– మా మీద ఎందుకింత వివక్ష
– ఉన్నట్టుండి పొమ్మంటే.. ఎక్కడికి పోవాలి.. : ఢిల్లీ మురికివాడల ప్రజల ఆవేదన
న్యూఢిల్లీ : మురికివాడల ప్రజలపై పాలకులు, న్యాయస్థానాలు వ్యవహరిస్తున్న తీరు ఆ అభాగ్యజీవుల బతుకులకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో మురికివాడలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు.. దిక్కూమొక్కూలేని వారికి పునరావాసాలు కల్పించడంలోనూ దారుణంగా విఫలమవుతున్నాయి. తాజాగా దేశ రాజధానిలో రైల్వే ట్రాక్ల వెంబడి మురికివాడల్లో నివసిస్తున్న 48 వేల గుడిసెలను అక్కడి నుంచి తక్షణమే తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారిని ఉన్నఫళానా రోడ్డున పడేసింది. రైల్వేట్రాక్ల వెంబడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అక్కడి పర్యావరణమంతా కలుషితమవుతుందనీ, వాటిని శుభ్రపరుస్తూ అక్కడుండే బస్తీవాసులనూ తరలించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఇక్కడ ఆశ్రయం పొందుతున్న పలువురు బాధితులు స్పందిస్తూ.. ఉన్నఫళంగా వెళ్లమంటే ఎక్కడికెళ్తామనీ, కనీసం తమకు పునరావాసం కూడా చూపించకుండా ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటే లాక్డౌన్ కాలంలో తమనెవరు రానిస్తారని ప్రశ్నిస్తున్నారు.
శకుర్ బస్తీ (రైల్వే ట్రాక్ల పక్క ఎక్కువ మంది నివసిస్తున్నది ఈ మురికివాడలోనే..)లో ప్లాస్టిక్ సీసాలు సేకరించి వాటిని కాంట్రాక్టర్లకు అమ్మే పని చేసే శ్రావణ్ బింద్ మాట్లాడుతూ.. ‘నేను బీహార్లోని నలంద నుంచి ఆరేండ్ల కింద ఢిల్లీకి వచ్చాను. మా ఊళ్లో ఊన్న కొద్దిపాటి భూమిలో పంటలు పండవు. ఒకవేళ పండినా అది భూస్వాములు ఇచ్చిన రుణాలకే పోతున్నది.
దీంతో మా నాన్న నన్ను ఢిల్లీకి వెళ్లి బతకమన్నారు. అప్పటినుంచి నేను శకుర్ బస్తీలోనే ఉంటున్నాను. నేను ఇంతవరకు నా కుటుంబం కోసం ఒక్క రూపాయి కూడా కూడబెట్టలేదు. ఏదో పొట్టకూటికి బతుకుతున్నాం.
హఠాత్తుగా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఇక్కన్నుంచి వెళ్లిపొమ్మంటున్నది. వాళ్లు మా ఇండ్లు కూల్చడం లేదు. మా ఎముకలను విరిచేస్తున్నారు. ఎముకలు లేకుండా మనిషి నిల్చునేది ఎలా..?’
అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై మధ్యప్రదేశ్లోని టీకాంగఢ్ నుంచి షకుర్ బస్తీకి వచ్చిన ముఖేష్ రాయిక్వర్ స్పందిస్తూ.. ‘దేశవ్యాప్త లాక్డౌన్తో మేము ఉపాధి కోల్పోయాం. ఇప్పుడు నాకు నెలకు 8 రోజుల పని కూడా దొరకడం లేదు.
మేమిప్పటికే దారుణంగా నష్టపోయాం. ఇక ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చి మా గుడిసెలను పీకేస్తామంటుంది. ఈ లాక్డౌన్ కాలంలో మేము ఉండటానికి ఆశ్రయం ఎవరిస్తారు..?’ అని ప్రశ్నించాడు.
అన్నింటికంటే ముఖ్యంగా.. ‘రైల్వేలకు మేం కావాలి. ఇక్కడికి దగ్గర్నే ఉన్న షకుర్ బస్తీ రైల్వేస్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా సిమెంటు బస్తాలు సరఫరా అవుతాయి. వాటిని మోసేది మేమే’ అనీ, కానీ తమను ఇక్కడ్నుంచి వెళ్లిపోమ్మని ఆదేశిస్తున్నారని ముఖేశ్ కన్నీరుమున్నీరయ్యాడు.
చట్టాల గురించి తమకు అవగాహన లేదనీ, కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ పనులను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తాము అధికారంలోకి వస్తే మురికివాడల్లో నివసిస్తున్న వారికి ఇండ్లు కట్టిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారనీ, ఇప్పుడు ఆయన తన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశాడు. ఇదే బస్తీకి పెద్దగా వ్యవహరిస్తున్న వీరేందర్ కొలి స్పందిస్తూ.. ‘మురికివాడలేమీ దూరంగా ఉంచాల్సినవి కావు.
ఇక్కడ చుట్టు పక్కల ఉన్న పెద్ద, మధ్య తరగతి ఇండ్లల్లో పనిచేసేది మేమే. వారి జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో విధంగా మేం ఉన్నాం. మా పిల్లలు పెద్దవారవుతున్నారు. వాళ్లు (ప్రభుత్వం) మమ్మల్ని వేరేచోటకు తరలిస్తే మా పిల్లలకు అందుబాటులో ఉండే స్కూళ్లు దొరకవు.
ఢిల్లీని షాంఘై మాదిరిగా తయారుచేస్తామని రాజకీయ నాయకులు అంటున్నారు. కానీ వాటిని ఎవరు నిర్మిస్తారు..? మేం లేకుండా నగరాలు నిర్మించగలరా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Courtesy: NT