- శిథిలాల కింద 20గంటలు.. కాపాడిన సిబ్బంది
- ‘మహా’లో కూలిన అపార్ట్మెంట్.. 11 మంది మృతి
ముంబై : కుప్పకూలిన ఐందంస్తుల భవనం శిథిలాల కింద ఓ నాలుగేళ్ల బాలుడు 20 గంటలు చిక్కుకున్నా.. చివరికి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహద్ తహసీల్లోని కాజల్పురాలో ఓ అపార్ట్మెంట్ సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో పేకమేడలా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుక్కున్న మహమ్మద్ నదీం బంగి అనే బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం సాయంత్రం 3 గంటలకు ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు.
రాత్రంతా శిథిలాల కిందే ఉన్న ఆ బాలుడిని చూసిన స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగా అద్భుతమని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ ట్వీట్ చేశారు. అయితే, అతడి తల్లి మాత్రం మరణించింది. కాగా, ప్రమాదంలో 80 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. 11 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. 20 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. 13అధిక సామర్థ్యం కలిగిన ఎక్స్కవేటర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. భవనం కూలుతున్న సమయంలో రాయి వేగంగా తగలడంతో గుండెపోటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, భవన నిర్మాణ సంస్థ, ఆర్కిటెక్ట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Courtesy Andhrajyothi