– ఆరేండ్లయినా ఆచరణకు నోచని పునరుద్ధరణ
– హామీపై మాట తప్పిన ముఖ్యమంతి
– చారిత్రక ఆనవాళ్లు కనుమరుగేనా !
తెలంగాణ అస్థిత్వం, చారిత్రక వైభవం కనుమరుగవుతుం దంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్… మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణపై మాట తప్పారు. ఆరున్నర దశాబ్దాల కాంగెస్, తెలుగుదేశం పార్టీల నిర్వాకం వల్ల ఖాయిలాపడిన పరిశ్రమలను తెరిపిస్తానని 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆరేండ్లు దాటినా ఆచరణకు నోచుకోలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి, వేలాదిమందికి ఉపాధి చూపిన అనేక పరిశ్రమలు ప్రస్తుతం మూతపడ్డాయి. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఖాయిలా పరిశ్రమలకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. పునరుద్దరణకు అవకాశం ఉన్న నిజాంషుగర్, రేయాన్స్ బిల్ట్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని పరిశ్రమల మంత్రి కేటీఆర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రకటించినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంది. ఫలితంగా నిజాం షుగర్, రేయాన్స్ బిల్ట్ లాంటి చారిత్రక పరిశ్రమలు శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
1947 స్వాతంత్య్రం పొందడానికి ముందు నుంచి 1960 దశకం వరకు తెలంగాణలో పారిశ్రామిక, వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలు విస్తరించాయి. హైదరాబాద్లోని సనత్నగర్, ముషీరాబాద్, ఆజామాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని చోట్ల స్థానిక వనరులను బట్టి పరిశ్రమలున్నాయి. వరంగల్ జిల్లాలో ఆజాంజాహీ మిల్లు, రేయాన్స్ బిల్ట్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ జిల్లాలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, అదిలాబాద్ జిల్లాలో సర్సిల్క్ తదితర పరిశ్రమలు వేలాది మంది కార్మికులకు ఉపాధి చూపించాయి. హైదరాబాద్ నగరానికొస్తే… అల్విన్, ప్రాగాటూల్స్, ఆస్బెస్టాస్, దక్కన్ బటన్ ఫ్యాక్టరీ, డీబీఆర్ మిల్స్, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ ల్యామినేషన్ ప్రొడక్స్ వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి పైగా కార్మికులకు ఉపాధి చూపించిన చారిత్రాత్మకమైన పరిశ్రమలను అప్పటి ప్రభుత్వాలు మూసేసాయి. తాము అధికారం చేపడితే అన్నింటిని తెరిపిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పునరుద్దరణకు చిత్తశుద్దితో ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. గత ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల కల్పనలో తీవ్రమైన అన్యాయం, వివక్షను వలస పాలకులు కొనసాగించారనీ విమర్శలు చేసిన టీఆర్ఎస్, అధికారం చేపట్టిన తర్వాత పక్కన పడేసింది. కొన్ని పరిశ్రమల పునరుద్దరణకు అవకాశం ఉన్నప్పటికీ చిత్తశుద్దితో ప్రయత్నించలేదని ఉపాధి కోల్పోయిన కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయం పట్టని సర్కార్
తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు చర్యలు తీసుకోవడం, సాధ్యం కాని చోట అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్, ఆదిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. నిజాం షుగర్, రేయాన్స్, డీబీఆర్ లాంటి ఫ్యాక్టరీలను తెరిపించడం లేదా, ప్రత్యామ్నాయ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆదిశగా చర్యలు చేపట్టలేదు. నిజాం షుగర్, రేయాన్స్ పరిశ్రమలను పునరుద్దరిస్తే దాదాపు 10 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ రెండు పరిశ్రమలతో పాటు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న డీబీఆర్ మిల్లు స్థలాన్ని స్వాధీనం చేసుకోని, స్వయంగా ప్రభుత్వమే ఏదైనా ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేండ్ల నుంచి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
డీబీఆర్ స్థలంపై ప్రభుత్వం కన్ను
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న డీబీఆర్ స్థలంపై ప్రభుత్వం కన్ను పడడంతోనే పునరుద్దరణకు నోచుకోవడం లేదనే వాదనలు సైతం ఉన్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచే ఈ ఫ్యాక్టరీ స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మిల్లు లేఆఫ్ అయ్యేనాటికి రాంగోపాల్ వారసుల నుంచి లీజు తీసుకొని మిల్లు నిర్వహిస్తున్న కృష్ణంరాజు మహేష్మాల్పానీకి ఆరు ఎకరాలు అమ్మినట్టు లేబర్ కమిషనర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలిపారు. అయితే ఈ భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టంగా పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న పేరుతో నిరుపయోగంగా ఉన్న పరిశ్రమల భూములను అమేందుకే మొగ్గుచూపుతున్నట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజాంషుగర్, బిల్ట్ ఫ్యాక్టరీలను వెంటనే పునరుద్ధరించాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
పునరుద్ధరణకు అవకాశం ఉన్న నిజాంషుగర్, రేయాన్స్ బిల్ట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పరిశ్రమలను నడపాలి. ఈ రెండు పరిశ్రమలను నమ్ముకున్న వేలాది మంది కార్మికులు, చెరుకు రైతులకు న్యాయం జరగాలంటే పరిశ్రమల పునురుద్దరణ తప్ప మరో మార్గం లేదు. మంత్రి హైదరాబాద్ను వీడి నిజాంషుగర్, రేయాన్స్ బిల్ట్ ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో సందర్శించి వారి బాగోగులను తెలుసుకోవాలి. ఐటీ హబ్ తో వేలాది మందికి ఉపాధి అందిస్తున్నామంటున్న కేటీఆర్ వీధిన పడ్డ కార్మికుల గురించి ఆలోచించాలి.
Courtesy Navatelangana