అమెరికాలో మరో కొవిడ్-19 మృతి కేసు
వాషింగ్టన్లో 12 మందికి సోకిన వైరస్
చైనాలో తాజాగా 42 మంది మృత్యువాత
ఇరాన్లో కీలక అధికారి కన్నుమూత
దక్షిణ కొరియాలో ఆగని కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : వివిధ దేశాల్లో కరోనా వైరస్ (కొవిడ్-19) బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 3 వేలు దాటింది. దాదాపు 70 దేశాల్లో ఈ వైరస్ సోకినవారి సంఖ్య 88 వేలకు పైనే ఉంది. అమెరికాలోని సియాటిల్లో 70 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో ఇది రెండో కరోనా మృతి కేసు. వాషింగ్టన్ రాష్ట్రంలో 12 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చైనాలో తాజాగా 42 మంది మృతిచెందారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 2,912కు చేరింది. ఇరాన్లో సుప్రీం నేతకు సలహాలిచ్చే మండలి సభ్యుడు మొహమ్మద్ మీర్మొహమ్మది (71) కరోనా సోకి మృతిచెందారు. దేశంలో మృతుల సంఖ్య 66కు చేరిందని, 1,501 కేసులు గుర్తించామని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దక్షిణ కొరియాలో కొత్తగా 500, సింగపూర్లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 వేలు దాటింది. చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదయింది దక్షిణ కొరియాలోనే! అక్కడ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కో, ఇండోనేషియాల్లో మొదటి, ఈజిప్టులో రెండో కరోనా కేసు గుర్తించారు. థాయ్లాండ్లో తొలి, ఫ్రాన్స్లో మూడో కరోనా మృతి కేసు నమోదయింది. రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడు. వేర్వేరుచోట్ల 48 మంది చికిత్స పొందుతున్నారు.
ఇటలీలో చిక్కుకున్న భారతీయులు
ఇటలీలో 85 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వీరంతా లాంబార్డీ ప్రాంతం పవియా పట్టణంలోని యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెంది 17 మందిని కబళించింది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విమానాల రద్దుతో స్వదేశం రావడానికి మార్గం మూసుకుపోయింది. చైనాలో కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇద్దరు అధికారులను పొడిచి చంపిన 23 ఏళ్ల యువకుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ కేంద్రం వద్ద తనను ఆపినందుకు కోపోద్రిక్తుడైన యువకుడు అధికారులపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఛాతీపై, పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయాలతో వారు మరణించారు. ఫిబ్రవరి 6న ఈ ఘటన చోటుచేసుకుంది.
చర్చి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి క్షమాపణలు చెప్పిన చర్చి నేత
సియోల్: కరోనా వైరస్ నియంత్రణలో సహకరించనందుకు దక్షిణ కొరియాలోని షిన్చియోన్జి చర్చి నేత 88 ఏళ్ల లీమాన్ హీ మోకాళ్లపై వంగి తల నేలకు ఆనించి క్షమాపణలు చెప్పారు. తొలుత కరోనా వైరస్ సోకిన ఒక మహిళ ఆ చర్చిలోకి ప్రవేశించడం ద్వారా అది వ్యాపించినట్లు తేలింది. చర్చిలో పెద్ద సంఖ్యలో కింద కూర్చొని ప్రార్ధనలు చేయడం వల్ల ఎక్కువమందికి వైరస్ వ్యాపించింది. దక్షిణ కొరియాలో 4వేల మందికిపైగా ఈ వైరస్ సోకింది. వారిలో సగం మందికి షిన్చియోన్జి చర్చి ద్వారా సోకినట్లు భావిస్తున్నారు. దాంతో సియోల్ నగర అధికారులు లీమాన్ హీపై హత్య కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
నాకేం కరోనా రాలేదు: జాకీ చాన్
తనకు కరోనా వైరస్ సోకిందన్న వార్తలను నటుడు జాకీ చాన్ ఖండించారు. నిక్షేపంగా ఉన్నానని తన వెబ్సైట్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు పంపిన ఫేస్ మాస్కులు అందాయని పేర్కొన్నారు. వాటిని అధికారుల ద్వారా పంపిణీ చేయిస్తానని తెలిపారు.
Courtesy Andhrajyothi