– భోపాల్ గ్యాస్ బాధితులకిచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపేసిన కేంద్రం
– పెరుగుతున్న కేసులు
– ముప్పైఐదు ఏండ్లైనా ఎదురుచూపులే..
భోపాల్ : యూనియన్ కార్బెడ్ సంస్థ నుంచి గ్యాస్ లీకై సర్వం కోల్పోయిన భోపాల్లో బాధితులకిచ్చే పరిహారం నుంచి మోడీ సర్కారు క్రమంగా తప్పుకుంటున్నది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ కూడా భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారాన్ని నిలిపివేసింది. 3,629 కేసుల్లో సుమారు రూ. 62 కోట్ల పరిహారం ఇంకా పెండింగ్లో ఉండటమే దీనికి నిదర్శనం. కాగా, అప్పటినుంచి మరో 200 కేసుల్లోనూ బాధితులు పాక్షికంగా అంగ వైకల్యం పొందగా.. వీరికీ పరిహారం అందించాలని భోపాల్ కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకూ కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. భోపాల్లోని కేంద్ర సంక్షేమ శాఖ కమిషనర్ సుశాంత్ హుడాన్ తెలిపిన వివరాల మేరకు.. తొమ్మిదేండ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన రూ. 874.28 కోట్లను నిరూపయోగంగా ఉంచారని తెలిపారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్లో లేఖ రాసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని చెప్పారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జూన్లో జరిపిన సమీక్ష సమావేశంలో భోపాల్ మెమొరియల్ హాస్పిటల్ ట్రస్ట్ (బీఎంహెచ్టీ) నిధులు రూ. 891 కోట్లను బాధితులకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అంతేగాక బీఎంహెచ్టీని ఏయిమ్స్గా మార్చాలని ప్రతిపాదనలూ వచ్చాయి.
అయితే, క్యాబినెట్ ఆమోదముద్ర వేస్తేనే ఇది కార్యరూపం దాల్చుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అప్పటిదాకా బాధితులకిచ్చే పరిహారాన్ని సైతం నిలిపేయడంపై హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. కాగా, బీఎంహెచ్టీని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలనీ, దానికి సంబంధించిన నిధులను వైద్యేతర పనులకు ఉపయోగించడానికి వీల్లేదని వారు చెబుతున్నారు.
Courtesy Navatelangana..