- అహ్మద్ పటేల్ నేతగా రాజ్యసభ కమిటీ
- చీఫ్ విప్గా జైరామ్ రమేశ్
- లేఖాస్త్రంపై గాంధీల తొలి ఎదురుదాడి
- విమర్శించిన వారు ఒక్క ఎన్నికలోనూ
- గెలవలేరని ఆజాద్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నాయకత్వ తీరును ప్రశ్నిస్తూ, సంస్కరణలు కోరుతూ లేఖ రాసిన 23 మంది సీనియర్లపై గాంధీల త్రయం ఎదురుదాడి ఆరంభించింది. లేఖ రాసిన వారిలో అత్యంత సీనియర్ అయిన గులాంనబీ ఆజాద్ పదవికి ఎసరుపెట్టింది. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఆయన అధికారాలకు పూర్తిగా కత్తెర వేసింది. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ నేతగా, గాంధీల వీరవిధేయుడైన ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ సభ్యుడిగా ఓ కమిటీని రాజ్యసభ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. రాజ్యసభలో చర్చకొచ్చే అంశాలపై పార్టీ వైఖరిని ఇక మీదట వీరే సమన్వయం చేస్తారు.
వీరితో పాటు చీఫ్ విప్గా జైరామ్ రమేశ్ను కూడా సోనియా నియమించారు. అంటే- విపక్ష నేత హోదా ఉన్నప్పటికీ ఆజాద్ ఇక దేనిపైనా స్వతంత్రంగా వ్యవహరించలేరు. ఆయనే కాదు, ఉప నేతగా ఉన్న ఆనంద్ శర్మకీ అదే గతి! ఆనంద్ శర్మ కూడా ఆ 23 మందిలో ఒకరు, లేఖ రూపకర్త కూడా! వీరిరువురినీ కత్తిరించడమే ఏకైక లక్ష్యంగా తాజా నిర్ణయాలు జరిగాయంటున్నారు. మీడియాలో ప్రతికూల కథనాలు రాకుండా ఉండే దృష్టితో ….లోక్సభలో సైతం గౌరవ్ గొగోయ్ను ఉపనేతగా, రణవీత్ సింగ్ బిట్టూను విప్గా నియమించారు. వీరిద్దరూ కూడా సోనియా విధేయులే! లోక్సభలో పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న శశి థరూర్, మనీశ్ తివారీలను కట్టడి చేసే లక్ష్యంతో తాజా నియామకాలు జరిగాయి. ఆజాద్, ఆనంద్ శర్మల పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత దిగజారవచ్చని, పార్టీ వారిని పూర్తిగా పక్కన పెడుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే వర్షాకాల సమావేశాలు ముగిశాకే- లేఖ రాసిన వారిని పూర్తిగా కట్టడి చేయడం జరుగుతుందని, సోనియా అప్పటిదాకా వేచి చూస్తారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పరిణామం జరగకముందు- గురువారం ఉదయం.. గులాంనబీ ఆజాద్ మరోసారి హైకమాండ్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కిందిస్థాయి నుంచి ఎన్నికలు జరపాలని అంటూ- ‘ ఎన్నిక జరిగితే పార్టీలో కనీసం 51ు మంది మద్దతుంటుంది. అదే అధ్యక్షుడిగా ఎవరినైనా నియమిస్తే అటువంటి వారికి కనీసం 1 శాతం మంది మద్దతు కూడా ఉండదు. ఎన్నిక ద్వారా సీడబ్ల్యూసీ సభ్యులైతే వారినెవరూ తొలగించలేరు. అలాంటపుడు మరేంటి ఇబ్బంది?’ అని అన్నా రు. తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటూ అంబికా సోనీ, సెల్జా సహా చాలా మంది డిమాండ్ చేయడంతో ఆయన వారిపైనే కాకుండా … రాహుల్ కోటరీనుద్దేశించి కూడా ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఎన్నికలు జరిపి పార్టీని పటిష్టం చేయాలి. మా లేఖ ఉద్దేశం అదే. మా లేఖను విమర్శించేవారు కనీసం ఒక్క ఎన్నికలోనూ గెలవగలిగిన వారు కాదు’ అని ఆయన విరుచుకుపడ్డారు. సీడబ్ల్యూసీ భేటీ తరువాత సోనియా, రాహుల్ ఇద్దరూ ఆజాద్తో వ్యక్తిగతంగా మాట్లాడారు. అయినప్పటికీ ఆజాద్ తాజాగా ఈ విమర్శలకు దిగడం విశేషం. మరోవైపు- లేఖపై సంతకం చేసిన నేతల్లో ఒకరైన జితిన్ ప్రసాదపై ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లా కాంగ్రెస్ యూనిట్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ యూనిట్ డిమాండ్చేసింది. జితిన్ ప్రసాదను టార్గెట్ చేసూ తీర్మానం చేయడాన్ని దురదృష్టకరమైన చర్యగా సీనియర్ నేత కపిల్ సిబ్బల్ ట్వీట్చేశారు. సొంతనేతల్ని టార్గెట్ చేయడానికి ఉపయోగించే శక్త్తిసామర్థ్యాలు బీజేపీపై గురిపెట్టడానికి వినియోగించాలని ఆయన హితవు చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందిస్తూ – జితిన్పై విమర్శల దాడి ఊహించినదేనన్నారు. కాగా, దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమున్నందువల్ల కాం గ్రెస్ ఈ సంక్షోభం నుంచి బయటపడి- పుంజుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.
Courtesy Andhrajyothi