– కొండూరి వీరయ్య
ఏ ప్రణాళికకైనా కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. అది కావ్యంలా పాఠకులకు హృద్యంగా ఉండాలి. మత్తేభం, శార్దూలమో, సీస పద్యం లాగానో కాక కంద పద్యంలాగా తేలిగ్గా ఉండాలి. చదువుతుంటే పాఠకుల మనసులో దాని భావనలు హత్తుకుపోయేదిగా ఉండాలి. చుట్టూ వేగంగా మారుతున్న పరిణామాలకు మూలకారణాలను విప్పి చెప్పేదిగా ఉండాలి. కళ్లముందు కనపడుతున్న వాస్తవాలను సదరు ప్రణాళిక చదివే వరకు గుర్తించలేకపోయామే అన్న భావన కలగాలి. మన ప్రమేయం లేకుండానే మన ముందు జరుగుతున్న పరిణామాల్లో మనము కూడా ఎలా భాగస్వాములమవుతున్నామో విడమర్చి చెప్పేదిగా ఉండాలి. చివరిగా నిర్వేదంలో కూరుకుపోయిన జనావళిలిని నిద్రలేపి మరో ప్రపంచం సృష్టికై కదలించే శ్రీశ్రీ మహా ప్రస్తానంలా పాఠకుడిని కార్యోన్ముఖుడిని చేయాలి. అన్నింటినీ మించి నిత్యసత్యంగానూ, తానిత్యనూతనంగానూ ప్రపంచాన్ని చూసేందుకు కళ్లజోడులా పని చేయాలి. 1848 ఫిబ్రవరి 21న లండన్లోని లివర్పూల్ లో విడుదలైన కమ్యూనిస్టు ప్రణాళిక పైన చెప్పిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచ దశని, దిశని మార్చేసిన ఈ గ్రంధం రాసేనాటికి మార్క్స్ వయస్సు 29 ఏళ్లు. ఆయన సహచరుడు ఏంగెల్స్ వయస్సు 28 ఏళ్లు. రాజకీయ రచనల్లో కమ్యూనిస్టు ప్రణాళికకు దీటైన గ్రంధం మరోటి లేదు. యూరపన్ను ఓ భూతం ఆవహించింది అన్న తొలి వాక్యమే ప్రపంచంలో జరగబోయే పరిణామాల గురించిన హెచ్చరికగా ఉంటుంది. సమాధానం తెలిసిన తర్వాత కూడా చెప్పాలా వద్దా అన్న సందేహంతో కొట్టమిట్టాడుతూ భేతాళుడిని భుజాన మోస్తున్న విక్రమార్కుడిలా పాఠకుడు కూడా ఇంతటి దారుణమైన దాష్టీకమైన దోపిడీ వ్యవస్థను మనుగడ కొసాగంచటంలో నేను కూడా భాగస్వామిగా ఉండాలా, చరిత్ర నాపై మోపిన మోయలేని భారం కింద నలిగి పోవాలా లేక సాయుధుడినై చరిత్రను తిరగరాయాలా అన్న మీమాంస కమ్యూనిస్టు ప్రణాళిక చదువుతున్నప్పుడు పాఠకుడికి కలుగుతుంది.
కమ్యూనిస్టు ప్రణాళిక తొలి పాఠకుడికి అంటే 1848 నాటి యూరోపియన్ పాఠకుడికి మేధోమధన సమాచారం కాదు. తక్షణ కార్యాచరణకై పెట్టిన పొలికేక. భూస్వామ్య వ్యవస్థ గర్భం నుండి అప్పుడే పుట్టటానికి పురిటి నొప్పులు పడుతున్న బూర్జువా వ్యవస్థ తననను తాను నిలదొక్కుకోవటానికి కార్మికవర్గాన్ని పావులుగా మార్చుకుంటున్న వేళ ఆ మోసాన్ని కళ్లకు కట్టినట్టు విప్పి చెప్పి కార్మికుడిని బూర్జువా వర్గంపై తిరుగుబాటుకు కార్యోన్ముఖుడిని చేసిన వ్యూహ రచన కమ్యూనిస్టు ప్రణాళిక. నేటి యువత ముందు కూడా అదే పరిస్థితి ఉంది. కాలంతో పాటు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఉత్థాన పతనాలున్నాయి.
కానీ కమ్యూనిస్టు పార్టీలకు మర్గాదర్శనం చేయాల్సిన ప్రణాళిక మాత్రం శిలాశాసనంగా మిగిలే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తు అంధకారంగా మారుతోందని గుర్తించిన కోట్లాదిమంది యువకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కమ్యూనిస్టు ప్రణాళిక వెలుగులు ప్రసరిస్తూనే ఉంది.
