అసలే ఆర్థికంగా అంతంత జీవనం
ఆదుకోవాల్సిన సర్కారే కన్నెర్ర
గత సర్కారులో ప్రచారం చేశారంటూ
కొత్తగా కార్యక్రమాలకు పిలవని వైనం
గత బకాయి రూ.20కోట్లూ ఆపివేత
కూలీపనులకు వెళుతున్న కళాకారులు
సాంస్కృతిక శాఖకూ అరకొర నిధులు
ఈ ఏడాది కేటాయింపు రూ.18 కోట్లే
అమరావతి: కళాకారులకు పార్టీలు, ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు తెలిసిన కళలతో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఊరూరా తిరిగి ప్రచారం చేయడమే వారికి తెలుసు. అలాంటి వారిని గుర్తించి, ప్రోత్సహించి, మంచిచెడ్డలు చూసి.. ప్రభుత్వ కార్యక్రమాలు వారి ద్వారా బాగా ప్రచారమయ్యేలా చూడాల్సింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. ప్రచారపరంగా ఇంత ముఖ్యమైన బాధ్యతలు చూసే శాఖకే ఇప్పుడు దిక్కూదివాణం లేకుండా పోయింది.
‘గత ప్రభుత్వంలో పథకాలను ప్రచారం చేశారు’ అనే ఒకేఒక్క కారణంగా ఈ కళాకారులనూ, వారి సంక్షేమం చూసే సాంస్కృతిక శాఖనూ ఎండబెడుతున్నారు. పథకాలు ఏ ప్రభుత్వానివైనా కళాకారుల పని వాటికి ప్రచారం చేసిపెట్టడమే! అయినా, కొత్త ప్రభుత్వం వచ్చాక పిలిచి కొత్తగా కార్యక్రమాలను అప్పగించడం ఆగిపోయింది. దీంతో నిన్నటిదాకా ఎన్నో ప్రజోపయోగ పథకాలను భుజాన వేసుకొని ప్రచారం చేసిన కళాకారులంతా.. తట్టాబుట్టా నెత్తిన పెట్టుకొని రోజువారీ కూలిపనులకు వెళుతున్నారు.
భత్యం లేదు..బకాయీ ఇవ్వరు..
తరతరాలుగా కళారూపాల ప్రదర్శనే వృత్తిగా మార్చుకున్న వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. ఆదాయం అంతంతమాత్రమే అయినా, ఇప్పటికీ ఎందరో ఈ కళలనే అంటిపెట్టుకొని జీవిస్తున్నారు. శ్రీకాకుళంజిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరుజిల్లా తడ దాకా ఒక్కో ప్రాంతం ఒక్కో కళకు ప్రసిద్ధి. ఆ కళలను ప్రదర్శించే కళాకారుల జీవితాల్లో మాత్రం ఎలాంటి కళాకాంతీ ఉండవు.
టీడీపీ హయాంలో కళాకారులను ప్రోత్సహించి, వారికి ఉపాధి కల్పించడం కోసం ప్రతి మండలానికి ఒక ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు. జన్మభూమి, గ్రామసభలు, ఆనందలహరి వంటి సర్కారీ కార్యక్రమాలూ, సంక్రాంతి, ఉగాది వంటి తెలుగువారి పెద్ద పండగలనూ జిల్లా, మండల స్థాయిలో నిర్వహించేవారు. అందుకుగాను వారికి రోజుకు వెయ్యిరూపాయలు చొప్పున ప్రభుత్వం భత్యం ఇచ్చేది. వచ్చిన ఈ ఏడాదిన్నరలో కొత్త ప్రచార కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం అనుమతించడం లేదు. పైగా, గత బకాయిలనూ వారికి నిలిపేసింది.
రాష్ట్ర సాంస్కృతిశాఖకు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం అనుమతితో సొంత ఖర్చు పెట్టుకొని వేదికలను నిర్మించి ప్రచార, సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు నిర్వహిస్తారు. ఆ తరువాత బిల్లు పెట్టి క్లియర్ చేసుకొంటారు. ఇందులో రూ. రెండు లక్షలు దాకా ముందుగా ఖర్చుపెట్టినవారే ఎక్కువ. బిల్లులు వస్తాయన్న నమ్మకంతో చాలామంది కళాకారులు తమ ఇళ్లల్లో భార్యల పుస్తెలు, బంగారం తాకట్టుపెట్టి, ఇంటి స్థలాలు కుదవపెట్టి డబ్బులు సమకూర్చుకొని కార్యక్రమాలు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారిపోవడంతో వారి బిల్లులు నిలిచిపోయాయి. ఈ మొత్తం బకాయి రూ. 20 కోట్లు వరకు ఉంటుంది.
ఈ బిల్లుల కోసం కళాకారులు.. సాంస్కృతిక శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ‘గత ప్రభుత్వంలో పథకాలు ప్రచారం చేశా’రన్న నెపంతో కొత్త ప్రభుత్వం ఈ బకాయిలు నిలిపేసిందన్న ఆరోపణలున్నాయి. దీంతో తెచ్చిన అప్పులు తీర్చలేక కళాకారులు మరింతగా కుంగిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని ఆవేదన చెందుతున్నారు.
కుటుంబం గడవడం కోసం చాలామంది కూలీ పనులకు వెళుతున్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు, కళా వైతాళికులకు జయంతులు, వర్ధంతులు జరపడం తప్ప కళాకారులకు పెద్దగా ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని పలువురు సాంస్కృతిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.
18 కోట్లు ఏ మూలకు..
2018-19లో, అంటే టీడీపీ ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో అధికారులు రూ.70 కోట్ల వరకూ కళాకారుల ప్రచార అవసరాల కోసం ఖర్చుచేశారు. 2019-20 లో ఓటాన్ ఆకౌంట్ బడ్జెట్ కావడంతో నిధులు చాలా వరకూ తగ్గాయి.
ఇక.. కొత్త ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను ఈ శాఖకు కేటాయించింది కేవలం రూ.18 కోట్లు. అవి శాఖలోని ఉద్యోగుల జీతాలకు తప్ప మరి దేనికీ సరిపోయే పరిస్థితి లేదు. సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిశీలిస్తే చాలు.. కళలు, కళాకారులకు పాలకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అవుతుందని పలు కళాసంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Courtesy Andhrajyothi