– మీడియాను అనుమతించొద్దన్న సీఎం
– జర్నలిస్టుల కోసం ఆదర్శనగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఓ గది
– టీఆర్టీ ఆందోళన నేపథ్యంలో ప్రగతి భవన్ చుట్టూ మరిన్ని ఆంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మీడియాపై ఆంక్షలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయి. అది బూర్గుల రామకృష్ణారావు భవన్ అయినా, ప్రగతి భవన్ అయినా.. మరేదైనా సరే… తాము చెప్పిందే రాసుకోవాలి తప్ప, ప్రశ్నించకూడదు, సమాచారం తెలుసుకోకూడదనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బీఆర్కే భవన్లోకి సచివాలయాన్ని తరలించిన నేపథ్యంలో.. ఆ భవనంలోకి ఇప్పటి వరకూ మీడియాను అనుమతించలేదు. అయితే సామాగ్రి, ఫైళ్లన్నింటినీ చాంబర్లలో సర్దిన తర్వాత.. జర్నలిస్టులను అక్కడికి అనుమతిస్తారంటూ మొన్నటి వరకూ అధికారులు చెప్పుకొచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడే కాదు, మున్ముందు ఎప్పుడూ కూడా ఆ భవనంలోకి ప్రెస్ను అనుమతించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారులు అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ఆదర్శనగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఓ గదిని కేటాయించాలంటూ ఆయన సూచించినట్టు సమాచారం. బీఆర్కే భవన్లోని వార్తలను కవర్ చేసే మీడియా ప్రతినిధులందరూ అక్కడే ఉండాలి తప్ప.. ఆ భవన్ వైపు తొంగి చూడొద్దంటూ ఆంక్షలు విధించనున్నారు. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సందర్భంగా ప్రగతి భవన్ అధికారులు.. మీడియాపట్ల అనుసరించిన నిర్లక్ష్య వైఖరిపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 6.30 గంటలపాటు ఫుట్పాత్పైన్నే పడిగాపులు కాయాల్సి రావటంతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి విదితమే. ఇది జరిగిన రెండు రోజులకే టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వారిని అదుపుచేయటం పోలీసులకు కత్తిమీద సామే అయింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఆంక్షలు విధించాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన ఆదేశించినట్టు ఓ అధికారి చెప్పారు. మరోవైపు సచివాలయాన్ని తరలించిన నేపథ్యంలో… బీఆర్కే భవన్లో ఇప్పటికీ పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటు కాలేదు. చాలా చాంబర్లలో ప్రింటర్లు, కంప్యూటర్లను ఇంకా అమర్చలేదు. దీంతో కనీసం ఫ్యాక్స్ను పంపేదుకుగానీ, ప్రింట్ తీసేందుకుగానీ అవకాశం లేకుండా పోయిందని అక్కడి సిబ్బంది తెలిపారు. సీఎంవోతోపాటు అనేక ఇతర ప్రధాన కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వారు వివరించారు. ఇదంతా సర్దుబాటు కావటానికి ఇంకో పది, పదిహేను రోజులు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Courtesy Nava telangana…