గొప్ప భవిష్యత్తును ఊహించటం, దానికోసం వ్యూహరచన చేసుకోవటమే గొప్ప దార్శనికత కాదు. ఈ వ్యూహరచనను ఆచరణ సాధ్యం చేయటం, భావి తరాల మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేయటం వ్యూహరచన దార్శనికత గొప్పతనాన్ని, అమరత్వాన్ని తెలియచేస్తుంది. విముక్తి పోరాటాలకు, విప్లవోద్యమాలకు వెలుగు దివ్వెగా నిలిచిన కమ్యూనిస్టు ప్రణాళిక అటువంటి అమరత్వాన్ని సాధించింది. అందుకే రెండో శతజయంతికి చేరువవుతున్నా ఈ గ్రంధం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో స్ఫూర్తిదాయనిగా వెలుగుతూనే ఉంది. తొలి అడుగులు వేయటానికి కూడా నాడు కష్టపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ, దాష్టీకం, లాభాపేక్షతో సాగించే యుద్ధ కాంక్ష, వలసలు, ప్రపంచీకరణ, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని లాభార్జన కోసం పెట్టుబడి పాదాక్రాంతం చేసుకుంటున్న తీరును కమ్యూనిస్టు ప్రణాళిక రెండు శతాబ్దాల క్రితమే అక్షర సత్యంగా గుర్తించిందంటే ప్రణాళిక ప్రపంచీకరణ గురించి, హద్దుల్లేని పెట్టుబడి చలనం గురించి 1848లోనే మార్క్స్ ఏంగెల్స్ హెచ్చరించారు. దాంతో పాటు వచ్చే ముప్పును కూడా మన ముందుంచారు.
1970 దశకంలో కీన్సియన్ ఆర్థిక విధానాలు పెట్టుబడి లాభార్తిని తీర్చలేక పోయినప్పుడు పెట్టుబడిదారీ విధానం అవసాన దశకు చేరిందనీ, అభివృద్ధి చెందిన దేశాల్లోనే పూర్తి స్థాయి పెట్టుబడిదారీ సంబంధాలు విస్తరించలేకపోయింందనీ
అందువల్ల భూగోళం మొత్తాన్ని సాలీడులాగా చుట్టేస్తుందని మార్క్స్ చెప్పిన జోస్యం తప్పని కొట్టి పారేసిన మేధావులు కూడా ఉ న్నారు. ప్రపంచీకరణ ద్వారా చైనా, భారతదేశానికి చెందిన 20 కోట్ల మంది కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేయటానికి అవకాశం ఇచ్చింది. 2008 ద్రవ్య పెట్టుబడి సంక్షోభం తర్వాత లండన్లో జరిగిన ఆర్థికవేత్తల సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇంత మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు ఉండి కూడా కళ్ల ముందు రూపుదిద్దుకుంటున్న సంక్షోభాన్ని గుర్తించలేకపోయారా అని నిలదీసింది బ్రిటిష్ రాణి. 2008 ద్రవ్య పెట్టుబడ సంక్షోభం మార్క్స్ ఏంగెల్స్ ను, మార్క్సిజాన్ని మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని కల్పించింది.
కమ్యూనిస్టు ప్రణాళికను నేడు చదువుతున్న వారెవరైనా నాడు మార్క్స్ ఏంగెల్స్ లు వర్ణించిన పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు, నేడు నిత్య జీవితంలో 21వ శతాబ్దంలో చూసుస్తన్న లక్షణాలకు మధ్య చెప్పుకోదగ్గ తేడా లేకపోవటాన్ని ఇట్టే గుర్తిస్తారు. కమ్యూనిస్టు ప్రణాళిక
రాసే సమయానికి ఆవిరి యంత్రాలు భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టేందుకు ముందుకు సాగుతున్న సాధనాలుగా ఉ న్నాయి. భూస్వామ్య వ్యవస్థ శిధిలాల నుండి బతికి బయటపడిన రైతాంగం కార్మికులుగా అవతారమెత్తి ఆవిరి యంత్రాలతో ఏర్పాటైన కొత్త కర్మాగారాల్లో రోజుకూలికి కుదిరి ప్రపంచాన్ని మార్చాల్సిన కార్మికవర్గంగా అవతారమెత్తుతున్న కాలం అది. నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ నాలుగు శతాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన సమాజాన్ని, సామాజిక ఆర్థిక సంబంధాలను సవాలు చేస్తున్న ఆధునిక ఉత్పత్తి సాధనాలు ఏమిటి? కృత్రిమ మేధ. ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఇవన్నీ కలిసి అప్పటి వరకు పెట్టుబడిదారీ సమాజంలో “శిలేసుకు పోయిన సంబంధాలను” నిర్ద్వంద్వంగా పెకలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవే కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లు ” నిరంతరం తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ఆధునిక దశకు చేరుకుంటున్న ఉత్పత్తి సాధనాలు.”ఈ ఉత్పత్తి సాదనాలే “ఉత్పత్తి సబంధాలను నిరంతరం విప్లవాత్మకంగా మారుస్తూ అన్ని సామాజిక పరిస్థితులను పెకలించి వేస్తున్నాయి. అంతులేని ఆందోళనకు పునాదులేస్తున్నాయి.”
