- అమెరికా ఎఫ్డీఏ ఆమోదంతో థెరపీపై పెరిగిన అంచనాలు
- ఈ నెలలో రావాల్సిన ఐసీఎంఆర్
- మార్గదర్శకాలపైనే అందరి దృష్టి
- గాంధీలో నిర్వహించిన క్లినికల్
- ట్రయల్స్లో మిశ్రమ ఫలితాలు
- దేశవ్యాప్త ట్రయల్స్ ఫలితాలను
- ఇప్పటికే సేకరించిన ఐసీఎంఆర్
- పచ్చజెండా ఊపితే.. ఆస్పత్రుల్లో
- ప్లాస్మా చికిత్సకు అవకాశం
హైదరాబాద్: కరోనా రోగుల చికిత్సకు అత్యవసర ప్రాతిపదికన ప్లాస్మా థెరపీని వినియోగించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) పచ్చజెండా ఊపడంతో, ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి దానిపై పడింది. ఈనేపథ్యంలో మనదేశంలో ప్లాస్మా థెరపీ వాడకానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఎప్పుడు అనుమతులు ఇస్తుందా అని వైద్యరంగం ఎదురుచూస్తోంది. ఎఫ్డీఏ తాజా నిర్ణయంతో.. యుద్ధ ప్రాతిపదికన ప్లాస్మా చికిత్సకు మార్గాన్ని సుగమం చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతితో గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా పలువురు కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స చేశారు.
నాలుగు రోజుల క్రితమే కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి హైదరాబాద్లో తొలి ప్లాస్మా బ్యాంకును కూడా ప్రారంభించారు. ఒకవేళ ఈ చికిత్సను మరింత మందికి విస్తరించాలంటే ఐసీఎంఆర్ నుంచి అధికారిక అనుమతులు మంజూరు కావాల్సిందే. ఇప్పుడు అందరి చూపు ఐసీఎంఆర్ వైపే ఉంది. దేశవ్యాప్తంగా అది ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నిర్వహించిన ప్లాస్మా థెరపీ ప్రయోగ పరీక్షల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆస్పత్రుల జాబితాలో మన గాంధీ దవాఖాన కూడా ఉంది. ఇందులో ప్లాస్మా చికిత్స చేయించుకున్న కరోనా రోగుల్లో కొందరు కోలుకోగా, మరికొందరి ఆరోగ్య స్థితిగతుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. గాంధీ సహా ప్లాస్మా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ఆస్పత్రుల నుంచి వైద్య నివేదికలను ఐసీఎంఆర్ ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. వాటన్నింటిని క్రోడీకరిస్తే ఏం తేలింది ? దాని ఆధారంగా ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ ఏ అభిప్రాయానికి వచ్చింది ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఒకవేళ ఐసీఎంఆర్ అనుమతి మంజూరైతే దాన్ని అధికారికంగా వాడే వెసులుబాటు కలుగుతుంది. వాస్తవానికి ఈ నెల(ఆగస్టు)లోనే ప్లాస్మా థెరపీకి సంబంధించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేయాల్సి ఉండగా, ఇంకా అవి రాలేదని అధికారవర్గాలు అంటున్నాయి. ప్లాస్మా చికిత్సపై అమెరికా ఎఫ్డీఏ బాటలోనే ఐసీఎంఆర్ కూడా పయనించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ప్లాస్మా సేకరణకు ప్రాతిపదిక..
