గుంటూరు : సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. లాక్డౌన్ సమయం నుంచి గుంటూరు విద్యానగర్లో ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలారు. జయప్రకాశ్రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. నాటకరంగంపై ఉన్న మక్కువతో ఆయన గుంటూరులోనే స్థిరపడ్డారు. జయప్రకాశ్రెడ్డికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రతాప్రెడ్డి ఉన్నారు. 1946 మే 8న జన్మించిన ఆయన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దాదాపు వందకు పైగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడు, హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. రాయలసీమ యాసలో సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్న కేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్సింగ్, నాయక్, బాద్షా, రేసు గుర్రం, మనం, పటాస్, టెంపర్, సరైనోడు, ఖైదీ నంబర్ 150, జై సింహా, రాజా దిగ్రేట్ తదితర చిత్రాలు నటించారు. జయప్రకాశ్రెడ్డి చివరి సారిగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రతివారం జరిగే నాటకాల ప్రదర్శనలో పాల్గొనే జయప్రకాశ్రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు సినీ, నాటకరంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితులు, బంధువులు గుంటూరు కొరిటెపాడులో జయప్రకాశ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయప్రకాశ్ మృతి వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, కళాకారులు విద్యానగర్లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శోకసంద్రంలో కుటుంబసభ్యులు..
జయప్రకాశ్ రెడ్డి మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం జయప్రకాశ్రెడ్డి కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి, కోడలికి కరోనా సోకినట్లు సమీప బంధువులు తెలిపారు. దీంతో జయప్రకాశ్రెడ్డి దంపతులు అదే ఇంట్లో పైభాగంలో ఉన్న పెంట్ హౌస్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయం గుండెపోటుతో స్నానాల గదిలోనే ఆయన కుప్పకూలినట్లు చెప్పారు. తండ్రి మరణవార్త విన్న కుమారుడు, కోడలు పీపీఈ కిట్లు ధరించి జయప్రకాశ్రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తదితరులు జేపీ నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
గుంటూరుతో ఎంతో అనుబంధం…
జయప్రకాశ్ రెడ్డి గుంటూరు ఏసీ కళాశాలలో విద్యనభ్యసించారు. చిత్రపరిశ్రమకు రాకముందు ఆయన గుంటూరులోని మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పాఠశాలలో పనిచేసే సమయంలోనే సినిమా రంగంలోకి వచ్చిన ఆయన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. గుంటూరులో గత మూడేళ్ల నుంచి నుంచి ప్రతి నెల రెండో ఆదివారం రోజున ‘జేపీస్ నెలనెలా నాటక సభ’ పేరిట నాటకాలను ప్రదర్శింపజేస్తున్నారు. ఈ ప్రదర్శనలో జయప్రకాశ్ రెడ్డి స్వయంగా పాల్గొని కొన్ని నాటకాల్లో నటించారు. ఆయన ఏకపాత్రాభినయం చేసిన ‘అలెగ్జాండర్’ అనే నాటకం మంచి గుర్తింపు తెచ్చింది.
Courtesy Eenadu