- టైమ్స్ ‘ఇండియా అవుట్బ్రేక్ రిపోర్ట్’లో అంచనా
- దేశంలో సెప్టెంబరు 2 నాటికి పతాకస్థాయికి కేసులు
- అప్పటికి 87 లక్షలకు యాక్టివ్ కేసులు
- అప్పట్నుంచి సెప్టెంబరు 16 దాకా నిలకడ
- ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుదల
- డిసెంబరు 3కల్లా పూర్తిగా తగ్గుముఖం
- మునుపటి హాట్స్పాట్లలో చాలామందిలో యాంటీబాడీలు
- పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీని సాధించామన్న అభిప్రాయం
- మహారాష్ట్రతో సమానంగా తెలంగాణలో రీప్రొడక్షన్ నంబర్
- తెలంగాణలో 15వ తేదీకే పతాకస్థాయి!
- అక్టోబరు 17 నాటికి పూర్తిగా అంతం
- ఏపీలో ఆగస్టు 23కు పతాక స్థాయి
- అక్టోబరు 28కి పూర్తిగా తగ్గుముఖం!
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తిరోగమనానికి సమయం ఆసన్నమైందా? మరో రెండు వారాల్లో.. అంటే సెప్టెంబరు 2 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరి, అక్కణ్నుంచి తగ్గుముఖం పట్టి.. డిసెంబరు మొదటివారం నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోనున్నాయా? సీరో సర్వేల్లో వెల్లడవుతున్న విషయాలు, ‘టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ రిపోర్ట్ (ఐవోఆర్)’ అంచనాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. వేలు, లక్షల సంఖ్యలో కేసుల ఒత్తిడితో.. ఆస్పత్రులు సరిపోక.. సతమతమైన ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో కూడా ఇలాగే కరోనా పాజిటివ్ల సంఖ్య ఒక దశలో పతాకస్థాయికి చేరి అక్కణ్నుంచి తగ్గుముఖం పట్టింది. అదే దశ మనదేశంలో కూడా త్వరలోనే రాబోతోందని ‘టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ రిపోర్ట్’ అంచనా వేస్తోంది. ప్రముఖ డేటా సంస్థ ప్రోటివిటీతో కలిసి ‘టైమ్స్ నెట్వర్క్ అండ్ రిసెర్చ్’ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 2 నాటికి దేశంలో 7.87 లక్షల యాక్టివ్ కేసులు ఉంటాయి. అప్పట్నుంచీ సెప్టెంబరు 16 దాకా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చి.. డిసెంబరు 3నాటికి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందట.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఆగస్టు 15 నాటికే కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరిందని.. అక్టోబరు 17 నాటికి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఐవోఆర్ అంచనా. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23 నాటికి కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరి.. అక్టోబరు 28 నాటికి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 20 నాటికి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య 28.37 లక్షలు కాగా.. అందులో యాక్టివ్ కేసుల సంఖ్య 6.86 లక్షలు. దాదాపు 21 లక్షల మంది ఇప్పటికే ఆ వైరస్ బారిన పడి క్షేమంగా కోలుకున్నారు. అంటే 74 శాతం రికవరీ రేటు. ఆగస్టు నెలలో రోజువారీ రికార్డులు అత్యధిక స్థాయిలో నమోదైనప్పటికీ.. భారతదేశం అమెరికా (55.3 లక్షలు), బ్రెజిల్ (34.7 లక్షల కేసులు) తర్వాత మూడోస్థానంలోనే ఉంది. మరణాల రేటు కూడా ఆ దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. ఆ దేశాలతోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా మరణాల రేటు (వైరస్ సోకినవారిలో చనిపోయినవారి సంఖ్య) చాలా తక్కువ.
పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీ?
ఢిల్లీ, ముంబై, పుణెల్లో నిర్వహించిన సీరో సర్వేల ప్రకారమైతే దేశవ్యాప్తంగా పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లు కనిపిస్తోందనే వాదన వస్తోంది. శాస్త్రీయ ఏకాభిప్రాయం లేనప్పటికీ సర్వే వివరాల ప్రకారమైతే.. కొన్నిచోట్ల కేసుల సంఖ్య తగ్గడానికి పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీనే కారణమని కొందరు వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు.. పుణె సీరో సర్వేలో 50 శాతం మందిలో కొవిడ్-19కు యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. గోవండీలో 57ు, ధారావిలో 54ు, వొర్లిలో 42ు, చెంబూర్ ఎక్స్టెన్షన్లో 48ు మందిలో యాంటీబాడీలు ఉన్నాయి. అంటే ఒకప్పటి హాట్స్పాట్లన్నీ హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తున్నాయన్న మాట. ఢిల్లీ తాజా సీరో సర్వే ప్రకారం.. 29.1 శాతం మందిలో యాంటీబాడీలున్నాయని వెల్లడైంది. అంటే, ఢిల్లీ జనాభాలో 58 లక్షల మంది.. తెలిసో, తెలియకో వైరస్ బారిన పడి కోలుకున్నవారే!
