ఆర్. రఘు
భీమా కోరేగావ్ను మనం మర్చిపోదామన్నా కేంద్రం లోని మనువాద ప్రతిరూప ప్రభుత్వం మర్చిపోనిచ్చేలా లేదు. 1918 జనవరి 1న భీమా కోరేగావ్ గ్రామంలో జరిగిన దళితుల మహా ప్రదర్శన-ప్రతిగా హిందూత్వ శక్తుల ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసం, ఆ ముందు రోజు (1917 డిసెంబరు 31) పూనేలో ఈ ప్రదర్శన జయప్రదం చేయడానికి జరిగిన సభ-ఎల్గార్ పరిషత్, అందులో నాయకులు హిందూత్వంపై విరుచుకు పడ్డ తీరు బిజెపి నాయకత్వానికి చిర్రెత్తించాయి. 500 మంది మీద కేసులు నమోదయ్యాయి. 110 మందిని అరెస్ట్ చేశారు. దీనంతటికీ ఎల్గార్ పరిషత్లో రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు కారణమని, ఈ సభకి నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు వున్నాయని, రాజీవ్ గాంధీ హత్య మోడల్లో ప్రస్తుత ప్రధాన మంత్రిని హత్య చేసే కుట్ర రూపొందించారని ఇప్పటి వరకు దేశం లోని 13 మంది మేధావులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల మీద 153 ఎ, 120 బి వంటి క్రిమినల్ కేసులు పెట్టి నిర్బంధించారు. ఇంకా ఎంతమందిని అరెస్టు చేస్తారో తెలియదు. ప్రస్త్తుతం యుఎపిఎ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం) కింద వారిని నిర్బంధించారు.
వాస్తవానికి ఘటన జరిగినప్పుడు మహారాష్ట్రలో కూడా బిజెపి అధికారంలో వుంది. విచిత్రమేమంటే జనవరి ప్రదర్శనను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న హిందూత్వ శక్తులను వాటికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన ‘శివప్రస్ధాన్ హిందూస్తాన్’ నాయకుడు షాంబాజీ భిడే, ‘సమస్త హిందు ఆఘాడి’ నాయకుడు మిలింద్ ఏక్బోటే లను అరెస్ట్ చేసినట్లే చేసి వదిలేశారు. భిడే గతంలో జోదా అక్బర్ సినిమాపై దాడి, సినిమా హాళ్లు లూటీ చేశాడన్న నేరారోపణ కేసులు వున్న వ్యక్తి. మిలింద్ బిజెపి కార్పొరేటర్గా పనిచేశాడు. కాని ఆ తరువాత కొద్ది నెలలకే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం పడిపోయింది. శివసేన-ఎన్సిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్సిపి నాయకులు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. అధికారం లోకి వచ్చిన తరువాత కూడా కోరారు. దేశవ్యాపితంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో అనేక దళిత సమస్యలపై సిపిఎం వంటి వామపక్ష పార్టీలు ప్రత్యక్ష ఆందోళన సాగించాయి. కేంద్రంలో వున్న బిజెపి పరిస్థితి చేయి జారుతుందని గ్రహించి మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)కి అప్పగించింది. దీనితో యుఎపిఎ రంగంలోకి వచ్చింది. పైశాచిక వేట ప్రారంభమైంది. ఈ రాక్షస క్రీడ ఎప్పటిదాకా సాగుతుంది, ఎలా పరిణమిస్తుంది అన్నది ఊహించడం కష్టం కాదు. ఏమైనా ఇది హిందూత్వ శక్తులు విసురుతున్న ఓ పెద్ద సవాలు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నిర్బంధంలో వున్న మహేష్ రౌత్, సుధా భరద్వాజ్, అరుష్ ఫరేరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, వరవరరావు, గౌతమ్ నవలఖ, హనీబాబు, ఆనంద్ తేల్తుంబ్డే, షోమా సేన్, సుధీర్ ధావలే, సురేంద్ర గాడ్లింగ్, రోశా హిల్సన్… రాజకీయ, సైద్ధాంతిక అవగాహనలు ఎలా వున్నా మానవ హక్కులు ప్రత్యేకించి దళితులు, గిరిజనులూ, ముస్లిం మైనారిటీలూ, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో అనివార్యంగా ప్రస్తుతం కేంద్రంలో కొలువుతీరి వున్న మనువాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. న్యాయస్థానాల్లో ధనస్వామ్యానికి, అగ్రకుల దురహంకారానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు.
