దీర్ఘకాలిక ఇబ్బందులతో సతమతం..
10 శాతం మందిలో పేగుల్లో గడబిడ
5ు మందిలో ఊపిరితిత్తుల్లో ఇబ్బంది
కొందర్లో కాళ్లలో రక్తం గడ్డ కట్టే ముప్పు
అరుదుగా చికిత్స సమయంలో స్ట్రోక్
ఊపిరితిత్తుల సమస్య వస్తే
నెల రోజులు ఆక్సిజన్ థెరపీ తప్పదు
మందుల కోర్సు పూర్తిగా వాడాలి
కరోనా విజేతలకు డాక్టర్ల సూచన
హైదరాబాద్ సిటీ : కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరిలో సంతోషం మిగలడం లేదు. ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొవిడ్ విజేతలుగా అభినందనలు అందుకున్న కొద్ది రోజుల్లోనే కొత్త కొత్త సమస్యలతో తిరిగి ఆస్పతులకు వెళ్లాల్సి వస్తోంది. ఇది కోలుకున్న అందరి సమస్య కాకపోయినా తీవ్రమైనదే. ముఖ్యంగా ఊపిరితిత్తులను కేంద్రంగా చేసుకొని దాడి చేస్తున్న కరోనా వైరస్ చికిత్సతో అంతరించి పోయాక శ్వాస కోశాలు మునపటిలా వికసించడం లేదు. వైరస్ లోడ్ అధికంగా ఉండి బయట పడిన వారి శ్వాసకోశాల్లో ఫైబ్రోసిస్ సమస్య ఏర్పడుతోంది. దాంతో శ్వాస తీసుకున్నపుడల్లా బెలూన్లా ఉబ్బాల్సిన ఊపిరితిత్తులు గట్టిపడిపోయి మొత్తం సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నాయి. ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి బృందం కొవిడ్ నుంచి కోలుకున్న 50 మందిని కలుసుకొని మాట్లాడింది.
అందులో సగానికన్నా ఎక్కువ మంది చిన్నదో పెద్దతో ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినట్లు చెప్పారు. సమస్యలు ఎదుర్కొన్న వారిలో 23 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారు. చాలామందిలో ఆయాసం, విపరీతమైన ఆలసట, శ్వాస కష్టంగా ఉండటం, ఎక్కువ దూరం నడవలేక పోవడం, లేచి నడవలేక పోవడం, కాళ్లు, కీళ్లు, మెడ, భుజం నొప్పులు కనిపించాయి. కోలుకున్నాక వారం నుంచి నెల రోజులు ఇలాంటి కొత్త సమస్యలు వచ్చినట్లు చెప్పారు. కొందరు ప్రధానంగా శ్వాసకోశ ఇబ్బందులు, కాళ్లలో రక్తం గడ్డ కట్టడం, విరోచనాలతో చికిత్సకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా నయమ్యాక దాదాపు పది శాతం మందిలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (కడుపు ఉబ్బరం, విరేచనాలు) కనిపిస్తోంది. మరో అయిదు శాతం మందిలో రక్తం చిక్కబడి సరఫరాలో అవరోధాలు వస్తున్నాయి. కొందరిలో 2 నెలల పాటు డయేరియా ఉంటుంది.
వ్యాకోచించని ఊపిరితిత్తులు
కరోనా వచ్చిపోయిన తర్వాత కొందరిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు(పల్మనరీ ఫైబ్రోసిస్) ఏర్పడతాయి. సాధారణంగా ఇన్ఫెక్షన్ తగ్గితే మచ్చలు మానిపోవాలి. కొందరిలో వైరస్ తీవ్రత కారణంగా పల్మనరీ ఫ్రైబోసిస్ దీర్ఘకాలంగా ఉంటుంది. ఈ మచ్చలు మానకపోతే పుండుగా మారే ప్రమాదముంది. ఊపిరిత్తులు సాగే గుణం కోల్పోయి, కుంచించుకు పోతాయి. మచ్చలు నయంకాకపోతే కరోనా తగ్గిన 4 నెలల తర్వాత ఆయాసం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మెట్లు ఎక్కడంలో ఆయాసం, కొద్ది దూరం నడవగానే ఊపిరి తీసుకోవడం కష్టమై కూలబడి పోవడం కనిపిస్తుంది. వీరు నెల నుంచి నెలన్నర పాటు ఆక్సిజన్పై ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతోపాటు కొన్ని రకాల మందులతో శ్వాసకోశ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తామని కేర్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ వైద్యుడు చైతన్య చల్లా వివరించారు.
