- కరోనా కట్టడిలో లోపాలు
- గుణపాఠాలు నేర్వని సర్కారు
- తొలి పాజిటివ్ నమోదై 6 నెలలు
- 180 రోజుల్లో 1,27,697 కేసులు
- రోజుకు సగటున 709 నమోదు
- 50 శాతం మందే వైద్య సిబ్బంది
- రూరల్లో చికిత్సకు లేని ఏర్పాట్లు
- ఇప్పటికీ 5861 ఆక్సిజన్ పడకలే
హైదరాబాద్, సెప్టెంబరు : ‘‘ఆగస్టు చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్లో, సెప్టెంబరు చివరి నాటికి రాష్ట్రమంతా వైరస్ అదుపులోకి వస్తుంది’’ ఇవి కొద్దిరోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ చెప్పిన మాటలు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కూడా కనిపించడం లేదు. జిల్లాల్లో నమోదవుతున్న కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై సరిగ్గా ఆరు నెలలవుతోంది. ఈ 180 రోజుల్లో ఏకంగా 1,27,697 కేసులు వచ్చాయి. అంటే రోజుకు సగటున 709 పాజిటివ్లు రాగా, ప్రతి గంటకు కొత్తగా 29 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికి 836 మంది కన్నుమూశారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారివల్లే వైరస్ సోకగా, మర్కజ్ వల్ల ఒక్కసారిగా భారీగా కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి వైరస్ వ్యాప్తి బాగా పెరుగుతూ, వలస కార్మికులు, లాక్డౌన్ ఎత్తివేతతో మరింత తీవ్రరూపం దాల్చింది.
అయితే నియంత్రణలో ప్రధానమైన టెస్టింగ్, ట్రేసింగ్ సరిగా లేకపోవడం వల్లే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా పెరిగిందన్న ఆరోపణలున్నాయి. ఒక దశలో టెస్టులను చాలా నామమాత్రంగా చేశారు. ఆ సమయంలో కరోనా బాగా విజృంభించింది. ఆ తర్వాత కోర్టు మొట్టికాయలు వేయడంతో భారీగా టెస్టులు చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు రోజూ వేలల్లో పరీక్షలు చేశాయి. ఆగస్టు 24 వరకు రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పది లక్షలు దాటలేదు. ఆగస్టు, సెప్టెంబరు నాటికి లక్షల్లో కేసులు నమోదవుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసినప్పటికీ.. ప్రభుత్వం ఆ మేరకు చికిత్స ఏర్పాట్లు, వైద్య సిబ్బంది నియామకం, మందులు, ఆక్సిజన్ లాంటి ఏర్పాట్లను చేసుకోలేకపోయింది. ఇప్పటికీ చాలా లోపాలతో సర్కారు నెట్టుకొస్తోంది
ఇంకా అంతే…
- కరోనా పరీక్షలు ఇంకా తక్కువగానే చేస్తున్నారు. యాంటీబాడీస్ టెస్టులు ఇప్పటివరకు చేయనేలేదు. కాంటాక్టు ట్రేసింగ్ సరిగ్గా జరగడం లేదు.
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27 వేల పడకలుంటే.. అందులో కరోనా రోగులకు ఆక్సిజన్ పడకలు 5861, ఐసీయూ బెడ్స్ 2251 మాత్రమే ఉన్నాయి.
- జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నా.. జిల్లా ఆస్పత్రుల్లో తప్ప ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాల్లో చికిత్స ఏర్పాట్లు లేవు.
- గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక ఐసోలేషన్ కేంద్రాలు లేవు.
- సకాలంలో కరోనా రోగుల్ని గుర్తించి చికిత్సకు తీసుకురావడం సరైన విధంగా జరగడం లేదనే విమర్శలున్నాయి.
- ఒకటి రెండు ఆస్పత్రులు మినహా అన్నింటా 50 శాతం వైద్య సిబ్బందితోనే కరోనా చికిత్సలందిస్తున్నారు. ఉదాహరణకు.. రిమ్స్ ఆదిలాబాద్లో 239 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 106 మందే పనిచేస్తున్నారు.
- కరోనా చికిత్స కోసం తాత్కాలికంగా వైద్యులు, నర్సుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇప్పటివరకు ఆ ప్రక్రియ ముందుకుసాగలేదు. ఉదాహరణకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 73 మంది వైద్య సిబ్బంది కోసం జూలై 15న నోటిఫికేషన్ ఇచ్చారు. భారీగా దరఖాస్తులొచ్చినా ఇంతవరకు దాని గురించే పట్టించుకోవడంలేదు.
- ప్రైవేటులో సగం పడకలు స్వాధీనం చేసుకుంటామని వైద్యమంత్రి ఈటల రాజేందర్ అర్భాటంగా ప్రకటించారు. కానీ, దాని ఊసే లేకపోగా.. ప్రభుత్వం నిర్ణయించిన ఽకరోనా చికిత్స ధరలు అమలు కావడం లేదు. ప్రైవేటు దోపిడీని సర్కారు ఆపలేకపోయిందన్న విమర్శలూ ఉన్నాయి.
- ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తామన్న ప్రభుత్వం, ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు.
- కరోనా వల్ల సర్కారు దవాఖానల్లో ఇతర వ్యాధులు, శస్త్రచికిత్సలు సామాన్యులకు అందకుండాపోయాయి.
- దేశంలో అత్యధికంగా నాన్-కోమార్బిడ్ కరోనా మరణాలు మనవద్దే చోటుచేసుకుంటున్నాయి. మొత్తం మరణాల్లో కేవలం కరోనా వల్ల 46.13 శాతం మంది కన్నుమూస్తే, దీర్ఘకాలిక వ్యాధులుండి వైరస్ వల్ల చనిపోయిన వారి శాతం 53.87గా నమోదైంది. దీనిని గుర్తించడంలో వైద్యశాఖ విఫలమయింది.
- దేశంలో లక్షణాలు లేని కరోనా రోగులు 80 శాతం ఉండగా, మన వద్ద 69 శాతమే ఉన్నారు. ఇక లక్షణాలున్న రోగుల శాతం తెలంగాణలో ఆగస్టు 14 వరకు కేవలం 16 శాతం ఉండగా, ఇప్పుడది రెట్టింపు అయి 31 శాతంగా నమోదయింది.
- రాష్ట్రంలో చాలామందికి వైర్సపై ఉన్న అపోహలు, అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తిచేసే యంత్రాంగం ఇప్పటికీ లేదు.
- హోమ్ ఐసోలేషన్లో ఉండే రోగులకు కిట్లు ఇస్తామని తొలుత హడావుడి చేసి, ఇప్పుడు కనీసం జ్వరం గోలీలు కూడా ఇవ్వడం లేదు.
Courtesy Andhrajyothi