రాహుల్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా చీలిక
సోనియా గాంధీ రాజీనామా?… నేడు వర్కింగ్ కమిటీ కీలక భేటీ
పార్టీ పాతాళానికి దిగజారిపోతోంది
ఇప్పుడు కావల్సింది సమర్థ నాయకత్వం
క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేయాలి
గ్రామ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకూ
అన్ని విభాగాలను ప్రక్షాళించాల్సిందే
యువత సహా అన్ని వర్గాలకు దూరం
23 మంది సీనియర్ల లేఖాస్త్రం
లేఖ రూపకర్తల్లో ఆజాద్, సిబ్బళ్, హుడా
గాంధీలపై తిరుగుబాటు కాదని స్పష్టీకరణ
గాంధీలకు కాంగ్రెస్ సీఎంల మద్దతు
సోనియా, రాహుల్ నాయకత్వానికే ఓటు
ఆ నేతల తీరు బాధ్యతారాహిత్యం: భట్టి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో సంక్షోభం చెలరేగింది. చుక్కాని లేని నావలా తయారై, యువత సహా అన్ని వర్గాలకూ దూరమై, దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి పాతాళానికి దిగజారిపోతోందని, దీన్ని ఆపేందుకు సమగ్ర, సమూల, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు- అధినేత సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆమె- ఇక తాను ఇక ఎంత మాత్రమూ అధ్యక్ష పదవిలో కొనసాగబోనని, నేతలంతా కలిసి కట్టుగా కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
సోమవారంనాడు జరిగే పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి- సీడబ్ల్యూసీ కీలక సమావేశానికి ముందే ఆమె తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె గులాంనబీ ఆజాద్తో పలుదఫాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ ఆమె రాజీనామాను పార్టీ అధికారికంగా ధ్రువీకరించలేదు సరికదా, అది నిజం కాదని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
అయితే ఈ పరిణామాలు పార్టీని నిలువునా చీల్చాయి. ఒక వర్గం- రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని కోరుతుండగా, రెండో వర్గం దాన్ని వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పాలిత ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇతర నేతలు సోనియాకు, రాహుల్కు మద్దతు ప్రకటించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం ఎదుర్కొంటున్న పెద్ద సవాల్గా వృద్ధనేతలు దీనిని భావిస్తున్నారు.
5- పాయింట్ ఎజెండా
సీనియర్ నాయకులు తమ లేఖలో ఐదు కీలక అంశాలు లేవనెత్తి వాటిపై వర్కింగ్ కమిటీలో చర్చ జరగాలని కోరినట్లు సమాచారం. ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ కమిటీ సభ్యులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ కేంద్రమంత్రులు కలిసి ఈ లేఖను ఈ నెల ఏడోతేదీన రాశారు.
దీన్ని అధిష్టానంపై తిరుగుబాటుగానే కొందరు భావిస్తున్నప్పటికీ- తాము సోనియా, రాహుల్లకు వ్యతిరేకం కాదని, వారిని తాము విమర్శించడం లేదని ఆ లేఖలో సీనియర్లు స్పష్టంగా ప్రస్తావించడం విశేషం. వారిరువురి నాయకత్వాన్ని ప్రశంసిస్తూనే- సమష్టి నాయకత్వంలో వారి భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు.
దేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదగడం,, యువతీ యువకులు నిర్ణయాత్మకంగా నరేంద్రమోదీ నాయకత్వాన్ని సమర్థిస్తుండడాన్ని వారు ఈ లేఖలో అధిష్టానానికి గుర్తు చేశారు. పార్టీ రోజురోజుకూ ప్రజల్లో మద్దతు కోల్పోవడం, యువతకు పార్టీపై విశ్వాసం హరించుకుపోవడం తీవ్ర ఆందోళనకరమని వారు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో సమర్థమైన, క్షేత్రస్థాయిలో పనిచేసే క్రియాశీల నేత అవసరమని వారు తేల్చిచెప్పారు.
