రోజుకు 50 టెస్టులు చేయాలని టార్గెట్
రెండు రోజుల నుంచి వారితోనే పరీక్షలు
వాటిని ఆన్లైన్ చేసే బాధ్యత కూడా
తమ వల్ల కాదంటున్న ఏఎన్ఎంలు
మాతాశిశు సంరక్షణ బాధ్యతా వారిదే
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీగా పెంచిన సర్కారు.. క్షేత్రస్థాయిలో వాటిని చేసే బాధ్యతను ఏఎన్ఎంలకు అప్పగించింది. వారికి రోజూ 50 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టింది. వాటిని వెంటనే ఆన్లైన్ చేయాలని ఆదేశించింది. రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు ఈ టెస్టులు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ చేయాల్సిన నిర్ధారణ పరీక్షలు తమతో చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది వరకు ఏఎన్ఎంలు పనిజేస్తున్నారు. అందులో శాశ్వత ఉద్యోగులు 1200 మంది కాగా, మిగిలిన వారంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలోపనిచేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మాతా శిశు సంరక్షణ బాధ్యత వీరిపైనే ఉంది. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య మిషన్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను వీరితోనే చేయిస్తారు. ప్రధానంగా టీకాలు. ప్రతి బుధ, శనివారాలు చిన్నారులు, గర్భిణులకు టీకాలు ఇస్తారు. ప్రస్తుతం వీరు ఇమ్యూనైజేషన్, ఏఎన్సీ చెక్పలు, ఎన్సీడీ, మలేరియా సర్వే, ఫైలేరియా, ఆగస్టు, డిసెంబరు డీవార్మింగ్ డే, హౌజ్హోల్డ్ సర్వేలు, కేన్సర్ రోగులెంతమంది? లాంటివన్నీ చేస్తున్నారు. అలాగే నిత్యం 36 రకాల రికార్డులను నిర్వహించాలి. గ్రామాల్లో ప్రతి 5వేల జనాభాకు ఒక ఏఎన్ఎం ఉంటే… హైదరాబాద్లో 50 వేల జనాభాకు ఒకరు ఉన్నారు.
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం..
నిత్యం మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలు చేస్తూనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడమంటే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లేనని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద నమోదవుతున్న కేసుల్లో 80శాతం అసింప్టమాటిక్ కేసులేనని, వారివల్ల తమకు కరోనా సోకి.. వాటిని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంటిస్తే పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో వృద్ధులు, బీపీ, షుగర్ రోగులకు తామే మందులు పంపిణీ చేస్తుంటామని, తమ వల్ల వారు వైరస్ బాధితులయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు ఏఎన్ఎంలతో కరోనా టెస్టులు చేయించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించడం సరికాదని తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం కూడా అభిప్రాయపడింది. ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారానే టెస్టులు చేపట్టాలని కోరింది.
Courtesy Andhrajyothi