ఈరకమన పెకలింపే వర్గాలుగా చీలి ఉన్న సమాజాన్ని వర్గరహిత సమాజం దిశగా మార్చేందుకు నిరంతరం దోపిడీకి గురవుతున్న కార్మికవర్గాన్ని పురిగొల్పుతాయన్న అంచనాతోనే మార్క్స్, ఏంగెలు ఈ రకమైన సమూల మార్పులను, పెకలింపులను ఉత్సాహంగా ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందో చర్చిస్తూ కమ్యూనిస్టు ప్రణాళిక ” అంతిమంగా మనిషి తానేమిటో తన జీవన పరిస్థితులు ఏమిటో, వాటితో తనకున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు..” అని ప్రకటిస్తోంది. మనకున్న తప్పుడు అభిప్రాయాలను దూదిపింజల్లా ఎగరగొడుతూ సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాల్లో దిగజారుడుతనాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపచేస్తోంది. నేడు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది గొంతెత్తుతున్నారు. భరించలేని స్థాయిలో ఉన్న అసమానతలు, అడ్డులేని దురాశ, పపర్యావరణ పతనం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాల పతనం కూడా మన ముందు తొలుబొమ్మల్లా కదులుతూ కమ్యూనిస్టు ప్రణాళిక అంచనాను గుర్తు చేస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ” సమాజం స్థూలంగా రెండు శతృ శిబిరాలుగా చీలిపోతుంది. ఈ శిబిరాలు ఒకదానితో ఒకటి తలపడటానికి సన్నద్ధమవుతుంటాయి.” అన్న కమ్యూనిస్టు ప్రణాళిక వాక్యాలు కళ్ల ముందు కదిలాదక మానవు. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న శతకోటీశ్వరుల వద్ద ప్రపంచంలోని 90 శాతం సంపద పోగుపడ్డా ప్రపంచంలోని 99 శాతం జనాభాను పాలించే సామర్థ్యాన్ని కోల్పోతారని మార్క్స్ చేసిన హెచ్చరికను గుర్తు చేసుకునే సమయం ఇది. జీవితాలను యంత్రాలకు అప్పగించి నకనకలాడే కడుపులతో ప్రపంచ కార్మికవర్గం కదనరంగంలోకి దూకినప్పుడు ఈ శతకోటీశ్వరులు బందిఖానాల్లాంటి తమ ఖరీదైన విలాస భవనాల్లో తమను తాము బందీలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతారు.