కరోనా రోగులందరికీ ప్లాస్మా చికిత్స అవసరం ఉండదని.. తీవ్ర, మోస్తరు ఇన్ఫెక్షన్ కలిగిన వారికే దాన్ని అందించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్తో ఆరోగ్యం విషమించిన వారికి ఈ చికిత్స చేయడం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించే ప్లాస్మాలో ప్రతిరక్షకాలు (యాంటీబాడీ) సమృద్ధిగా ఉండాలి. ఒకవేళ యాంటీబాడీలు అతి తక్కువగా ఉన్న ప్లాస్మాను సేకరించి చికిత్స చేస్తే ఉపయోగం ఉండదు. ప్లాస్మా చికిత్స విజయవంతమయ్యే రేటు ఎంత ఉందనే విషయంపైనా ఇప్పటివరకు వైద్య నిపుణులు ఒక స్పష్టతకు రాలేకపోయారని వైద్యరంగ పరిశీలకులు అంటున్నారు. ప్లాస్మాదాతలో యాంటీబాడీలు ఎంతమేర వృద్ధిచెందాయి ? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కోలుకున్న వారందరినీ ఒకేగాటన కట్టి, ప్లాస్మాను సేకరించి 50 మందికి చికిత్స అందించి, నలుగురికే నయమైందని చెప్పే గణాంకాల్లో కచ్చితత్వం ఉండదని వాదిస్తున్నారు.
శరీరంలోకి ప్రవేశించిన అనంతరం కరోనా వైరస్ వారం నుంచి పది రోజుల పాటు క్రియాశీలంగా ఉంటుంది. మొదటి 8 రోజులు మాత్రం చాలా వేగంగా కార్యకలాపాలు సాగిస్తుంటుంది. సరిగ్గా ఈసమయంలో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స అందిస్తే బాగుంటుంది. తద్వారా రెండోవారంలో పొంచి ఉండే సైటోకైన్ స్టార్మ్ గండాన్ని గట్టెక్కవచ్చు. ఒకవేళ సైటోకైన్లు ఎక్కువైతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హైరిస్కు ఉన్నవారికి సరైన సమయంలో ప్లాస్మా చికిత్స చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 14 రోజులు గడిచాకే ప్లాస్మాదానం చేయాలి. 20వ రోజు వరకు వేచిచూస్తే మరీ మంచిది. ఎందుకంటే.. అప్పటివరకు ఐజీజీ రకం యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అవి కొన్ని నెలలపాటు శరీరంలోనే ఉంటూ కరోనా వైరస్ను నిర్వీర్యం చేస్తుంటాయి.
ఎఫ్డీఏ నిర్ణయం ప్రామాణికం
ప్లాస్మా చికిత్స విషయంలో ఐసీఎంఆర్ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది. ఆ తర్వాతే మనదగ్గర కొవిడ్ ట్రీట్మెంట్ ప్రొటోకాల్లో ప్లాస్మా చికిత్స ఉంటుందా, ఉండదా అనేది తేలుతుంది. ప్లాస్మా థెరపీపై అమెరికా ఎఫ్డీఏ నిర్ణయం ప్రామాణికంగా ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఉండే అవకాశం లేకపోలేదు.
–డాక్టర్ రమేశ్రెడ్డి, వైద్య విద్య సంచాలకులు
అది అంతర్జాతీయ గుర్తింపే
ప్లాస్మా థెరపీకి ఎఫ్డీఏ అనుమతి లభించడమంటే.. అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టే. కరోనాను కట్టడి చేసే యాంటీబాడీలు సమృద్ధిగా ఉన్న ప్లాస్మాను రోగికి అందిస్తేనే ఫలితం వస్తుంది. మోస్తరు ఇన్ఫెక్షన్ కలిగిన రోగులపై ఈ చికిత్స ప్రభావవంతంగా పనిచేస్తోంది.
–డాక్టర్ మాదల కిరణ్, హెచ్వోడీ క్రిటికల్ కేర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్
కొందరు బాగా కోలుకుంటున్నారు
మా ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ప్రారంభించి రెండు నెలలైంది. స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్ ఇచ్చినా రోగి స్పందించని సమయంలోనే ప్లాస్మాథెరపీ చేస్తున్నాం. ఈ థెరపీలో కొంతమంది అద్భుతంగా కోలుకుంటున్నారు. ఆరోగ్యం బాగా విషమించిన వారిపై ఇది పనిచేయడం లేదు.
డాక్టర్ శ్రీధర్, క్రిటికల్ కేర్ ఫిజీషియన్, ఐసీయూ ఇన్చార్జి, అపోలో ఆస్పత్రి, జూబ్లీహిల్స్, హైదరాబాద్
Courtesy Andhrajyothi