ఓటింగ్ తీరుతెన్నులను గమనిస్తే దాదాపు సగం మంది ఓటర్లు ప్రస్తుత అధ్యక్షుడి పక్షానికే ఓటువేసినట్టు స్పష్టమవుతోంది. సెనేట్లో రిపబ్లికన్లు తమ ఆధికత్యతను నిలబెట్టుకున్నారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ పక్షంగా ఉంది. కొత్త కాంగ్రెస్లో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమవనుంది. అమెరికా రాజకీయ వ్యవస్థే ఈ ఘర్షణకు ప్రధాన కారణం. ఒక దేశం ఉదారవాద ప్రజాస్వామ్యవ్యవస్థగా ఉంటుందా లేదా మితవాదం వైపు మొగ్గుతుందా అనేది ఒక అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉండడం అమితంగా భయపెడుతోంది.
అమెరికా ప్రజలు తమ తదుపరి అధ్యక్షుడుగా (దాదాపుగా) జో బైడెన్ను ఎన్నుకున్నారు. ఈ నెల 3న జరిగిన ఎన్నికలు చాలా వరకు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగాయి. కొత్త అధ్యక్షుడు తన బాధ్యతలను ఎటువంటి అవాంతరాలు లేకుండా చేపడతారని అమెరికన్లు విశ్వసిస్తున్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతగా బెదిరింపులకు పాల్పడినా ఫలితం లేకపోయింది. శ్వేత సౌధం నుంచి ఆయన నిష్క్రమించాలని కోరుకున్న వారే అధికంగా ఉన్నారని ఫలితాలు స్పష్టం చేశాయి.
నవంబర్ 3 ఎన్నికలు చాలవరకు ‘స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా’ జరిగాయని అన్నాను. ఎందుకంటే తొలి ఓటింగ్ ప్రక్రియలను నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి; కొన్ని రకాల తొలి ఓట్ల (డ్రైవ్ -ఇన్ ఓటింగ్ ఇందుకొక ఉదాహరణ)ను లెక్కించకూడదని వివిధ రాష్ట్రాలలో కేసులు దాఖలయ్యాయి; ఓట్ల లెక్కింపును పరిమితం చేయాలన్న పిటీషన్లను కోర్టులు అంగీకరించాయి; ట్రంప్ ప్రచార యంత్రాంగం మూడు రాష్ట్రాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దావాలు కూడా వేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు అమెరికా ప్రజలకు మాత్రమే కాక, యావత్ ప్రపంచానికీ ముఖ్యమైనవి. అమెరికా ఆర్థిక, సైనిక, సాంకేతికతా శక్తి సామర్థ్యాలే అందుకు కారణమని చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలలో ఎంతగా ప్రతికూలతలను ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా ఇప్పటికీ ఏ దేశమూ విస్మరించలేని ప్రపంచ ఏకైక అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది. కాంగ్రెస్ దిగువ సభ ప్రతినిధుల సభ (సభ్యుల సంఖ్య435) కు ప్రతి రెండేళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతాయి. సమస్త ఆర్థిక అధికారాలు ఈ సభకే ఉన్నాయి. ఎగువసభ సెనేట్ లోని మూడోవంతు స్థానాలకు ప్రతి రెండేళ్ళకొకసారి జరుగుతాయి. ప్రభుత్వ వ్యవస్థలోని కీలక నియామకాలపై ఈ సభకు సంపూర్ణ అధికారాలున్నాయి. ఫెడరల్ మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సెనేట్ ఆమోదం తప్పనిసరి. సెనేట్ సలహాలను అధ్యక్షుడు పాటించవలసి ఉంటుంది. ప్రతి రెండుసంవత్సరాలకూ, ప్రతి నాలుగుసంవత్సరాలకూ అమెరికా పాలనానౌక తన ప్రస్థాన మార్గాన్ని మార్చుకుంటుంది. కనుకనే అమెరికా ఎన్నికలపై ప్రపంచానికి అంత అమితాసక్తి.