ఈ పరిణామాలే కదా మనం రోజూ పత్రికల్లో గమనిస్తోంది… తమను తాము కాపాడుకోలేని శతకోటీశ్వరులు మొత్తం సమాజాన్ని కాపాడే నెపంతో రాజ్యాంగ యంత్రాంగాన్ని అంతకంతకూ తమకు రక్షణ కల్పించే సాయుధ దళంగా మార్చేస్తున్నారు. కోట్ల నోట్ల కట్టల నడుమ ఉన్నా జీవించే సాహసం చేయలేని వీళ్లే బాబాలు, ఆశ్రమాలను ఆశ్రయిస్తుంది. అమితోత్పత్తి సామర్థ్యం బరువుకు కుంగిపోతున్న పెట్టుబడిదారీ సమాజం గురించి చెప్తూ ప్రణాళిక ” ఉత్పత్తి, మారక సాధనాలను అనూహ్య స్థాయికి అభివృద్ధి చేసిన ఈ సమాజం తన మాటలతో తన ప్రపంచాన్ని శాసించలేక విఫలమవుతున్న ఓ ఇంద్రజాలికుడిని తలపిస్తుంది.” అని గుర్తు చేస్తుంది. మార్క్స్ నాడు చెప్పిన ఇంద్రజాలికులు నేడు కూడా మనకు కనిపిస్తారు. వీళ్లు తాము తయారు చేసే అప్లికేషన్లు, సెర్చ్ ఇంజన్లు,
రోబోట్లు, జన్యుసకంర విత్తనాలు, స్టాక్ మార్కెట్లో పేరుకుపోతున్న రుణదొంతర్లు (ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు) వంటి వాటి ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న ఈతిబాధలను చిటికెలో మాయం చేయవచ్చని భావిస్తారు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకున్న సహజ లక్షణంతో ఈ మంత్రాలకు చింతకాయలు రాలవని పదే పదే నిరూపిస్తూ వచ్చింది. కమ్యూనిస్టు ప్రణాళిక ఇటువంటి అపర కుబేరులకు నాడు ఎంత భయోత్పాతాన్ని కల్పించిందో నేడు కూడా అదేరకమైన భయోత్పాతాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఇప్పటి వరకు జరిగని చరిత్ర యావత్తూ వర్గ పోరాటాల చరిత్రే అని నిర్ధారిస్తోంది. ఇలా కమ్యూనిస్టు ప్రణాళికలో ఉన్న ప్రతి అంశం నేటి వాస్తవాలకు కూడా ప్రతిబింబాలే.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతగా ఉత్పత్తి సామర్ధ్యం పెంపొందించుకున్నా, ఉత్పత్తి పెరిగినా, సంపద కొండలుగా పోగుపడ్డా పేదరికం మాత్రం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగ సైన్యం పెరుగుతూనే ఉంది. అంటువ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి.
సమాజాన్ని ఆర్థికంగా రాజకీయంగా శాసిస్తున్న కంపెనీలే ఈ విలయానికి కారణమవుతున్నాయి. విలయంలో సైతం లబ్ది పొందుతున్నాయి. 2008 నాటి సంక్షోభాన్ని నేడు తాజా భారతదేశంలో వ్యక్తమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. బడా బూర్జువాలు ఎగొగొట్టిన బ్యాంకు బకాయిలు కారణంగా దివాళా తీస్తుంటే ప్రభుత్వాలు మాత్రం అదే బడా బూర్జువాలకు లక్షల కోట్ల రాయితీలు కట్టబెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని చట్టాలు చేసినా శ్రమపై పెట్టుబడి ఆధిపత్యాన్ని సంరక్షించేందుకే దారితీస్తున్నాయి తప్ప కార్మికుల పక్షాన ఈ చట్టాలు పని చేయటం లేదు. ఉత్పత్తి సాధనాలపై ఉన్న వ్యక్తిగత ఆస్థి హక్కును రద్దు చేసి దాని స్థానంలో నూతన ఆస్తి రూపాలను, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పని భారం తగ్గేలా, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గేలా నూతన ఆస్థి రూపాలను ఉనికిలోకి తేవటం ఒక్కటే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం. ఈ పరిష్కారాన్ని 172 ఏళ్ల క్రితం సూచించిన గ్రంధమే కమ్యూనిస్టు ప్రణాళిక.
రెండో ప్రపంచ యుద్ధానంతరం కాస్తంత నాజూకుతనం వంటబట్టించుకున్న పెట్టుబడి 1990 దశకం వచ్చేటప్పటికి గానీ తన పూర్తి విశ్వరూపం ప్రదర్శించలేదు. ఈ పెట్టుబడి విశ్వరూపాన్నే మార్క్స్ ఏంగెల్స్ లు కమ్యూనిస్టు ప్రణాళికలో అంచనా వేయగలిగారు.
సోవియట్ పతనం తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక వ్యూహం, లక్ష్యం ఆచరణ రూపం తీసుకోవాలని కాంక్షించే కోట్లాది మంది ముందు బూర్జువా మేధావులు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజాస్వామ్య రహిత ప్రభుత్వాలను స్వాగతిస్తున్నారా అన్నదే ఈ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి మనం ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం లేదు. వాల్ స్ట్రీట్ లేదా మన స్టాక్ మార్కెట్ లో జరిగే మోసాలకు ఆడం స్మిత్ పై ఆరోపణలు చేయగలమా? స్పెయిన్లో జరిగిన ఊచకోతకు కొత్త నిబంధన గ్రంధానిదే బాధ్యత అని ఆరోపించగలమా? ఇదే ప్రశ్నలు మార్క్స్ ఏంగెలకు వేస్తే వారి సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వటానికి కావల్సినంత సమయం వారికి దొరక్కముందే చనిపోయారు అన్న విషయాన్ని గుర్తించాలే తప్ప వారు చెప్పలేకపోయారు అని కాదు. మార్క్స్ ఏంగెల్స్ అందించిన గతితార్కిక పద్ధతిననుసరించి మనం ఈ ప్రశ్నలకు సమాధానం
వెతుక్కోగలము. పరిష్కరించుకోగలము. బూర్జువా మేధావులు కమ్యూనిజంపై భావయుద్ధం ప్రకటించటానికి ఏ ఇతర కారణమూ దొరకటం లేదు కాబట్టే ఇటువంటి విషయాలకు పరిమితమవుతున్నారని కూడా మనం విడమర్చి చెప్పాల్సి ఉంటుంది.
