– ఆర్థికవ్యవస్థ పతనానికి కారణం మోడీ సర్కార్ విధానాలు
– దళితులు, గిరిజనులు, మహిళల జీవన పరిస్థితులు తారుమారు
– గవర్నెన్స్ రివ్యూ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చాక…మనదేశంలో అణగారిన వర్గాల సామాజిక స్థితిగతులు మరింతగా దెబ్బతిన్నాయని ‘గవర్నెన్స్ రివ్యూ నివేదిక’ వెల్లడించింది. ‘వాదా నా తోడో అభియాన్’ అనే పౌర సేవల సంస్థ ఈ నివేదికను రూపొందించింది. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపుపై ఈ సంస్థ కృషి చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అధికార పార్టీ ఎన్నికల వాగ్దానాలు, ఆయా అంశాల్లో ప్రభుత్వం బాధ్యతను తెలియజేసే విధంగా పలు సర్వేలు నిర్వహించి నివేదికలు విడుదల చేస్తుంటుంది. మోడీ నేతృత్వంలో ఎన్డీ యే రెండోసారి అధికారం చేపట్టాక, పౌరసత్వ సవరణ చట్టం, కరోనా వైరస్వ్యాప్తి ముఖ్యంగా అణగారిన వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని నివేదిక అభిప్రా యపడింది. ఈ నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి..
ఆర్థిక విధానాల్లో లోపం
భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని సుమారుగా రూ.350లక్షల కోట్లకు (5ట్రిలియన్ డాలర్లు) తీసుకెళ్తామని మోడీ సర్కార్ ఘనంగా ప్రకటించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరమూ చూస్తేనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలి..సామాన్యుడి నడ్డి విరిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేగానీ ఇప్పుడున్న పరిస్థితులు మారవు. దళితులు, గిరిజనులు, మహిళల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పథకాలేవీ లేవు. బడ్జెట్లో నిధులకేటాయింపు సైతం నిరుత్సాహంగా ఉంది. సమాజంలో అత్యంత పేదల సంక్షేమం కోసం పాలకులు సరైన ఆర్థికవిధానాల్ని ఎంచుకో లేకపోయారు. బ్యాంకింగ్ రం గంలో సంక్షోభం తీవ్రతరమైంది. కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న వేలకోట్ల రూపాయలు మొండిబకాయిలుగా మారా యి. ఈ మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగానికి పెద్ద గుదిబండగా మారాయి.
వివక్షతో కూడిన పన్ను విధానం
పన్ను వసూళ్లలో సైతం కార్పొరేట్ వర్గానికి ఒక విధంగా, సామాన్యుడికి ఒకవిధంగా మోడీ
సర్కార్ వివక్షాపూరితమైన విధానానాన్ని తీసుకొచ్చింది. 30శాతం నుంచి 22శాతం శ్లాబ్లోకి కార్పొరేట్ వర్గాలను మార్చి, సామాన్యుల్ని 30శాతంపన్ను శ్లాబ్లోకి చేర్చింది. జీఎస్టీ పన్ను విధానం పేదల్ని మరింత పేదలుగా మార్చింది. అనేక రకాలవస్తువుల ధరలు అమాంతం పెరగడానికి కారణ మైంది. అసంఘటితరంగంలో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
పెరిగిన నేరాలు
జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన (2018) నివేదిక ప్రకారం, దళిత మహిళలపై దాడులు పెరిగాయి. మనదేశంలో ప్రతిరోజూ 10 లైంగిక దాడి కేసులు నమోదైతే, అందులో 8 కేసుల్లో బాధితులు దళిత మహిళలే ఉన్నారని ఎన్సీఆర్బీ అంకెలు తెలుపుతున్నాయి. దేశవ్యాప్తం గా లింగ వివక్ష, కుల వివక్షతో కూడిన నేరాలు పెరగటం ఆందోళన కలిగించే విషయం. ఇంత జరుగుతున్నా, ఈ ఘటనల్లో బాధితుల న్యాయ సేవల కోసం కేంద్రం కేటాయించిన రూ.46కోట్లు ఏ మూలకు సరిపోతాయని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.