సరే, కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ తన ఎజెండాను పూర్తిగా అమలుపరచగలుగుతారా? సందేహమే. ఎందుకంటే అమెరికా ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యేలేమిటో చూడండి. మరింతగా విజృంభిస్తున్న కొవిడ్ మహమ్మారి, ఆరోగ్య భద్రత, ప్రతి పౌరునికీ వైద్య సదుపాయాలు కల్పించే చట్టం, వలసలు, జాతి వివక్ష, జెండర్ సమానత్వం, గర్భస్రావం, పెరుగుతోన్న ఆర్థిక అసమానతలు, మిత్ర దేశాలతో సంబంధాలు, రష్యాతో సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, సంరక్షణ విధానాలు వెర్సెస్ స్వేచ్ఛా వాణిజ్యం, చైనా విస్తరణ వాదం మొదలైనవి. ఓటింగ్ తీరుతెన్నులను గమనిస్తే దాదాపు సగం మంది ఓటర్లు ప్రస్తుత అధ్యక్షుడి పక్షానికే ఓటువేసినట్టు స్పష్టమవుతోంది. సెనేట్లో రిపబ్లికన్లు తమ ఆధికత్యతను నిలబెట్టుకున్నారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ పక్షంగా ఉంది. కొత్త కాంగ్రెస్లో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఘర్షణ మరింత తీవ్రమవనుంది.
అమెరికా రాజకీయ వ్యవస్థే ఈ ఘర్షణకు ప్రధాన కారణం. ఒక దేశం ఉదారవాద ప్రజాస్వామ్యవ్యవస్థగా ఉంటుందా లేదా మితవాదం వైపు మొగ్గుతుందా అనేది ఒక అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉండడమనే వాస్తవం అమితంగా భయపెడుతోంది. 2016 నుంచి పలు దేశాలు మితవాదం వైపు మొగ్గాయి. మన ఆసియా ఖండంలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మియన్మార్, థాయిలాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ ఇందుకు ఉదాహరణలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అధికారాలు, అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థలో అధ్యక్షుడి అధికారాలు పరస్పరం పూర్తిగా భిన్నమైనవి. అయితే ఇప్పుడు ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న తేడాలు అస్పష్టమవుతున్నాయి. మన దేశంలో ప్రధానమంత్రి కార్యాలయం అపరిమిత అధికారాలను సంతరించుకున్నది. ప్రభుత్వాధినేత అమెరికా అధ్యక్షుడికి ఉండే మహా శక్తిమంతమైన అధికారాలు అన్నిటినీ చెలాయిస్తున్నాడు! రుణాలు తీసుకోవడం, వివిధ రంగాలలో వ్యయాలు చేయడం, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా వాటి నుంచి ఉపసంహరించుకోవడం, ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, యుద్ధాలకు వెళ్ళడం మొదలైన అంశాలలో అమెరికా అధ్యక్షుడికి ఉండే అధికారాలన్నిటినీ పార్లమెంటరీ వ్యవస్థలోని ప్రభుత్వాధినేత చెలాయించడం ఒక వైపరీత్యం కాదూ? నిజమైన పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలను తన కేబినెట్ మంత్రులతో కలిసి పంచుకోవాలి.
కేబినెట్ నిర్ణయాల ప్రకారం పాలన జరగాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రధానమంత్రి సమానుల్లో ప్రథముడు మాత్రమే. చట్టం ప్రకారం పార్లమెంటు లేదా పార్లమెంటరీ కమిటీలకు ప్రధానమంత్రి విధిగా ప్రతి రోజూ జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి వ్యయాన్నీ పార్లమెంటు ఆమోదించి తీరాలి.