అందువలన ఈ కక్ష సాధింపు దాడి దళిత ఉద్యమం మీదే కాదు, దేశంలోని ప్రగతిశీల భావజాలం పైన, ప్రశ్నించే హక్కు మీద హిందూత్వ దాడిగా చూడాల్సి వుంటుంది. 80 సంత్సరాలు దాటిన వరవరరావు లాంటి వారికి కోవిడ్ సోకినా, ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం బెయిలిమ్మని కోరినా న్యాయస్థానం వినిపించుకోవడంలేదు. ఆశ్చర్యమేమంటే ఇప్పటి వరకు వీరిలో కొందరిపై ఛార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. మరింత విస్మయం కలిగించే విషయం ఏమంటే బిజెపి అఖిల భారత అధికార ప్రతినిధి సంవిద్ మహాపాత్రో ఎన్ఐఎ కి దొరికిందని చెబుతున్న సదరు లేఖను మీడియాకు చూపడం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అధినేత ఒకరు ఫ్రంట్లైన్ పత్రికకు ఈ ఉదంతాన్ని వివరిస్తూ యుఎపిఎ అనేది ప్రభుత్వం చేతిలో ఒక ఆయుధం లాగా తయారయింది. సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించడం, కఠినమైన బెయిలు నిబంధనలు విధించడం, విచారణను వీలైనంత నింపాదిగా జరిగే అవకాశం కలిగివుండటం చూస్తే నిందితులు బయటకు రావడం దాదాపు అసాధ్యం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం యుఎపిఎ కింద 2018 నండి 93 శాతం కేసులు వివిధ కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయి. నిర్ధారణ అయినవి కేవలం 27 శాతం మాత్రమే.
‘భీమా కోరేగావ్’ గురించి…
ఇప్పటికే అనేక వివరాలు పత్రికల ద్వారా తెలిసినవే. భీమ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం కోరేగావ్. 1818 జనవరి 1వ తేదీన పూనా రాజధానిగా పరిపాలన చేస్తున్న చిత్ పవన్ బ్రాహ్మలైన పీష్వాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఒక భాగమైన మహర్ (దళిత కులం) రెజిమెంట్కు జరిగిన యుద్ధంలో అత్యంత శక్తివంతమైన పీష్వా సైన్యం వెనుదిరిగింది. ఈ యుద్ధంలో 27 మంది మహర్ సైనికులు మరణించారు. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ కోరేగావ్లో ఓ స్థూపాన్ని నిర్మించింది. ఈ యుద్ధం వలస పాలకులకు, స్థానిక రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంగా మాత్రమే చూడకూడదు. ఇక్కడ విస్మరించరాని మరో అంశం ఇమిడి ఉంది. అదే కులం. నాటి పీష్వాల కుల దురహంకార పాలనపై మహర్లు చేసిన ఓ తిరుగుబాటుగా కూడా చూడాల్సి ఉంటుంది. కారణం నాటి పీష్వా పాలన శూద్రులు, అతి శూద్రుల మీద అత్యంత నిరంకుశంగా వుంది. అయితే ఈ యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ అంటరాని కులాల విషయంలో తన వైఖరి మార్చుకుంది. వీరిని సైన్యంలో చేర్చుకోవడం ఆపేసింది.
వాస్తవానికి కోరేగావ్ లోనే కాదు. 1826 ఖతియవాడ్లో, 1846 ముల్తాన్, 1880 రెండవ ఆఫ్ఘన్ యుద్ధంలో ఈ మహర్ రెజిమెంటు చాలా వీరోచితంగా పోరాడింది. అయితే 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో అనేక రాష్ట్రాల్లో దళితులు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసే క్రమంలో బ్రిటీష్ ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకుని వారిని సైన్యం లోకి తీసుకోవటం ఆపేసింది. దీనిపై మహర్ రెజిమెంటులో పని చేసిన గోపాల్ బాబా వాలంకర్, శివరాం జన్బా కాంబ్లే వంటి వారు తమ జాతుల వీరత్వాన్ని బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించాలని, ఇతర కులస్తులతో పాటు తమను కూడా సైన్యంలో చేర్చుకోవాలని అనేక విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అలాగే అంబేద్కర్ తండ్రి రాంజీ అంబేద్కర్ కూడా తమ జాతి వీరత్వాన్ని గుర్తించాలని అనేక పిటిషన్లు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుండే తిరిగి బ్రిటీషు వారు ఇతర కులస్తులతో పాటుగా దళితులను సైన్యంలో రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించారు. 1927 జనవరి 1న భీమా కోరేగావ్ ‘రణ స్థూపం’ నిర్వాహకులుగా వున్న కాంబ్లే వంటి వారి ఆహ్వానంపై డా|| బి.ఆర్ అంబేద్కర్ సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఆనంద్ తేల్తుంబ్డే చెప్పినట్లు దళత ఉద్యమానికి ఒక ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వటానికి…మహర్ల పూర్వీకులు జరిపిన ఆ యుద్ధాన్ని దేశమంతా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రకటించారు. అందువలన ఈ రోజు హిందూత్వ సిద్ధాంతకారులు ఆ చరిత్ర మొత్తాన్ని, అందులో ఇమిడి వున్న సాంఘిక పార్శ్వాన్ని వక్రీకరించి భారతీయులపై బ్రిటీషు సైన్యం చేసిన యుద్ధంగా దాన్ని వర్ణించారు. తద్వారా దళిత ఉద్యమంపై తమ దాడిని సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాటి నుండి ప్రతి సంవత్సరం జనవరి1వ తేదీన అనేక మంది దళితులు, బౌద్ధులు, అంబేద్కరిస్టులు అక్కడికి చేరుకోవటం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పరిపాటిగా వస్తున్నది. 