* రోజువారీ విచారణ ప్రారంభించిన బాంబే హైకోర్టు
భీమా కోరెగావ్ ఘటనకు సంబంధించి పలువురు సామాజిక ఉద్యమకారులు, మానవ హక్కుల న్యాయవాది అరెస్టై ఆగస్టు 28 నాటికి ఏడాది గడిచింది. ఈ కేసులో తెలుగు రచయిత వరవరరావు, సామాజిక ఉద్యమకారుడు గౌతం నవ్లకాలతో పాటు న్యాయవాది సుధా భరద్వాజ్, ఉద్యమకారులు వెర్నన్ గాన్స్లోవ్స్, అరుణ్ ఫెర్రీరాలను ఆగస్టు 28, 2018న పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో భరద్వాజ్, గాన్స్లోవ్స్, ఫెర్రీరాలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై రెండు రోజులు క్రితం ఆగస్టు 27, బాంబే హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. సెషన్స్ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్దారులైన భరద్వాజ్, గాన్స్లోవ్స్ తరపున సీనియర్ న్యాయవాదులు మిహెర్ దేశారు, యుగ్ మోహిత్ చౌదరి వాదనలు కోర్టులో వాదనలు వినిపించారు. తమ క్లైంట్ల అరెస్టునకు కారణాలు సారూప్యంగా ఉన్నప్పటికీ, వారి బెయిల్ దరఖాస్తులు వేర్వేరు కారణాలపై దాఖలు చేయబడ్డాయని పేర్కొన్నారు. ఈ ముగ్గురు నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు చూపడంలో పూణె పోలీసులు విఫలమయ్యారని, అందువలన వీరిని విడుదల చేయాలని కోరారు. చిన్న కారణాల వలనే ఈ అరెస్టులు జరిగాయని కోర్టుకు తెలిపారు.
భీమా కోరెగావ్ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 1న మహారాష్ట్రలోని పూణెలో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. 1818 కాలంలో ఎంతో బలవంతమైన పీష్వా బాజీరావ్ సైన్యాన్ని అప్పటి బ్రిటీష్ సైన్యంలో భాగంగా ఉన్న మహర్(చర్మ కార్మికులు) వర్గానికి చెందిన సైనికులు ఓడించారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతిఏటా ఈ సంబరాలు చేసుకుంటుంటారు. ఇందులో భాగంగా బీమా కోరెగావ్ విజయానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 31, 2017న ఒక కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఇది ఈ తరువాతి రోజు పూణె జిల్లాలోని కోరెగావ్-బీమా గ్రామంలో హింసాత్మక ఘటనకు దారితీసిందన్న ఆరోపణలతో పోలీసులు దేశవ్యాప్తంగా శోధాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా పై అరెస్టులు జరిగాయి. దళితులపై హింసను ప్రేరేపించినందుకు శంభాజీ భిడే, మిలింద్ ఎక్భోటేలపై జనవరి 2, 2018న ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే ఈ ఇద్దరు హిందూ అతివాద నాయకులను రక్షించేందుకు సామాజిక ఉద్యమకారుల అరెస్టులు జరిగాయనేది ఒక ఆరోపణ.
అదే ఏడాది జూన్ 8న మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సురేంద్ర గాడ్లింగ్, సుధిర్ ధావలే, రోనా విల్సన్, సోమా సేన్, మహేష్ రౌత్లను పూణె పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తొమ్మిది మంది సామాజిక ఉద్యమకారుల ఇళ్లలో అధికారులు శోదాలు జరిపి, ఆగస్టు 28, 2018న ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెర్రీరా, గౌతం నవలకా, వెర్నోన్ గాన్స్లోవ్స్లు ఉన్నారు. వీరిని హౌస్ అరెస్టులో ఉంచమని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం సెప్టెంబర్ 17 వరకూ హౌస్ అరెస్టును పొడిగించింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్న అభ్యర్ధనను కోర్టు మరో నాలుగు వారాలు పెంచింది. విచారణ అధికారులు వీరిని ‘అర్బన్ నక్సల్స్’గా అభివర్ణించారు.
(Courtacy Prajashakti)