Buddhist Lamp Festival
హిందూమతంలో ‘దీపావళి’ పండగ అనేది ‘దుష్టుడు, దుర్మార్గుడు’ అయిన ‘నరకుడు’ అనే ‘రాక్షసుడి’ ని కృష్ణుడి భార్య సత్యభామ చంపినందుకు వారి దృష్టిలో అది ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ’ కాబట్టి బాణా సంచా పేల్చి, దీపాలు పెట్టుకుని సంబరంగా జరుపుకుంటారు. ‘దీపావళి’ పగకు, ప్రతీకారానికీ గుర్తు. అయితే బౌద్ధంలో కూడా ‘దీపావళి’ పండగ అనేది ఉందని కొంతమంది చెప్పడం విచిత్రంగా ఉంది. నిజానికి బౌద్ధంలో అటువంటి పండగ లేదు. అన్ని మతాలలో ప్రతి శుభ సందర్భానికి దీపం లేదా కొవ్వొత్తి వెలిగించడం అనేది మామూలే అయినప్పటికీ బుద్ధుడు ‘అత్త దీపోభవ’( be the lamp to yourself)అన్నాడు. చరిత్రలో కూడా ప్రతి బౌద్ధ క్షేత్రంలో ప్రార్ధన చేసేటప్పుడు దీపాలు వెలిగించే ఆచారం ఉన్నట్టు తెలుస్తుంది. బిక్షువులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలల పాటు ఒకే ప్రదేశంలో గృహస్తులకు దగ్గరగా జీవించాలి అనే నియమం ఉంది. దీని ఉద్దేశం వారు గృహస్తులకు సన్నిహితంగా ఉంటూ, వారికి బుద్ధుని ధర్మాన్ని వివరించడం, పరస్పరం సత్ సంబంధాలు ఏర్పరచుకోవడం. ఆ మూడు నెలల కాలాన్ని ‘వర్షా వాసం’ అంటారు. ‘వర్షా వాసం’ పూర్తయినాక గృహస్తులు ‘కఠిన చీవర దానం’ పేరుతో ఒక వేడుక జరిపి బిక్షువులకు కొత్త బట్టలు దానం చేస్తారు. అయితే ‘మహాయాన’ శాఖ వచ్చాక హిందూమతంలోవలే బౌద్ధంలో కూడా అనేక అభూత కల్పనలు, నమ్మకాలు వచ్చి చేరాయి. మహాయానాన్ని అవలంబించేవారు ‘తవతింస’ అనే స్వర్గంలో బుద్ధుడు తన తల్లి అయిన ‘మాయాదేవి’కి ‘అభిధమ్మ’ ను బోధించిన అనంతరం ఆ సందర్భంగా దీపాలు వెలిగించి ఉత్సవం చేస్తారు. ప్రస్తుతం ధేరవాద, మహాయాన శాఖల వారిద్దరూ ‘వర్షావాసం’ అనే ఆచారం పూర్తయ్యాక ‘అభిధమ్మ’ లేదా lamp festival పేరుతో పండగ జరుపుకుంటున్నారు. బహుశా అటువంటి దీపాల ఉత్సవాలు జరిగే ప్రదేశం కావున మన అమరావతి బౌద్ధ క్షేత్రానికి ‘దీపాల దిన్నె’ అనే పేరు ఉంది. బౌద్ధం లోని దీపాల పండగకీ, హిందూ మతంలోని ‘దీపావళి కీ అసలు సంబంధమే లేదు. హిందువులు అసురులైన నేటి దళితులను చంపినందుకు పండుగలు చేసుకుంటే బౌద్దులు అందుకు పూర్తిగా భిన్నమైన భావనతో ఉత్సవం చేసుకుని పెద్దలు, పిల్లలు పరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు. అది ఒక ప్రేమకు, కరుణకు చిహ్నం.