– వీజేఎస్ సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
-ఉద్యోగాల కోసం పోరాడటం బాధాకారం: కోదండరామ్
రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు, నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగాల సాధనకు గురువారం హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి జనసమితి (వీజేఎస్) ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. కోదండరామ్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళలర్పించి దీక్షను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నేడు పెట్టుబడి దారులకు నిలయంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయకుండా నిరుద్యోగులను మాయమాటలతో మోసం చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన వారి అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి తప్ప నానాటికీ తగ్గిపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూనివర్సిటీలో, ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాఠశాలల్లో అధ్యాపకులు, టీచర్స్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప సొసైటీ, రామోజీ ఫిల్మ్ సిటీ, ఎన్-కన్వెన్షన్లో నాగళ్లతో దున్నుతామన్న కేసీఆర్.. ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడటం బాధాకరమని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.17లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం 37 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, స్థానిక పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షతోనే తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. ప్రతి పల్లెకూ తిరిగి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి, విద్యార్థి జనసమితి నాయకులు నిజ్జన రమేష్ ముదిరాజ్, సర్దార్ వినోద్ కుమార్, సలీమ్, బాబుమహాజన్ తదితరులు పాల్గొన్నారు.
Courtesy NavaTelangana..