- ఉండి, కంకిపాడులోనే కొనాలని ఒత్తిడి
- విలువ 40 వేలు.. కొనాల్సింది 70 వేలకు
- డైరెక్టరేట్ కేంద్రంగా దళారుల దందా
- పాడి గేదెల పథకంలో కొనుగోల్మాల్
తగ్గిన పాల ఉత్పత్తి…రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతంలో 4.5-5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా.. ప్రస్తుతం 3.70 లక్షల లీటర్లకు తగ్గిపోయింది. పాడి గేదెల పథకం అమల్లోకి వచ్చాక కూడా పాల ఉత్పత్తి ఎందుకు తగ్గిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న పాడి గేదెల పంపిణీ పథకం.. దళారులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మాయాజాలంతో దారి తప్పుతోంది. రూ.40 వేలు విలువ చేసే గేదెను రూ.70 వేలకు కొనుగోలు చేసి రైతులకు అంటగడుతున్నారు. వాస్తవానికి రైతులు తమకు నచ్చిన రాష్ట్రంలో, నచ్చినచోట గేదెలను కొనుక్కోవచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్లోని ఉండి(భీమవరం), కంకిపాడులో మాత్రమే కొనుగోలు చేయాలంటూ వెటర్నరీ అధికారులు, డైరెక్టరేట్లోని ఓ అధికారి, దళారులు ఒత్తిడి చేస్తుండడం శోచనీయం. దీనికితోడు జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా ఉన్న కొనుగోలు కమిటీలను రద్దు చేసి.. డెయిరీల వారీగా డెవల్పమెంట్ కార్పొరేషన్లో ఉన్నవారినే సభ్యులుగా నియమించి, అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం నిరుడు పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. డెయిరీల్లో సభ్యులుగా ఉన్న వారికి రాయితీపై గేదెలు, ఆవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, మిగిలిన రైతులకు 50 శాతం రాయితీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,581 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇప్పటి వరకు 52,440 మందికే రాయితీపై ఆవులు, గేదెలు ఇచ్చారు. మరో 5 వేల యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. డెయిరీలకు పాలు పోస్తున్న రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలనే నిబంధన విధించడంతో ఒక డెయిరీకి చెందిన అధికారులు పాత పాడి పశువులనే చూపి గ్రౌండింగ్ చేసేశారు. మొత్తం మీద 30ు కూడా గ్రౌండింగ్ కాలేదు. దీంతో ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా డీడీలు తీసిన లబ్ధిదారులకు మాత్రమే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పథకం నిబంధనల్లో పాడి గేదెలు ఎక్కడైనా కొనుగోలు చేసుకునే స్వేచ్ఛను లబ్ధిదారులకు ఇచ్చారు. కానీ, పేషీలోని ఓ అధికారి, డైరెక్టరేట్లోని మరో అధికారి, కొందరు దళారులు కలిసి.. తాము సూచించిన చోటనే కొనుగోలు చేయాలని వివిధ జిల్లాల అధికారులు, లబ్ధిదారులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. డీడీలు తీసిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాల్లో ఎక్కడైనా కొనుగోలు చేసుకునే అవకాశాన్ని రైతులకు ఇవ్వడం లేదు. అధికారులు, దళారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని భీమవరం సమీపంలో ఉన్న ఉండి, కృష్ణా జిల్లా కంకిపాడులో మాత్రమే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.మధ్య దళారులు.. లబ్ధిదారులతో పాటు జిల్లాల అధికారులకు ఫోన్లు చేసి, మాకు పై అధికారులు చెప్పారు.. మీరు మా దగ్గరే పాడి పశువులను కొనుగోలు చేయాలి అని చెబుతున్నారు. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఆవులు కావాలనుకునే వారిని కూడా గేదెలు కొనేలా ఒత్తిడి చేస్తున్నారు. రూ.40 వేల విలువైన గేదెను రూ.70 వేలకు కొనిపించే ప్రక్రియలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. దళారులు, ఉన్నతస్థాయిలో ఉండే అధికారుల మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం.
కమిటీల రద్దుతో కలకలం..జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా ఉన్న కమిటీలను సెప్టెంబరు నెలాఖరులో రద్దు చేశారు. ఈ కమిటీల స్థానంలో ప్రభుత్వరంగ సంస్థకు చెందిన డెయిరీ అధికారులను సభ్యులుగా నియమించారు. విజయ డెయిరీకి రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థకు చెందిన ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. మిగతా 3 డెయిరీలకు కూడా ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు అధికారులతో పాటు ఆ డెయిరీకి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించారు. కరీంనగర్ డెయిరీ కమిటీకి మాత్రం పశుసంవర్ధక శాఖాధికారిని సభ్యుడిగా నియమించారు.
Courtesy Andhrajyothi..