- పాత దరఖాస్తులకు మోక్షం
- ఉమ్మడి మెదక్లో 36963 మంజూరు!
- పెండింగ్లో 4 లక్షల దరఖాస్తులు?
- ఏడాదిగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు లేవు
- దుబ్బాక, సిద్దిపేట ఎన్నికల కోసమేనా!?
- త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ మంజూరు?
హైదరాబాద్ : అపరిష్కృతంగా ఉన్న ఆసరా దరఖాస్తులకు మోక్షం కలగనుందా? ఏడాదికాలంగా ఎటూ తేల్చకుండా ఉన్న ఈ దరఖాస్తుదారులకు ఊరట లభించనుందా? అంటే అవుననే తెలుస్తోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు త్వరలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట మునిసిపాలిటీలతో పాటు మరికొన్ని మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ జారీ అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం సాధ్యం కాదు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసరా పింఛను పెండింగ్ దరఖాస్తుదారులందరికీ ఈ నెలలోనే మంజూరు చేయడం గమనార్హం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, గీత, చేనేత, బీడీ కార్మిక పింఛన్ల జాబితాలో కొత్తగా 36,963 మంది చేరారు. మెదక్ జిల్లాలో 10528, సంగారెడ్డి జిల్లాలో 9499, సిద్దిపేట జిల్లాలో 16928 మంది ఉన్నారు. అయితే, కొత్త పింఛన్లు కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైనట్లు సమాచారం. ఆగస్టు నెల పింఛను ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్లలో ఒక్క దుబ్బాక నియోజకవర్గం పరిధిలోనే 4-5 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు సమాచారం. దీంతో దుబ్బాకలో అధికార పార్టీ పట్ల మరింత సానుకూలత పెరుగుతుందని భావిస్తున్నారు. మెదక్ జిల్లాలో అపరిష్కృత దరఖాస్తులకు పింఛను మంజూరు చేయడంతో మిగిలిన దరఖాస్తుదారులు తమకెప్పుడు ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
పెండింగ్లో 4 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో ఆసరా పింఛను లబ్ధిదారులు 38,50,562 మంది ఉన్నారు. వృద్ధాప్య, వికలాంగ, వితంతు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, హెచ్ఐవీ బాధితులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్నారు. నెలకు వికలాంగులకు రూ.3016, ఇతరులకు రూ.2016 చొప్పున ఇస్తున్నారు. ఈ పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తులను తరచూ పరిశీలించి మంజూరు చేసేవారు. కానీ, రాష్ట్రంలో ఏడాదికి పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తవి మంజూరు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నట్లు అఽధికారులు చెబుతున్నారు. మరో ఆరు నెలల్లో సిద్దిపేట మునిసిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మరికొన్ని మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండడంతో త్వరలోనే రాష్ట్రంలోని పెండింగ్ దరఖాస్తులన్నింటికీ మోక్షం కలిగిస్తారన్న భావన వ్యక్తమవుతోంది.
57 ఏళ్లు.. ఇంకా పెండింగ్లోనే..
ఆసరా పింఛన్లలో వృద్ధాప్య విభాగం కింద అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంది. వయసును కుదించడం వల్ల దాదాపు 7.5 లక్షల మంది అదనంగా అర్హత పొందనున్నారని అంచ నా వేశారు. కానీ, ఈ నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది.
Courtesy Andhrajyothi