కమ్యూనిస్టు ప్రణాళికకు ఆచరణ రూపంలో పెట్టే ప్రయత్నంలో ఎదురైన కొన్ని ప్రశ్నలకు మార్క్సిజం ప్రతిపాదకులు అంచనా వేయలేకపోయారని చెప్పవచ్చు. సోవియట్ యూనియన్ వంటి విశాల దేశంలో ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించటంలో విజయం సాధించటమే కాక ప్రపంచంలో మూడో వంతు దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ అని పేరు పెట్టుకున్న పార్టీలు అధికారానికి వచ్చాక పెట్టుబడదారీ విధానం చూస్తూ ఊరుకుంటుందా? వందల ఏళ్లుగా యదేచ్చగా సాగుతున్న తమ దోపిడీకి ప్రపంచాన్నే రంగ స్థలంగా మార్చుకున్న పెట్టుబడి మూడోవంతు భూభాగంలో తన పాచికలు పారటం లేదు, దోపిడీ ఆటలు సాగటం లేదు అంటే నిశ్చేష్టురాలై చూస్తూ ఉంటుందా? ఇన్ని వందల ఏళ్ల రాజ్య తంత్రంలో సాధించిన అనుభవాలన్నింటినీ రంగరించి కొత్త వ్యూహం తయారు చేస్తుంది. అదే జరిగింది. ఇది ద్వంద్వ వ్యూహం. ఓ వైపు పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నడూ అంగీకరించని సంక్షేమ పథకాలు అమలు చేయటం ప్రారంభించింది. రెండో వైపు సోషలిస్టు దేశాలను వెలివేసి ఒంటరి చేసి దొంగదెబ్బ తీసేందుకు సైనిక వ్యూహం అనుసరించింది. దీని ఫలితమే ప్రశ్చన్నయుద్ధ వ్యూహం. దాని ఫలితాలు, పర్యవసానాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వర్తమాన చరిత్రలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నంలో ఓ లోతైన ఉద్రంధమే తయారవుతుంది. ముగింపు వాక్యాలుగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రణాళిక ఆటవిక రాక్షసుడి వంటి పెట్టుబడిదారీ వ్యవస్థకు సంక్షేమం అనే ఆభరాణాలు తొడుక్కుని నాజూక్కా కనిపించాల్సిన అవసరాన్ని కల్పించింది. గొంతెత్తి తమ అభ్యర్ధన చెప్పుకునే స్వేఛ్చ లేని జీవితాలకు శతాబ్దాల తరబడి అలవాటు పడ్డ సాధారణ ప్రజానీకానికి పిడికిలి బిగించి నినాదం ఇవ్వటం ఎలాగో నేర్పింది. ఈ పిడికిలి బిగువుకే వచ్చిన ప్రయోజనాలు చూసి అవాక్కయ్యేలా చేసింది. కేవలం పిడికిలి బిగిస్తేనే కార్మికవర్గం, దోపిడీకి గురవుతున్న సాధారణ ప్రజానీకం ఇన్ని విజయాలు ప్రయోజనాలు సాధించి తమ జీవితాలను ఎంతో కొంత మెరుగ్గా జీవించ గల పరిస్థితులను సృష్టించగలుగుతున్నప్పుడు పెట్టుబడిదారీ సమాజాన్ని తమ పిడికిళ్లల్లో బంధిస్తే వచ్చే ప్రయోజనాలేమిటో వివరించటమే మన ముందున్న కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఫిబ్రవరి 21వ తేదీ, కమ్యూనిస్టు ప్రణాళిక 172వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో లక్ష కాపీల పంపిణీ ఉద్యమాని వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు పిలుపునిచ్చాయి.
ఈ పిలుపులో దోపిడీని, అణచివేతను, మతోన్మాదాన్ని వ్యతిరేకించే అన్ని శక్తులు భాగస్వాములు కావల్సిన సమయం ఇది. మన బిగించిన పిడికిలికున్న శక్తిని ప్రపంచానికి తెలియచెప్పాల్సిన తరుణం ఇది.