దురదృష్టవశాత్తు అధికారలాలసులు అయిన ప్రధాన మంత్రులు యథార్థ అధ్యక్షులు కాగోరుతున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఇది సాధ్యంకాని పక్షంలో గోప్య పద్ధతుల్లో అధ్యక్ష అధికారాలను చెలాయిస్తున్నారు. తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థకు ఎనలేని హాని చేస్తున్నారు. సదరు ప్రధానమంత్రి తన పార్టీలో తిరుగులేని నాయకుడు అయిన పక్షంలో యథార్థ అధ్యక్షుడుగా మారడమనేది ఎలాంటి నిరసనలు, ఆక్షేపణలు లేకుండా జరిగిపోతోంది. ప్రధానమంత్రికి ఉన్న మెజారిటీ, అతడి ప్రజాస్వామిక సహజాతాలు మాత్రమే ఆ ధోరణులకు నిరోధకాలు. భారీ మెజారిటీ ఉండడంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే ప్రవృత్తి అంతగా లేనప్పుడు ప్రధానమంత్రి ఒక అధ్యక్షుడుగా అపరిమిత అధికారాలను చెలాయిస్తాడు.
దురదృష్టవశాత్తు సంపన్న, విద్యాధిక వర్గాల వారు, భావజాల చైతన్యమున్న ఓటర్లు ఒక నిరంకుశ నాయకుడినే కోరుకుంటున్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో సంక్షిష్ట నిరోధ సమతౌల్యాలు ఉంటాయని, అవి పాలనా వ్యవస్థను ప్రజాహితంగా ఉంచగలుగుతాయన్న వాస్తవాన్ని వారు విస్మరించడం శోచనీయం. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం శుభకరం కాదు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నాయకులు అపరిమిత అధికారాలను చెలాయించే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు కొన్ని గౌరవ పూర్వక మినహాయింపులు లేకపోలేదు. అయితే ఆ ధోరణి ఎల్లెడలా మరింత బలవత్తరమవుతుందనేది వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయ సంస్థలు, వ్యవస్థలు యథాతథంగా కొనసాగనిస్తూ వాటిని వాస్తవంగా వివిధ మార్గాలలో నీరుగార్చివేస్తున్నారు. పూర్తిగా తమకు విధేయులైన వ్యక్తులను కీలక పదవులలో నియమించడం, బలహీన చట్టాలను ఆమోదించడం, నిధుల మంజూరును నిరాకరించడం, బ్యూరాక్రటిక్ అవరోధాలు కల్పించడం, మరీ ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడడం మొదలైన పద్ధతులతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు. ఈ పరిణామాలు మనకు సుపరిచితమైనవే కావూ? ఎన్నికల సంఘం, సమాచార కమిషన్, ఆర్థిక సంఘం, వివిధ జాతీయ మానవహక్కుల సంఘాలు, మహిళల, బాలల, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తరగతుల, మైనారిటీల కమిషన్లు నిజమైన రాజ్యాంగ సంస్థలుగా వ్యవహరించగలుగుతున్నాయా? ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపడమనే సంప్రదాయాన్ని పాలకులు పాటించడమే లేదు. రాష్ట్రాలకు నిధుల మంజూరును నిరాకరించడం లేదా రాష్ట్రాల పరిధిలోని అంశాలపై పార్లమెంటులో చట్టాలు చేయడం, శాసన వ్యవస్థ అధికారాలను బలహీనపరచడం తదితర చర్యల ద్వారా సమాఖ్య పాలనా విధానంలో అధికారాల కేంద్రీకరణ ప్రక్రియ వేగవంతమవుతుంది.
ప్రపంచంలో చాలా కొద్ది దేశాలలో మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలలో మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని దేశాలలో కూడా ఉంటే ఉండవచ్చు. అయితే మొత్తం మీద ప్రజాస్వామ్య దేశాలుగా పరిగణన పొందుతున్న దేశాలు వాస్తవానికి ప్రజాస్వామ్య దేశాలు కావు. ప్రపంచపు అతి పురాతన ప్రజాస్వామ్య దేశం రూపొందించిన ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఆ దేశాలలో వర్థిల్లడం లేదు. అసలు ఆ అతి పురాతన ప్రజాస్వామిక దేశంలోనే ఆ సమున్నత సంప్రదాయాలు విలసిల్లడం లేదు. ఇతరులను వేలెత్తిచూపేముందు ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం తన సొంత ప్రజాస్వామ్య అర్హతలను పునఃపరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
Courtesy Andhrajyothi