- పక్కదారిపడుతున్న సంరక్షణ నిధులు
- వచ్చేది కనిష్ఠంగా రూ.2లక్షలు.. గరిష్ఠంగా రూ.6 లక్షలు
- వాస్తవంగా ఖర్చు చేస్తోంది రూ.60,000 లోపే
- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడి
దిల్లీ: చిన్నారుల సంరక్షణ కోసం విదేశీ విరాళాల ద్వారా అందుతున్న నిధులు ఆర్థిక అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయన్న సందేహాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) వ్యక్తం చేసింది. 2018-19 సంవత్సరంలో అయిదు రాష్ట్రాల్లోని 638 బాలల సంరక్షణ సంస్థలకు అందిన విరాళాలు, అవి ఖర్చయిన తీరును విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఎన్సీపీసీఆర్ తెలిపింది. ఏడాదికి ఒక్కో చిన్నారికి కనీసంగా రూ.2.12లక్షలు…గరిష్ఠంగా రూ.6.6లక్షలు చొప్పున స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. అయితే, ఏడాది మొత్తం అన్ని ఖర్చులు కలిపినా ఒక్కో చిన్నారిపై పెడుతున్న ఖర్చు రూ.60వేలు మించడం లేదని ఎన్సీపీసీఆర్ ఛైర్పర్సన్ ప్రియంక్ కనూన్గో తెలిపారు. కేంద్ర హోంశాఖలోని వివరాలు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అందిన నిధులను విశ్లేషించామన్నారు. ఈ సమాచారం ఆధారంగా నిధుల దారి మళ్లింపునకు అవకాశాలు ఉన్నాయన్న అంచనాకు వచ్చామన్నారు.
Courtesy Eenadu