమేనని స్పష్టంచేశారు. హైదరాబాద్కు కేంద్ర మంత్రులు వచ్చి ఏవో కథలు చెప్పి వెళ్తున్నారని, అవన్నీ బంద్ చేయాలని సూచించారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో నయాపైసా కూడా రాలేదన్నారు. కాగా ఉస్మానియా హాస్పిటల్ అంశం హైకోర్టులో ఉందని, తీర్పు వెలువడిన తర్వాత హైదరాబాద్లోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పాత సచివాలయం ఆవరణలో ఉన్న దేవాలయం, మసీదులను కూల్చివేశారని సభ్యులు లేవనెత్తగా సీఎం కేసీఆర్ స్పందించారు. కొత్త సెక్రటేరియేట్లో మందిర్, మసీదు, చర్చిని నిర్మిస్తామని ప్రకటించారు.
ముగ్గురు ఐఏఎ్సలతో టాస్క్ఫోర్స్
కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల వసూళ్లను తనిఖీలు చేసేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి జీవో జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి. దివ్య ఉన్నారు. ఈ టాస్క్ఫోర్స్ బృందం ఆస్పత్రులను తనిఖీ చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఎప్పటికప్పుడు నివేదికను అందజేయనుంది.
Courtesy Andhrajyothi