59 ఏళ్ల వృద్ధుడికి.. ఐదు గంటల శస్త్రచికిత్సతో పునర్జన్మ.. చైనా వైద్యుల ఘనత
వూక్సి(చైనా) : కరోనా(కొవిడ్-19) వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాని బారినపడి జీవన్మరణ పోరాటం చేస్తున్న ఓ వృద్ధుడికి(59) చైనా వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా మందగించి.. చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడి ప్రాణాలను నిలిపారు. చైనాలోని జింగ్సు ప్రావిన్స్.. వూక్సి నగరంలో ఉన్న పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం సదరు రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. జనవరి 26న సదరు వృద్ధుడికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించగా, అనంతరం నిర్వహించిన వివిధ వైద్యపరీక్షల్లో అతడికి ఆ వ్యాధి లేదని నిర్ధారణ అయింది.
అయినప్పటికీ అతడి శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఊపిరితిత్తుల మార్పిడికి నిర్ణయించారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి దానం చేసిన ఊపిరితిత్తులను.. కేవలం 7 గంటల్లోనే హైస్పీడ్ రైలులో వూక్సీ నగరంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఐదు గంటల సర్జరీతో వైద్యుల బృందం ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా పూర్తిచేసింది.
Courtesy Andhrajyothi