మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు
అశ్లీల వీడియోలు, అసభ్య వ్యాఖ్యలతో పోస్టులు
మొత్తం 54 మంది అధికారిణుల పేర్లతో ఆకౌంట్లు నాలుగు సార్లు తొలగించినా.. మరోసారి ఓ అధికారిణి పేరుతో ఖాతా ప్రారంభం
ఆమె ఫిర్యాదుతో రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ నిందితుడు కూనపురెడ్డి మన్మోహన్: అతడు ఇంటర్లో స్టేట్ ర్యాంకర్.. ఇంజినీరింగ్ చదివాడు.. సివిల్స్ కోసం కష్టపడ్డాడు మలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లాడు. అక్కడ ఫెయిలవడంతో.. మహిళా ఐఏఎస్లు, ఐపీఎస్లు లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో పైశాచికం ప్రదర్శించడం ప్రారంభించాడు. వారి పేర్లతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి అసభ్య వ్యాఖ్యలను, అశ్లీల వీడియోలను, ఫొటోలను పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. “మీరు సాయంత్రాలు ఖాళీగా ఉంటున్నారా? అందమైన సాయంత్రాన్ని మరింత అందంగా గడుపుదామా? ప్రేమ అంటే మనసుకు నచ్చిన వారికి పంచడమే.. సరసమైనా.. విరసమైనా సరే.. సమఉజ్జీలుండాలి. మరి మీరు తయారా?” అంటూ ఆ ఖాతాలనుంచి పోస్టులు చేయడం ప్రారంభించాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది మహిళా ఐఏఎస్లు, ఐపీఎస్ పేర్లతో ఖాతాలు తెరిచి పైశాచికం ప్రదర్శించాడు. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారిణి తన పేరుతో ఉన్న
ఫేస్ బుక్ ఖాతాను గుర్తించి, సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి తొలగింపజేశారు. అతడు మళ్లీ సృష్టించడం… ఆమె తొలగింపజేయడం ఇలా నాలుగుసార్లు జరిగింది. మరోసారి ఆమె పేరుతో ఖాతా తెరిచి ఆసభ్య పోస్టులు చేస్తుండడంతో అధికారిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కూనపురెడ్డి మన్మోహన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు ప్రారంభించిన ఖాతాలన్నింటినీ తొలగించిన అధికారులు, అధికారిణుల పేర్లతో ఎవరైనా ఖాతాలను ప్రారంభిస్తే వాటిని ఆమోదించవద్దని, తమ దృష్టికి తీసుకురావాలని ఫేస్ బుక్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.
గురి తప్పిన లక్ష్యం: కూనపురెడ్డి మన్మోహన్ ది కృష్ణా జిల్లా పెదఓగిరాల. ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు . ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. సివిల్స్ లక్ష్యంగా ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. రెండో ప్రయత్నంలో గతేడాది రాత పరీక్షలో ఉత్తీర్ణుడైనా… ముఖాముఖిలో ఫెయిలయ్యాడు. ఆ నిస్పృహతో మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లతో ఖాతాలు తెరిచి… విషం చిమ్మడం ప్రారంభించాడు. మన్మోహన్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తామని అదనపు డీసీపీ కె.సి.ఎస్.రఘువీర్, ఇన్ స్పెక్టర్ ఎన్.మోహన్ రావు తెలిపారు.
Courtesy Eenadu…