– లాక్డౌన్ వేళ గర్భిణీలకు అష్టకష్టాలు
– ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్తంభించిన వైద్య సేవలు
– కఠోర వాస్తవాల్ని బయటపెట్టిన ‘జాతీయ ఆరోగ్య మిషన్’ గణాంకాలు
– గణనీయంగా పడిపోయిన..చెకప్లు, ఇంజెక్షన్లు..వ్యాక్సిన్లు
– ఏప్రిల్-జూన్ మధ్య తగ్గిన ఐరన్ ట్యాబ్లెట్స్ పంపిణీ
– బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం : వైద్య నిపుణులు
దేశవ్యాప్తంగా హఠాత్తుగా ప్రకటించిన కఠిన లాక్డౌన్ గర్భిణీలు, ప్రసవ మహిళలను అష్టకష్టాలకు గురిచేసింది. వీరికి ఉద్దేశించిన వైద్య సేవలు స్తంభించిపోయాయన్న సంగతి ‘జాతీయ ఆరోగ్య మిషన్’ విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా గర్భిణీలకు, ప్రసవ మహిళలకు కనీస వైద్య సేవలు దూరమైన సంగతి బయటపడింది. నవజాత శిశువులకు ఇచ్చే టీకాలు, గర్భిణీలకు చెకప్లు, టెటానస్ ఇంజెక్షన్లు, ఐరన్ ట్యాబ్లెట్ల పంపిణీ..ఇదంతా గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో, పట్టణాల్లో హాస్పిటల్స్లో ప్రసవాల సంఖ్య దారుణంగా పడిపోయిందని ‘జాతీయ ఆరోగ్య మిషన్’ గణాంకాల ఆధారంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : గర్భిణీలకు ఆరోగ్య సేవలు, పోషకాహార పంపిణీ, టీకాలు..వంటివి అందజేయటంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆశా వర్కర్లు, నర్సులు, ఏఎన్ఎంల పాత్ర చాలా ముఖ్యమైనది. ఒకవేళ లాక్డౌన్ పక్కా ప్రణాళిక ప్రకారం అమలుజేసివుంటే, వీరి సేవలన్నీ ఆరోగ్యరంగంలో కొనసాగేవని వైద్య నిపుణులు భావిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్లలో వైద్య సేవలు 90శాతం స్తంభించిపోయాయి. చెకప్లు, ఇంజెక్షన్లు ఇవ్వటం, టీకాలు…వంటివేవీ అందుబాటులో లేకుండా పోయాయనడానికి జాతీయ ఆరోగ్య మిషన్లో నమోదైన గణాంకాలే ఆధారం.
హాస్పిటల్లో ప్రసవాలు
ప్రసవం అంటేనే గర్బిణీ స్త్రీకి మరో జన్మలాంటిది. హాస్పిటల్లో జరిగే ప్రసవాల్లో మరణాల రేటు చాలా చాలా తక్కువ. కాబట్టే వైద్యులు తరుచూ చెప్పేది…ప్రసవం కచ్చితంగా హాస్పిటల్లో అయ్యేట్టు చూసుకోవాలని. ఆ సమయంలో పరిస్థితి సంక్లిష్టంగా మారితే మెరుగైన వైద్య సేవలు అందేట్టు నర్సులు, డాక్టర్లు చూస్తారు. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య హాస్పిటల్ ప్రసవాల సంఖ్య 48లక్షలుకాగా, ఈ ఏడాది లాక్డౌన్ వేళలో 34లక్షలకు తగ్గింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 60 లక్షల మంది రిజిష్టర్ చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనినిబట్టి…దాదాపు 26లక్షల మంది వైద్య సేవలకు దూరమయ్యారని తెలుస్తున్నది. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్లో మొత్తంగా ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దక్కనివైద్యం
డిఫ్తీరియా (గొంతు వాపు), కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు…మొదలైన వ్యాధులు రాకుండా శిశువుకు రెండు మూడు దఫాలుగా పలు టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. శిశువు పుట్టిన మూడో రోజునే బీసీజీ ‘జీరో’ డోస్ కచ్చితంగా ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ల కార్యక్రమమంతా కూడా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. బీసీజీ, పోలియో, హెపటైటస్ బీ..ఈ మూడు చాలా ముఖ్యమైనవి. లాక్డౌన్ కారణంగా ఈ మూడు వ్యాక్సిన్లు కేవలం 25 నుంచి 30శాతం శిశువులు మాత్రమే పొందగలిగారు. ఉదాహరణకు, గత ఏడాది పోలియో వ్యాక్సిన్ ‘బర్త్ డోస్’ 54లక్షల మంది శిశువులకు ఇచ్చారు. ఈసారి ఈ వ్యాక్సిన్ 39లక్షల మందికి అందింది. రెండు మూడు దశల్లో (9 నెలలు-3 సంవత్సరాలు మధ్య) వ్యాక్సిన్లు పొందాల్సిన వారంతా కూడా వైద్యసేవలు అందుబాటులో లేక నష్టపోవాల్సి వచ్చింది.
ఐరన్ గోలీలు…
మనదేశంలో సగానికిపైగా గర్భి ణీలు పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరు రక్తహీనత నుంచి బయటపడటానికి ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ (బి కాంప్లెక్స్ విటమిన్లు) ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. ప్రసవానంతరం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే వైద్యుల సూచనమేరకు ఈ మందులు తగినమోతాదులో తీసుకోవాలి. గత ఏడాది 64లక్షల మంది గర్బిణీలకు ఈ మందులు అందజేయగా, లాక్డౌన్ వేళ 51లక్షల మందికి ఇచ్చారు.
ఇంజెక్షన్లు…
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది హాస్పిటల్స్లో గర్భిణీల రిజిస్ట్రేషన్ గణనీయంగా పడిపోయింది. 2019 ఏప్రిల్, మే, జూన్ మూడునెలల్లో 75లక్షల మంది గర్భిణీలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిష్టర్ చేసుకున్నారు. 2020 ఏప్రిల్-జూన్ …మూడు నెలల్లో వారి సంఖ్య 60లక్షలకు తగ్గింది. నాలుగుమార్లు వైద్యుడి సమక్షంలో చెకప్లు చేయించుకున్న గర్భిణీలు 40లక్షల మంది. ఆపరేషన్ కోతలు, ఇతర కారణాలతో శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేది ‘యాంటీ టెటానస్’ ఇంజెక్షన్. దీనిని రెండు దఫాలుగా ఇస్తారు. ఇది కేవలం 34లక్షల మందికి మాత్రమే అందింది.
Courtesy Nava telangana