నాయకత్వ, అధికార వికేంద్రీరణ జరగాలని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరగాలని, ఒక వ్యవస్థాగత నాయకత్వ యంత్రాంగాన్ని ఏర్పర్చాలని, పార్టీ కోలుకునేందుకు సమిష్టి గా మార్గదర్శకత్వం అందించే నాయకత్వం కావాలని వారు స్పష్టం చేశారు. బ్లాక్ స్థాయి నుంచి ఢిల్లీ దాకా పార్టీని పూర్తిగా సంస్కరించాలని కోరారు.
లేఖపై సంతకం చేసిన వారిలో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, మనీష్ తివారీ, శశిథరూర్, వివేక్ టంకా, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపీందర్ సింగ్ హూడా, రాజీందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్విరాజ్ చౌహాన్, పీజే కురియన్, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలింద్ దేవర, రాజబబ్బర్, అరవిందర్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, కుల్దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి, సందీప్ దీక్షిత్ ఉన్నారు.
నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన తర్వాత రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ శ్రేణులు, నేతలు ఎంతగా విజ్ఞాపనలు చేసినా ఆయన తన రాజీనామా వెనక్కు తీసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చారు. విధిలేక- సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టారు.
తన స్థానంలో మరో నేత ను త్వరలో ఎన్నుకోవాలని ఆమె సూచించినప్పటికీ ఏడాది పూర్తయినా కొత్త నేత ఎన్నుకునే క్రమం ప్రారంభం కాలేదు. దీనితో పార్టీలో లుకలుకలు బయలుదేరాయి. ఈ ఏడాది మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో -గాంధీ కుటుంబానికి చెందని నేతను పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలని రాహుల్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సోనియా తనయ ప్రియాంకా వా ద్రా కూడా ఇదే విషయాన్ని యూపీలో సూచించారు.
మనమే ప్రత్యామ్నాయం కావాలి
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పునరుజ్జీవం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి శ్రేయస్కరమని, స్వాతంత్య్రం తర్వాత దేశం తీవ్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీకి ప్రజల్లో పట్టు క్రమంగా క్షీణిస్తోందని సీనియర్లు అభిప్రాయపడ్డారు.
దేశంలో బీజేపీ సంఘ్ పరివార్ మతతత్వ, విచ్ఛిన్నకర ఎజెండా, ఆర్థిక మాంద్యం, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు కడగండ్లు పెరగడం, సరిహద్దుల్లో సవాళ్లు, చైనాతో ఘర్షణలు, విదేశీ విధానం నీరుకారిపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేకపోతున్నదని వారు అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో పటుతరమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కావాలని, ఆ దిశగా పార్టీని తిరిగి నిలబెట్టాలని కోరారు. అఽధికార వికేంద్రీకరణ, రాష్ట్రాల యూనిట్లకు అధికారాలు కట్టబెట్టాలని కోరారు. 1970 ల్లో ఉన్న మాదిరిగా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు అవసరమని వారు డిమాండ్ చేశారు.
లేఖ సరికాదు: సీఎంలు
సీనియర్ల లేఖను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు- కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేశ్ బాఘేలా, అశోక్ గెహ్లాట్, వీ నారాయణ స్వామి సమర్థించలేదు. ఈ దశలో ఇలాంటి లేఖలు మరింత అయోమయానికి, కేడర్ దెబ్బతినడానికి దారితీస్తాయని వారు గట్టిగా అభిప్రాయపడ్డారు. అంతేకాక- సోనియా, రాహుల్ గాంధీలకు తమ మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర, హరియాణా పీసీసీ చీఫ్లు బాలా సాహెబ్ థొరాట్, సెల్జా, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కూడా సోనియాకు బాసటగా నిలిచారు.