2018 జనవరి 1కి 200 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి భారీగా కార్యక్రమం నిర్వహించడానికి 2017 డిసెంబర్ 31న (ఎల్గార్ పరిషత్) సభ నిర్వహించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బి.జి కోల్సే పాటిల్, పి.బి సావంత్లు నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఆనాటి వేదిక, పైన బ్యానర్లు కాని, నాయకుల ఉపన్యాసాలు కాని, సాంస్కృతిక కళారూపాలు కాని ప్రమాద స్థాయికి పెరిగిన హిందూత్వ శక్తుల గురించి…దళితులు, గిరిజనలు, మైనారిటీలు, మహిళాలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి…పెద్ద యెత్తున పేర్కొనటంతో కేంద్రంలోని బిజెపి సర్కార్కి, ఆర్ఎస్ఎస్కు కంపరం పుట్టించాయి. మొత్తం దాడికి ఇది ప్రధాన కారణం. అందువలన ప్రత్యక్షంగా పాల్గన్న న్యాయమూర్తులు స్పష్టంగా ప్రకటించినా, మీడియా ఆధారాలున్నా పట్టించుకోకుండా అనేక మంది మేధావులు, రచయితల మీద పైశాచిక దాడిని ప్రారంభించింది బిజెపి. ”ఇంత తీవ్రమైన ఆరోపణలున్న వ్యక్తులను ఐదారు నెలలపాటు ఎందుకు అరెస్టు చేయలేదు. వారిపై పెట్టిన ఛార్జిషీట్లను ఎందుకు బహిర్గతం చేయడం లేదు. బిజెపి నాయకులకు అందిన ప్రధాన మంత్రి హత్య కుట్ర పత్రాలు ప్రెస్కి ఎందుకు ఇవ్వరు. వారు చూపిస్తున్న ఒక కాగితంలో ఎల్గార్ పరిషత్కి నిధులిచ్చిన వారి పేర్లు, సంస్థల పేర్లు ఉండటం అసాధ్యం. మాకు ఎల్గార్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈ మధ్య కొల్హాపూర్లో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ వారు కత్తులు, తుపాకులతో బహిరంగంగా ప్రదర్శన చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు?’ అని మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు సుబోధ్ మోరే ప్రెస్ ముందు ప్రశ్నించారు.
హెచ్చరికలు…సవాళ్ళు…
స్వతంత్రం వచ్చిన ఐదు నెలల్లోనే జాతిపిత మహాత్మా గాంధీని చంపిన హిందూత్వ సంస్థల కార్యకర్త నాధూరాం గాడ్సే తన మరణ వాంగ్మూలంలో ‘గాంధీజీ హత్య దేశానికి ఒక హెచ్చరిక వంటిద’ని ప్రకటించాడు. ఈరోజు అత్యంత బలం చేకూరిన నేపథ్యంలో గాడ్సే వారసులు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.1992 డిసెంబర్ 6 డా||బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి రోజున బాబ్రీ మసీదును కూల్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత రాజ్యాంగాన్ని అనేక నగరాల్లో బహిరంగంగా తగులబెట్టారు. అంబేద్కర్ జయంతి రోజు ఆయన మనవడిని (ఆనంద్ తేల్తుంబ్డే) అరెస్టు చేశారు. క్రిస్మస్ సెలవు దినాన్ని వాజ్పేయి జన్మదినంగా మార్చాలని ప్రయత్నించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మేడే’ కాకుండా ‘విశ్వకర్మదినం’ జరపాలని ప్రకటనలు మొదలు పెట్టారు. అసలు రిజర్వేషన్లే ఎత్తేయాలని, దానిని సమీక్షించాలనే పేరిట కుట్ర ప్రారంభించారు.
ఈ హెచ్చరికలను గుదిగుచ్చి చూస్తే హిందూత్వ శక్తుల దాడి మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ప్రగతిశీల శక్తుల మీద, చివరకు వామపక్షాల మీద, విప్లవ శక్తుల మీద దాడికి ప్రయత్నాలుగా గమనించాలి. ఒక పక్క అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి సాగిలపడుతూ, దేశంలో అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడ ిదారులకు ఊడిగం చేస్తూ, మరో పక్క ఈ వివాదా లపై పెరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలను, ప్రజా క్రోధాన్ని ఎదుర్కోవడానికి హిందూత్వ శక్తులు అణగారిన తరగతుల పైన దాడిని పెంచుతున్నాయి. జర్మన్ కమ్యూనిస్టు యోధురాలు క్లారా జెట్కిన్ చెప్పినట్లు ఫాసిస్టు శక్తులు ద్రవ్య పెట్టుబడి చేతుల్లో కావలి కుక్క వంటివి. అందువలన ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు సాంఘిక పార్వ్శంలో హిందూత్వ శక్తులను మట్టుబెట్టడానికి జరిగే పోరాటంలో మిళితం కావాలి.
(వ్యాసకర్త సిపిఎం తూర్పు కృష్ణా జిల్లా కార్యదర్శి)