– హింసాకాండకు ప్రభావితం కాని చాంద్బాగ్లోని పలు హిందూ, ముస్లిం కుటుంబాలు
న్యూఢిల్లీ : అది తూర్పు ఢిల్లీలోని చాంద్బాగ్ ప్రాంతం.. దాడులతో దద్దరిల్లిపోయిన ఆ ఏరియా మంగళవారం రాత్రి సమయంలో చూస్తే ఒక యుద్ధ భూమిని తలపించింది. చుట్టూ ఎక్కడ చూసినా భవన శిథిలాలు, కాలిపోయిన ఇండ్లు, దుకాణాలు, వాహనాలు. అక్కడికి రెండు వీధుల దూరంలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ హిందువులు, ముస్లింలు ఎంతోకాలంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. హింసాకాండ సమయంలోనూ వాటికి ఏమాత్రం ప్రభావితం కాకుండా ఒకరికొకరు రక్షించుకోవడంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది. 40 ఏండ్లుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అఫ్జల్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న మేము, వెంటనే సమావేశం ఏర్పాటు చేసి అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం. మా ఇండ్ల పక్కనే ఉండే హిందువుల దగ్గరకు వెళ్లి మనం ఎక్కడికీ వెళ్లనవసరం లేదని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ఇండ్లు కూడా ధ్వంసం కాలేదు’ అని వివరించారు. వెంటనే హిందూ మతానికి చెందిన బ్రిజ్మోహన్ శర్మ స్పందిస్తూ ‘ఈ హింసాకాండ హిందువుల వల్ల జరిగిందా లేక ముస్లింల వల్ల జరిగిందా అన్నది విచారణ లో తేలుతుంది. రెండు మతాలకు చెందిన వారు సోదరులుగా మెలుగుతూ మా బ్లాక్లో అటువంటి ఘటనలకు తావివ్వలేదు.
గతంలో ఇతర ప్రాంతాల్లో అల్లర్ల సమయంలోనూ ఇక్కడ ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చారు. ఎవరి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, వివాహం జరిగినా మతాలతో సంబంధం లేకుండా అందరం హాజరవుతుంటామనీ, ఎటువంటి విభేదాలు లేకుండా జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఇటువంటి దారుణ ఘటనలు మంచిది కాదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి దాడులకు పురిగొల్పిన బీజేపీ నేత కపిల్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని బ్రిజ్మోహన్ శర్మ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాజగోపాల్ మిశ్రా మాట్లాడుతూ దాడులపై పాలకులు వెంటనే స్పందించలేదని, దీని కారణంగా తీవ్రనష్టం జరిగిందని తెలిపారు. ఇటువంటి దారుణ ఘటనలు తన జీవితంలో చూడలేదని అన్నారు.
Courtesy: NT