ఏదో కొద్దిమందికి ఇష్టపడడం కాదు, పార్టీలో అంతా సమ్మతించే నాయకత్వం అవసరం. అది గాంధీలకు మాత్రమే ఉంది. వారు దీనికి అర్హులు. తనకు నచ్చినంతకాలం కొనసాగే అవకాశం సోనియాకు ఇవ్వాలి. ఆమె కాదనకున్నపుడు రాహుల్- పగ్గాలు చేపట్టాలి అని అమరీందర్సింగ్ స్పష్టం చేశారు. దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని అశోక్ గెహ్లాట్ వ్యక్తం చేశారు.
పార్టీకి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సవాళ్లు ఎదురైనా సోనియా, రాహుల్ గాంధీలే ఆశాకిరణాలుగా కనిపిస్తారు. మేమంతా మీ వెంటే… ఛత్తీ్సగఢ్ కార్యకర్తలు, నేతలు సోనియా వెంటే అని భూపేష్ బాఘేల్ ఓ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి లేఖలు పార్టీకి మంచి చేయవు సరికదా, చెరుపు చేస్తాయి. ఇది బీజేపీ కుట్ర. ఫేస్బుక్ వివాదాన్నుంచి అందరి దృష్టి మళ్లించడానికి బీజేపీ చేస్తున్న యత్నం అని పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
కాగా ఈ లేఖ చూస్తుంటే పార్టీలో కొందరు నేతలు పార్టీనుంచి గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని ప్రక్కన పెట్టి తామే నడపాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని రాహుల్ సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా ఈ నేతలు చేసింది ఏమీ లేదని, రాహుల్ గాంధీ ఒక్కరే మోదీని గట్టిగా విమర్శిస్తూ లోపాల్ని ఎత్తి చూపుతున్నారని ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధికి చెప్పారు.
రాహుల్ తప్ప మరొకరు పార్టీ అధ్యక్షబాధ్యతలు స్వీకరిస్తే పార్టీ మరింత దిగజారుతుందని, దేశమంతటా తెలిసిన నేత ఆయనొక్కరేనని తెలంగాణకు చెందిన నేత, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి తన బాసట ప్రకటించారు. కొంతమంది నేతలు మోదీ అభిమానులవుతున్నారని కర్ణాటక నేత సిద్దరామయ్య అన్నారు.
రాహుల్ గాంధీ తలుచుకుంటే రెండవసారే ప్రధాని అయ్యేవారని, లేదా మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రి అయ్యేవారని, కానీ ఆయన నిస్వార్థంగా పార్టీకి పనిచేయాలని నిర్ణయించుకున్నారని మరొక నేత చెప్పారు.
అధిష్టానంపై విమర్శలు
పార్టీ నాయకత్వాన్ని ఈ ఐదుపేజీల లేఖాస్త్రం కాస్తం త గట్టిగానే ఎండగట్టింది. నాయకత్వ అస్థిరత వల్ల పార్టీ బలహీనపడిందని, కార్యకర్తలు నైతిక ఆత్మస్థైర్యం కోల్పోయారని అంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం సేకరించడంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమర్థంగా మార్గదర్శకత్వం అందించలేకపోతున్నదని వారు విమర్శించారు. రాజకీయ పరిణామాలకు ప్రతిస్పందించడం తప్ప వర్కింగ్ కమిటీ చేస్తున్నది ఏమీ లేదని ఆక్షేపించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ఏనాడు చర్చలు జరగలేదని, వర్కింగ్ కమిటీలో కూడా చ ర్చను ప్రోత్సహించలేదని వారు ఆరోపించారు. రాహుల్ నిష్క్రమణ తరువాత పార్టీలో ఏ రకమైన క్రియాశీలత్వం లేదని, ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడమే తప్ప పార్టీ వైఖరేంటనేది ప్రజలకు తెలియకుండా పోయిందని దుయ్యబట్టారు. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కదా.. అని లేఖ రాసిన ఓ నేత వ్యాఖ్యానించడం విశేషం.
Courtesy Andhrajyothii