- సీమాంధ్ర ప్రాంతానికి నీళ్లను తరలించాల్సిన అవసరమేంటి?
- పోతిరెడ్డిపాడుతో దోపిడీ అన్నారు
- ఈ ప్రాజెక్టుతో అది కొనసాగదా?
- కమీషన్ల కోసమే లక్ష కోట్ల ప్రాజెక్టు
- కాంట్రాక్టర్ల జేబులు నింపే పన్నాగం
- దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు తెలుగు వారితో సీఎంల ఆటలు
- ఉమ్మడి ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం
- ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా నిర్వీర్యం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం
- పార్టీలో చేరిన వీరేందర్ గౌడ్
న్యూఢిల్లీ, అక్టోబరు 3 : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీళ్ల పేరిట దోపిడీకి ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కమీషన్ల కోసం.. కాంట్రాక్టర్ల జేబులు నింపి కోట్ల రూపాయలను దండుకోవడం కోసమే శ్రీశైలానికి నీళ్ల తరలింపు ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలించుకుపోతున్నారని ఆరోపిస్తున్న ప్రభుత్వమే.. శ్రీశైలానికి నీటిని తరలిస్తే దోపిడీ కొనసాగదా? అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి నీళ్లను తరలించాల్సిన అవసరం ఏముందని సీఎం కేసీఆర్ను నిలదీశారు. ఉమ్మడి ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన లక్ష్మణ్.. నదుల అనుసంధానాన్ని కేసీఆర్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు లక్ష కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇద్దరూ సర్దుబాటు చేసుకొని నిధుల దుర్వినియోగం, దోపిడీ చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తరలిస్తారంట.ఏపీతో కలిసి నీళ్లు పంచుకుంటారంట. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ రెండు రాష్ట్రాల ప్రజలతో దోబూచులాడుతున్నారు.’’ అని లక్ష్మణ్ మండిపడ్డారు.
అవసరమేంటి? నదుల అనుసంధానానికి బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ రెండు రాష్ట్రాలూ ఉమ్మడి ప్రాజెక్టును నిర్మించి గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించాల్సిన అవసరం ఏం వచ్చిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు వస్తూనే ఉన్నాయని, కొత్తగా తెలంగాణ నుంచి శ్రీశైలానికి నీళ్లను ఎందుకు తరలిస్తారని నిలదీశారు. అసలు ఆ ప్రాజె క్టు సవివర నివేదిక (డీపీఆర్) ఏదని అడిగారు. రూ. 30 వేల కోట్లతో చేపట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్య యాన్ని రూ.80 వేల కోట్లకు పెంచడమే కాకుండా మరో రూ.20 వేల కోట్లు అవసరమంటున్నారని దుయ్యబట్టారు. అవినీతి ద్వారా ఆర్జించిన డబ్బును ఎన్నికల్లో వాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, సీతారామ, రామదాసు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వ్యయాలను పెంచుతూ చుక్క నీరు ఇవ్వకుండా ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నారన్నారు.
ఉద్యమ అంశాలను నీరుగార్చి..నీళ్లు, నిధులు, నియామకాలపై ఉద్యమించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడు అంశాలనూ నిర్వీర్యం చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన కోసం, కమీషన్ల కోసమే రాష్ట్రం సాధించుకున్నట్లు స్పష్టమవుతోందని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఉద్యమకారులను పక్క నబెట్టి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులిచ్చి బంగారు తెలంగాణ అంటూ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి సీమాంధ్ర ప్రజలను దూషించి, విద్వేషాలకు ప్రేరేపించి కేసీఆర్ పబ్బంగడుపుకొన్నారని ధ్వజమెత్తారు. కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది.. గురువారం ఢిల్లీలో ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించారు. అనంతరం వీరేందర్గౌడ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే.. మాజీ మంత్రి శనక్కాయల అరుణ, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సహా ఏపీకి చెందిన 14 మంది తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీలో చేరారు.
Courtesy Andhra Jyothy..