* ఒక్కొక్కటిగా నష్టాల ఊబిలోకి
* ఆధునీకరణ ఊసెత్తని సర్కారు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి:
సహకార చక్కెర కర్మాగారాలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. పురాతన యంత్రాలు, ప్రతి ఏటా తగ్గుతున్న సాగు..క్రషింగ్ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ధర విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ప్రైవేటుకు మేలు చేయగా, కష్టాల్లో ఉన్న సహకార ఫ్యాక్టరీలను మరింతగా నష్టాలోకి కూరుకుపోతున్నాయి.సలహ ధరలతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండి చేయి చూపించడంతో ఈ పరిశ్రమలు రోజురోజుకూ నిర్వీర్యమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పది సహకార ఫ్యాక్టరీలకు ఐదు మూతబడగా, భీమసింగితో పాటు తుమ్మపాల, చోడవరం, ఏటికొప్పాక, తాండవ కర్మాగారాలు దినదిన గండంగానే మనుగడ సాగిస్తున్నాయి.
జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో సహకార ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామని, మూతబడ్డ వాటిని తెరిపిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అధికారం చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నా… ప్రభుత్వం ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారంపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 14 మండలాలకు చెందిన 5వేల మందికిపైగా రైతులతో పాటు 500 మంది కార్మికులు, పరోక్షంగా మరో 50వేల మంది వ్యవసాయ కూలీలు ఆధారపడి ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్ధ్యం 1.60లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం 60వేల టన్నులు కూడా క్రషింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో రూ.44కోట్ల మేర అప్పులతో యాజమాన్యం నెట్టుకొస్తుంది. అలాగే 1.70లక్షల టన్నుల క్రషింగ్ సామర్ధ్యం గల ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు సగానికిపైగా క్రషింగ్ పడిపోయి ప్రస్తుతం 80వేల టన్నులకు మించి ఆడడం లేదు. అలాగే 5.70లక్షల టన్నుల క్రషింగ్ సామర్ధ్యం గల చోడవరం 4లక్షల టన్నులకు పడిపోయింది. గత ఆరు నెలలుగా మూతబడ్డ అనకాపల్లి సహకార కర్మాగారం గత ఏడాది క్రషింగ్ జరిపినా నష్టాలతోనే సతమతమవుతోంది. ఇలా రాష్ట్రంలో సహకార ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్ధంగా మారింది.
క్రషింగ్ పెరిగితేనే మనుగడ
సహకార ఫ్యాక్టరీలు మనుగడ సాధించాలంటే క్రషింగ్ పెరగాల్సి ఉంది. భీమసింగి సుగర్స్ 40 ఏళ్లనాటి యంత్రాలతో తరుచూ మరమ్మత్తులకు గురవుతోంది. రోజుకు 1,250 టన్నుల క్రషింగ్ సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీ ఆధునీకరించుకుని, 2,500 టన్నులు రోజువారి క్రషింగ్ స్థాయిని పెంచుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. అప్పుడే ప్రైవేటు ఫ్యాక్టరీలకు ధీటుగా సహకార కర్మాగారాలు నిలబడతాయి. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో 1200 ఎకరాల్లో మొక్కతోట, 4,300 ఎకరాల్లో కార్షి తోట ద్వారా 1.20లక్షల మెట్రిక్ టన్నుల చెరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చెరకు సాగు పెరిగేందుకు రైతులకు ప్రభుత్వం రాయితీలు అందించాలి. ఇలా భీమసింగితో పాటు సహకార ఫ్యాక్టరీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రణాళికాబద్ధంగా ఆదుకోవాల్సి ఉంది.
రాష్ట్ర సలహా ధర ప్రకటించాలి
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.2750ల ధరనే గిట్టుబాటు ధరగా ప్రకటించడంతో రైతులు చెరకు పంటకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ప్రకటించాలి. ఆధునీకరణకు సుగర్ డెవలప్ ఫండ్ నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి. సహకార ఫ్యాక్టరీలకు పాలకమండలి ఎన్నికలు నిర్వహిస్తే షేర్హోల్డర్సే వాటి అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుంది.
– మర్రాపు సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు.
Courtesy Prajasakthi.