మహారాష్ట్రలో సెప్టెంబరు 14 నాటికి..
కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో సెప్టెంబరు 14 నాటికి కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరుతుందని.. అప్పటికి ఆ రాష్ట్రంలో 2.23 లక్షల యాక్టివ్ కేసులు ఉంటాయన్నది ‘టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ రిపోర్ట్’ అంచనా. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కేసుల సంఖ్య స్థిరంగా ఉండి, క్రమంగా తగ్గుముఖం పడతాయని నవంబరు రెండోవారం నాటికి అక్కడ కరోనా పూర్తిగా తగ్గుతుందని పేర్కొన్నారు.
- కర్ణాటకలో కేసుల సంఖ్య ఆగస్టు 28 నాటికి.. బిహార్, యూపీల్లో సెప్టెంబరు 1నాటికి పతాక స్థాయి కి చేరుతుందని అంచనా వేసింది. కర్ణాటకలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న బెంగళూరులో ఈ నెలాఖరు కు పాజిటివ్ల సంఖ్య పతాకస్థాయికి చేరి.. నవంబరు రెండోవారానికి పూర్తిగా తగ్గొచ్చని అంచనా.
- అన్ని రాష్ట్రాల కంటే ఒడిశాలోనే చివరగా.. సెప్టెంబరు 14 నాటికి కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరుతుందని టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. చెన్నైలో అక్టోబరు చివరికి, ఢిల్లీలో నవంబరు మొదటి వారానికి పూర్తిగా తగ్గిపోతాయి.
విజయవాడలో 40.51శాతం మందికి..
ఏపీలో కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సీరో సర్వే నిర్వహించగా.. కృష్ణా జిల్లాలో పాజిటివిటీరేటు (20 శాతం) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తూర్పుగోదావరిలో 15ు, అనంతపురంలో 14 శాతం, నెల్లూరులో 9 శాతం విటీ రేటు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా విజయవాడలో 43.81 శాతం మందిలో యాంటీబాడీస్ కనపడినట్టు సీరో సర్వేలో తేలింది. వీరిలో 40.51ు మందికైతే అసలు తమకు వైరస్ సోకినట్టుగానీ, తగ్గినట్టుగానీ తెలియదు. మిగతా 3.3ు మందిలో లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందారు.
తెలంగాణలో ఆర్నాట్.. 1.24
కరోనా వ్యాప్తిని అంచనా వేయడంలో కీలకపాత్ర పోషించే ‘ఆర్ నాట్’ (అంటే రీ ప్రొడక్షన్ నంబరు) ఆగస్టు 15 నాటికి మహారాష్ట్ర, తెలంగాణల్లో 1.24గా ఉందని తేలింది. అంటే.. ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్ పాజిటివ్గా తేలిన ఒక వ్యక్తి నుంచి 1.24 మంది కి సోకే అవకాశం ఉన్నట్టు. కర్ణాటకలో ఈ ఆర్ రేటు 1.44 కాగా.. తమిళనాడులో 1.35గా ఉంది. రాజస్థాన్లో 1.06, ఢిల్లీలో 1.10గా ఉంది. ఆర్ రేటు ఎంత తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అంత తక్కువని అర్థం.
అంచనా ఇలా
ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగా.. అత్యంత అధునాతనమైన గణిత నమూనాలను అనుసరించి టైమ్స్ నెట్వర్క్ అండ్ రిసెర్చ్, ప్రోటివిటీ సంస్థ ఈ ‘ఇండియా అవుట్బ్రేక్ రిపోర్ట్ (ఐవోఆర్)’ను రూపొందించాయి.
అన్నీ మంచి శకునములే
న్యూఢిల్లీ : దేశంలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమేగానీ.. పెరుగుదల శాతం మాత్రం తగ్గుతోంది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. జూలై 25 నాటికి దేశంలో రోజూ కేసుల సంఖ్య సగటున 3.7 శాతం మేర పెరిగేది. కానీ, ఆగస్టు 18 నాటికి అది 2.3 శాతానికి తగ్గింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందనడానికి ప్రధాన సూచన అది. ఇక మరణాల రేటు విషయానికొస్తే.. చాలా దేశాల కన్నా మనదేశంలో చాలా తక్కువ. ఈ విషయంలో అంతర్జాతీయ సగటే 3.5-4ు దాకా ఉంటే.. మనదేశంలో అది ఇప్పుడు 1.9 శాతంగానే ఉంది. ఇక రీప్రొడక్షన్ రేటు.. అంటే ఒక పాజిటివ్ వ్యక్తి నుంచి ఎంత మం దికి వైరస్ సోకుతుందనే లెక్క చూస్తే జాతీయ సగటు జూలై 25 నాటికి 1.19 ు కాగా.. ఆగస్టు 18 నాటికి 1.05 శాతానికి తగ్గింది. దేశంలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోందనడానికి ఇవన్నీ సూచనలేనని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
Courtesy Andhrajyothi