స్టెరాయిడ్స్ ఆపేస్తే
కరోనా వైద్యంలో కొన్ని రకాల స్టెరాయిడ్స్ కొందరు రోగులకు ఇస్తారు. అవి పూర్తి కాలం, సరైన డోస్ వేసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. నాకు నెగెటివ్ వచ్చింది. లక్షణాలు లేవు, ఇక మందులు ఎందుకు? అంటూ కొందరు మందులను ఆపేస్తారు. దాంతో శ్వాసకోశ సమస్యలు, పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొందరికి నెల నుంచి నెలన్నర పాటు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనిని దశల వారీగా, వైరస్ తీవ్రత ఆధారంగా వైద్యుల సలహా మేరకు తగ్గించుకుంటు పోవాలే తప్ప సొంత నిర్ణయాలతో ఆపడం సరికాదని సూచిస్తున్నారు.
రక్తం సరఫరాలో అడ్డంకులు
కరోనా తగ్గిపోయిన తర్వాత కొందరిలో రక్తం చిక్కబడుతుంది. ఇలాంటి సమయంలో రక్త సరఫరాలో అవరోధాలు (బ్లడ్ క్లాట్స్) ఏర్పడతాయి. కాళ్లలో గడ్డలుగా ఏర్పడడం, రక్త సరఫరా నిలిచిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె స్పందనలు ఆగిపోవడం చోటు చేసుకునే ముప్పు ఉంటుంది. దీని నివారణకు ఒకటి నుంచి రెండు నెలల పాటు రక్తం పల్చబడే మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. కరోనా వైద్యంలో వినియోగించిన కొన్ని రకాల మందుల వల్ల ఫంగస్, క్షయ ముప్పు ఉంటుంది. కరోనా తగ్గిన 3-4 నెలల తర్వాత ఈ సమస్యలు మొదలవుతాయి.
తగ్గాక ఇలా ఉండాలి
ఆహారం హడావుడిగా తినొద్దు. ఏది పడితే అది తీసుకోవద్దు. వేళలు పాటించాలి. మసాలాతో కూడిన ఆహార పదార్థాలు తినొద్దు. డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిచ్చిన మందులను పూర్తి కాలం, పూర్తి డోస్ వాడాలి. కాళ్లు, మెదడు, రక్త నాళ్లాలో సరఫరాలో అవరోధాలు ఏర్పడితే రక్తం పల్చబడే మందులు వినియోగించాలి. రోగ నిరోధక శక్తినిచ్చే పండ్లు, ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
పది శాతం మందికి..
మేం వైద్యం చేసిన వారిలో పది శాతం మందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కనిపించింది. కొద్ది మందికి కరోనా చికిత్సలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తోంది. 5 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యతో తిరిగి ఆస్పత్రికి వచ్చారు. కొన్ని రకాల మందులతో.. కరోనా తగ్గిపోయిన తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల నివారణకు చికిత్స పద్ధతులపై దృష్టి పెట్టాం. ఎన్ని రోజుల్లో తగ్గించగలమనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరిలో రోజుల్లో తగ్గిపోవచ్చు, మరి కొందరిలో నెలల సమయం పట్టొచ్చు.
డాక్టర్ సుధీర్ నడిమిపల్లి,
పల్మనాలజిస్టు, సన్షైన్ ఆస్పత్రి
హోం ఐసోలేషన్లో ఆక్సిజన్
కరోనా తగ్గాక కొందరిలో ఊపిరితిత్తుల టిష్యూలు గట్టిపడుతున్నాయి. దాంతో తీవ్రమైన అలసట, కండరాల నొప్పులతో రెండు, మూడు నెలల వరకు బాధపడే అవకాశముంది. వీరికి ఇంటిదగ్గరే దీర్ఘకాలికంగా ఆక్సిజన్ ఇవ్వాలి. సరైన మోతాదులో ఆక్సిజన్ అందకపోతే గుండె విఫలమయ్యే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఇచ్చే మందులతో ఇన్ఫెక్షన్, న్యుమోనియా వంటివి తగ్గిపోవాలి. ఇలా తగ్గకపోతే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారికి ఇంట్లో ఆక్సిజన్ థెరపీయే పరిష్కారం.
డాక్టర్ చైతన్య చల్లా,
జనరల్ మెడిసిన్, కేర్ ఆస్పత్రి
Courtesy Andhrajyothi