దిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మరింత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఆగస్టు 31తో ముగియనున్న గడువును సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండేళ్లలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 2019 జులైలో ఆ గడువును మరో 9 నెలలు, ఈ ఏడాది మేలో మరోసారి ఆగస్టు 31 వరకు గడువును పొడిగించింది. విచారణ ఓ కొలిక్కి వచ్చిందని, మరోసారి గడువు పొడిగించాలంటూ తాజాగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్ కోరిన నేపథ్యంలో ఈ సారి మరో నెల రోజులు గడువు పొడిగించింది.
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొటుంటున్న అడ్వాణీ, జోషి ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. 100 ప్రశ్నలను సీబీఐ న్యాయస్థానం సంధించగా.. తనపై వచ్చిన ఆరోపణలను అడ్వాణీ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా తమను ఈ కేసులో ఇరికించారని మురళీ మనోహర్ జోషి కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్, ఉమా భారతి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరో ముగ్గురు వృద్ధాప్యంతో కన్నుమూశారు.
Courtesy Eenadu