- రూ.68,751 కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీ
- సగం మంది ఉద్యోగులకు వీఆర్ఎస్
- నెల రోజుల్లో 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు..
- కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ప్రభు త్వ రంగ టెలికాం సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎ్సఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కంపెనీలను విలీనం చేయడంతో పాటు వాటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.69,000 కోట్లతో భారీ పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు.
అదనపు నిధుల సమీకరణ
బీఎ్సఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెత్తిన ఇప్పటికే రూ. 40,000 కోట్ల అప్పుల భారం ఉంది. ఇందులో సగం అప్పులు కేవలం ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో టెలికాం సేవలు అందిస్తున్న ఎంటీఎన్ఎల్వి. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఈ రెండు కంపెనీల అప్పుల భారం తక్కువ. అప్పులు తక్కువగా ఉండడంతో పాటు ఈ రెండు కంపెనీలకు స్థిరాస్తులూ ఎక్కువే. దీంతో ఈ ఆస్తులను హామీగా చూపి విస్తరణకు అవసరమైన పెట్టుబడులను బ్యాంకు ల నుంచి రుణాలుగా సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో 60 వేల 4జీ టవర్లు : బీఎస్ఎన్ఎల్
4జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో బీఎ్సఎన్ఎల్ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున 4జీ టవర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే 12-15 నెలల్లో 60వేల 4జీ మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు బీఎ్సఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్ ప్రకటించారు.
కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని నగరాల్లో ఇప్పటికే 10,000 టవర్లు పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. బీఎ్సఎన్ఎల్కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఖాతాదారులు ఉండి, 4జీ మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు పుర్వార్ తెలిపారు.
పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా రూ.29,937 కోట్ల మొత్తాన్ని రెండు కంపెనీల ఉద్యోగుల్లో సగం మంది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కోసం వెచ్చించనున్నట్లు మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. యాభై సంవత్సరాల వయోపరిమితి నిండిన ఉద్యోగులు ఈ వీఆర్ఎస్ పథకానికి అర్హులు. వీఆర్ఎ్సలో భాగంగా 60 ఏళ్ల వయోపరిమితి వచ్చే వరకు వీరికి జీతం ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 80 నుంచి 125 శాతం చెల్లించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల ఆదాయంలో సింహభాగం సిబ్బంది వేతనాలకే పోతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ఆదాయంలో మూడు నుంచి ఐదు శాతం జీతాల కోసం ఖర్చు చేస్తుంటే.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రం ఇందుకోసం 70 నుంచి 90 శాతం వెచ్చిస్తుండటం గమనార్హం.
దీంతో ప్రస్తుతం రెండు కంపెనీల్లో పని చేస్తున్న 1.9 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని వీఆర్ఎస్ ద్వారా వదిలించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ వీఆర్ఎస్ పథకానికి ఎంతమంది ఉద్యోగులు ఒప్పుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వీఆర్ఎస్ ద్వారా అర్హులైన ఉద్యోగులకు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉండే సర్వీసులో జీతం ద్వారా వచ్చే ఆదాయంలో 125 శాతం అందుతుంది. ఈ నిర్ణయం ద్వారా ఈ రెండు పీఎ్సయూల్లో పని చేస్తున్న లక్షలాది ఉద్యోగుల ప్రయోజనాన్నీ మేము పరిగణనలోకి తీసుకున్నాం.
రవిశంకర్ ప్రసాద్, టెలికాం మంత్రి
4జీ నెట్వర్క్ ఏర్పాటుకు అవసరమైన టెండర్లను రెండు నెలల్లో జారీ చేస్తాం.
పీకే పుర్వర్, సీఎండీ, బీఎస్ఎన్ఎల్
ప్యాకేజీలో ఇతర ముఖ్యాంశాలు
- రెండు కంపెనీలకు నెల రోజుల్లో స్పెక్ట్రమ్ కేటాయింపు
- స్పెక్ట్రమ్ కోసం రూ.20,140 కోట్లు
- స్పెక్ట్రమ్ కేటాయుంపునకు బదులుగా ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లు
- జీఎ్సటీ చెల్లింపు కోసం రూ.3,674 కోట్లు
- మూడేళ్లలో రెండు కంపెనీలకు చెందిన రూ.37,500 కోట్ల విలువైన ఆస్తుల నగదీకరణ
courtesy Andhra Jyothy