రాజస్థాన్లో ఘటన
ఓ వడ్డీ వ్యాపారి రూ.50 లక్షల బీమా డబ్బు కోసం తనను తాను హత్య చేయించుకున్నాడు. రాజస్థాన్లోని భీల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భీల్వారాకు చెందిన బల్బీర్ ఖారోల్ (38) వడ్డీ వ్యాపారి. స్థానికులకు 6 నెలల కిందట ఆయన రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వారి నుంచి అప్పులు వసూలు చేసుకోలేకపోయాడు. గత నెల ఓ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నా డు. ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోనందున తీవ్ర ఆందోళన చెంది మంచాన పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. తాను మరణిస్తే బీమా పాలసీ డబ్బైనా వచ్చి తన కుటుంబం సంతోషంగా బతుకుతుందని భావించాడు. తనను హతమార్చేందుకు రాజ్వీర్ సింగ్, సునీల్ యాదవ్ అనే ఇద్దరితో మాట్లాడాడు. తనను హత్య చేస్తే ఇద్దరికీ చెరో రూ.80 వేలు ఇస్తానన్నాడు. ముందుగా ఇద్దరికీ చెరో రూ.10 వేలు చెల్లించాడు. పథకం ప్రకారం ఈ నెల 2న ముగ్గురూ కలిసి భీల్వారాలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మిగతా డబ్బు తన జేబుల్లో ఉందని, తనను చంపి ఆ డబ్బు తీసుకోవాలని బల్బీర్ చెప్పాడు. నిందితులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి గొంతు పిసికి చంపారు. సీసీటీవీ ఫుటేజీలు, మృతుడి కాల్డేటా ఆధారంగా రాజ్వీర్ సింగ్, సునీల్ యాదవ్లను అరెస్టు చేశారు. బల్బీర్కు భార్య, పిల్లలు, తల్లిదండ్రులున్నారు.
Courtesy Andhrajyothi…