– పోలీసుల ఓవరాక్షన్తో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
– పలువురికి గాయాలు.. నిరసనకారుల అరెస్టు
చికాగో : యూఎస్లో కొద్దిరోజుల క్రితం ఖాకీల కాఠీన్యానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం ప్రారంభమైన ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. కరోనాను సైతం లెక్కజేయకుండా నల్ల జాతీయులు భారీ ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. శనివారం చికాగోలో జరిగిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం ప్రశాంతంగా కొనసాగిన ఈ ఆందోళనలు.. పోలీసుల ఓవరాక్షన్తో ఆదివారం హింసాత్మకంగా మారాయి.
శనివారం రాత్రి వరకు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. పలువురు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఇందులో భాగంగా 25 మందిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో వారిపై పెప్పర్ స్ప్రేను, టీయర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సహనం కోల్పోయారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తాము చికాగో పోలీసుల చేతిలో చనిపోమని నినాదాలు చేస్తూ.. వారికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
Coutesy Nava Telangana